అశోక్‌ గెహ్లాటా లేదా సచిన్‌ పైలటా?

4 Dec, 2018 18:37 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రాజస్థాన్‌ అసెంబ్లీకి ఏడవ తేదీన జరుగనున్న ఎన్నికల్లో పాలకపక్ష బీజేపీ గెలుస్తుందా లేక కాంగ్రెస్‌ పార్టీ గెలుస్తుందా ? అన్న విషయాన్ని స్థానిక ప్రజలెవరూ మాట్లాడుకోవడం లేదు. వారంతా తదుపరి ముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌ అవుతారా ? అశోక్‌ గెహ్లాట్‌ అవుతారా? అని చర్చించుకుంటున్నారు. జో«ద్‌పూర్‌లో గతవారం జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ పార్టీకి సచిన్‌ పైలట్, అశోక్‌ గెహ్లాట్‌ చేస్తున్న సేవల గురించి ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన ముందుగా మూడుసార్లు సచిన్‌ పైలట్‌ పేరును ప్రస్తావించి, ఆ తర్వాత రెండుసార్లు గెహ్లాట్‌ పేరును ప్రస్తావించడంతో రాహుల్, పైలట్‌వైపు మొగ్గుచూపుతున్నారని ప్రేక్షకులు భావించారు.

ఇక ఆ మరుసటి రోజు నుంచి ఇరువురిలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారన్న చర్చ మొదలయింది. జో«ద్‌పూర్‌ నుంచి జైపూర్‌ మార్గంలో చిన్న చిన్న పట్టణాలు, పల్లెల్లో ప్రజలను మీడియా ప్రశ్నించగా గెహ్లాట్‌నే సీఎం కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. పాలి గ్రామంలోనైతే కొంత మంది ప్రజలు గెహ్లాట్‌ను రాజస్థాన్‌ గాంధీ అని పిలుస్తున్నారు. ఇక ఆజ్మీర్, దౌసా ప్రాంతాల ప్రజలు మాత్రం సచిన్‌ పైలట్‌నే సీఎంగా కోరుకుంటున్నారు. మహిళలు కూడా ఆయనకే ప్రా«ధాన్యతనిస్తున్నారు. పైలట్‌ దౌసా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న విషయం తెల్సిందే. గెహ్లాట్‌ రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ ఆయనపై ఎలాంటి అవినీతి మచ్చ పడలేదు. పైగా ఆయన రాష్ట్ర అభివద్ధి కోసం చేసిన కషి, ముఖ్యంగా ఆయన ప్రవేశపెట్టిన ఉచిత ఔషధాల పథకాలకు ప్రజల నుంచి ఎంతో ప్రశంసలు వచ్చాయి. ఆయన అనంతరం బీజేపీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వసుంధర రాజె, అధికారంలోకి రాగానే ఉచిత ఔషధాల స్కీమ్‌ను రద్దు చేశారు. కష్టాల్లో, సుఖాల్లో గెహ్లాట్‌ సారు తమకు అండగా నిలబడ్డారని ప్రజలు చెప్పారు. వసుంధర రాజే దర్శనభాగ్యమే ప్రజలకు కలగదని వారంటున్నారు.

అయినప్పటకీ 2003, 20013 ఎన్నికల్లో గెహ్లాట్‌ ఓడిపోయారు. ఇదే ఆయనకు ఆఖరి అవకాశమనే ఉద్దేశంతో గెహ్లాట్‌ను ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారా ? అని ఓ గుంపును ప్రశ్నించగా, ఆ గుంపులోని ఓ ముసలాయన స్పందిస్తూ ‘ మా దగ్గర ముసలోలమే నిర్ణయం తీసుకొని యువతీ యువకులకు చెబుతాం, వారు కూడా మా మాట గౌరవిస్తారు’ అని చెప్పారు. రాజస్థాన్‌లో ఇప్పటికే భూస్వామ్యమే కనిపిస్తోంది. అక్కడ ఎవరైనా గ్రామీణ మహిళను పిల్లలెంత మంది అని అyì గితే బాలురు ఎంతో లెక్కగట్టి చెబుతుంది. బాలికల లేరా ? అని ప్రశ్నిస్తే ‘వో తో లడికియా హై’ అనే సమాధానం వస్తుంది. అక్కడ టీనేజీ అమ్మాయిలను అడిగినా సరే, ‘లడికియోం కే సాత్‌ భేద్‌ భావ్‌ హోతా హై నా’ అని చెబుతారు. సవాయ్‌ మధోపూర్‌ బస్టాండ్‌లో మధ్య వయస్కురాలిని ప్రశ్నించగా సచిన్‌ పైలట్‌ సీఎం కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ‘పైలట్‌ యువకుడు, కష్టపడి పనిచేస్తారు. ‘శక్తికి ప్రతీక, నేడు శక్తే భక్తి’ అని ఆమె వ్యాఖ్యానించారు. ఇక కాంగ్రెస్‌ పార్టీ వర్గాలను కదిలిస్తే గెహ్లాట్, పైలట్‌లో తమకు ఎవరు ముఖ్యమంత్రయినా ఫర్వాలేదని అన్నారు. వారి వారి నియోజక వర్గాల పరిధిని వదిలేసి రాష్ట్ర వ్యాప్తంగా యువత పైలట్‌ను సీఎంగా కోరుకుంటుంటే పెద్దలు పాలనానుభవం కలిగిన గెహ్లాట్‌ను కోరుకుంటున్నారు.

గెహ్లాట్, పైలట్‌ ఇద్దరూ ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నారని, ఆ కారణంగా కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఎక్కువవుతాయని, ప్రజల గురించి పట్టించుకోరని బీజేపీ నాయకులు రాష్ట్రంలో తెగ ప్రచారం చేసిన ప్రజలు పట్టించుకోలేదు. పైగా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ వసుంధర రాజె అభ్యర్థిత్వాన్ని మార్చే దమ్ము మోదీ, అమిత్‌ షాలకు లేకపోయిందని ప్రజలు భావిస్తున్నారు. గత నెల వరకు రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ పార్టీయే విజయం సాధిస్తుందని బీజేపీ మద్దతుదారులు కూడా భావించారు. బికనర్, కిసాన్‌గఢ్‌ ప్రాంతంలోని పది పదిహేను సీట్లలో కాంగ్రెస్‌ టిక్కెట్ల పంపకంలో గందరగోళం జరగడం, రెబెల్స్‌ రంగంలోకి దిగడం వల్ల ఆ సీట్లను కాంగ్రెస్‌ ఓడిపోయే ప్రమాదం ఉందని, ఆ సీట్లు తమకు సానుకూలంగా మారే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు ఆశిస్తున్నాయి. ఎన్నికల ప్రచారం తుది ఘట్టంలో నరేంద్ర మోదీ రాష్ట్రంలో విస్తతంగా ఎన్నికల ప్రచారం చేయడంతో వారిలో కొంత ఉత్సాహం రేకెత్తింది.

మరిన్ని వార్తలు