అజిత్‌ రాజీనామా ఎందుకు?

28 Sep, 2019 15:04 IST|Sakshi
అజిత్‌ పవార్‌ (ఫైల్‌)

సాక్షి, ముంబై: సీనియర్‌ నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ తన ఎమ్మెల్యే పదవికి హఠాత్తుగా రాజీనామా చేయడం నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ)లో చర్చనీయాంశంగా మారింది. ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌తో సంబంధాలు బెడిసి కొట్టడం వల్లే ఆయన రాజీనామా చేశారన్న ఊహాగానాలు విన్పిస్తున్నాయి. తన నిర్ణయాన్ని ఆయన మార్చుకోకపోవచ్చని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. అయితే తన మేనల్లుడు ఎందుకు రాజీనామా చేశాడో తెలియదని శరద్‌ పవార్‌ అన్నారు. అజిత్‌ అందుబాటులో లేకపోవడంతో ఆయన కుమారుడు రోహిత్‌తో ఫోన్‌లో మాట్లాడినట్టు వెల్లడించారు.

మనీలాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) తన పేరును చేర్చడంతో అజిత్‌ అసౌకర్యానికి గురైనట్టు ఆయన కుమారుడు తెలిపారని చెప్పారు. ‘రాజీనామా గురించి నాతో చర్చించలేదు. ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో నాకు తెలియదు. అజిత్‌ అందుబాటులో లేరని వెల్లడించారు. ఎమ్మెల్యే పదవికి ఎందుకు రాజీనామా చేశారని ఆయనను కలిసినప్పుడు అడుగుతాను. బ్యాంకు కుంభకోణంలోకి నన్ను అకారణంగా ఇరికించడంతో అజిత్‌ కుంగిపోయారని ఆయన కొడుకు రోహిత్‌ నాతో చెప్పారు. కుటుంబ పెద్దగా అజిత్‌ రాజీనామా వ్యవహారంపై అన్ని విషయాలను తెలుసుకుంటాను. మా కుటుంబంలో ఎటువంటివ విభేదాలు లేవు. నేను చెప్పింది మా వాళ్లందరూ పాటిస్తార’ని శరద్‌ పవార్‌ అన్నారు. ఎన్నికల్లో పోటీ చేయనన్న తన మాటకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. సతారా లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో పోటీ చేయబోనని తెలిపారు. పార్టీ అభ్యర్థులుగా పృథ్విరాజ్‌ చవాన్‌, శ్రీనివాస్‌ పాటిల్‌, సునీల్‌ మానే పేర్లను పరిశీలిస్తున్నామని, ఇంకా ఎవరినీ ఖరారు చేయలేదని వెల్లడించారు. అయితే అక్టోబర్‌ 1 నుంచి అజిత్‌ పవార్‌ రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తారని, ఎన్సీపీ అభ్యర్థుల నామినేషన్ల దాఖలకు హాజరవుతారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

పవార్‌కు సోనియా ఫోన్‌
శరద్‌ పవార్‌పై ఈడీ కేసు నమోదు చేయడంతో కాంగ్రెస్‌ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ శనివారం ఉదయం ఆయనకు ఫోన్‌ చేశారు. దాదాపు 15 నిమిషాలు పైగా మాట్లాడిన సోనియా ఆయనకు మద్దతు, సానుభూతి తెలిపారు. అజిత్‌ పవార్‌ రాజీనామా గురించి కూడా సోనియా ఆరా తీశారు. కాగా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ అక్టోబర్‌ 21 జరగనున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగిపోయాయి. బీజేపీ-శివసేన మధ్య సీట్ల సర్దుబాటు ఇంకా కొలిక్కి రాలేదు. కాంగ్రెస్‌-ఎన్సీపీ తలో 125 సీట్లలో పోటీ చేయాలని నిర్ణయించాయి. మిగతా సీట్లను మిత్రపక్షాలకు ఇవ్వనున్నాయి. (చదవండి: బీజేపీ ఎన్నికల అస్త్రం బయటకు తీసిందా?)

మరిన్ని వార్తలు