‘అది పచ్చి అబద్ధం.. ఆయనెవరో కూడా తెలియదు’

16 May, 2018 15:19 IST|Sakshi
మీడియాతో కుమారస్వామి

సాక్షి, బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఊహించినట్లుగానే ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఇవ్వలేదు. అయితే అనంతరం నెలకొన్న రాజకీయా పరిణామాలతో ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై చర్చ జరగుతున్న నేపథ్యంలో భిన్న వాదనలు, వదంతులు తెరపైకి వస్తున్నాయి. బీజేపీ కర్ణాటక ఇన్‌ఛార్జ్‌, కేంద్ర మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ను కాంగ్రెస్-జేడీఎస్‌ కూటమి సీఎం అభ్యర్థి హెచ్‌డీ కుమారస్వామి కలిశారని ప్రచారం జరుగుతోంది. జేడీఎస్‌ తిరుగుబాటు ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతిస్తున్నారన్న నేపథ్యంలో జవదేకర్‌ను తాను కలుసుకున్నానన్నది పచ్చి అబద్ధమని జేడీఎస్ నేత కుమారస్వామి చెప్పారు.

బీజేపీతో సంప్రదింపులు జరిపారన్న వదంతులపై కుమారస్వామి ఘాటుగా స్పందించారు. కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ... ‘జవదేకర్ అంటే ఎవరు. ఆ వ్యక్తి గురించి నాకు తెలియదు. నేను ఏ జవదేకర్‌నుగానీ, బీజేపీ నేతతోగానీ ఇప్పటివరకూ భేటీ కాలేదు. బీజేపీ నేతలెవరూ నన్ను సంప్రదించలేదు. కర్ణాటక పీసీసీ అధ‍్యక్షుడు జి.పరమేశ్వరతో సహా వెళ్లి, మేం మరోసారి గవర్నర్‌ వజుభాయ్‌ రుడాభాయ్‌ వాలాను కలవనున్నాం. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నట్లు’  వివరించారు. కాగా, తాను తమ్ముడి వెంటే ఉన్నానని, కుమారస్వామే ముఖ్యమంత్రి అభ్యర్థి అని జేడీఎస్‌ నేత రేవణ్ణ స్పష్టం చేసిన విషయం విదితమే.

మరిన్ని వార్తలు