చట్టసభల్లో రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వరు?: జాజుల

6 Sep, 2018 02:27 IST|Sakshi

గజ్వేల్‌ రూరల్‌: జనాభాలో 54.5 శాతం ఉన్న బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లను ఎందుకు కల్పించరని బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ ప్రశ్నిం చారు. పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు బీసీల వాటా బీసీలకే దక్కాలని డిమాండ్‌ చేస్తూ చేపట్టిన బీసీల రాజకీయ చైతన్య యాత్ర (బస్సుయాత్ర) బుధవారం సిద్దిపేట నుంచి గజ్వేల్‌కు చేరుకుంది. ప్రజ్ఞాపూర్‌ నుంచి గజ్వేల్‌ పట్టణంలోని ఇందిరాపార్క్‌ చౌరస్తా వరకు బీసీ విద్యార్థి సంఘం కేంద్ర కమిటీ అధ్యక్షుడు విక్రమ్‌గౌడ్‌ ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు.

అనంతరం శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ తెలంగాణ వస్తే బీసీల బతుకులు మారుతాయనుకుంటే ఎక్కడ వేసి గొంగళి అక్కడే ఉన్నట్లుగా ఉందన్నారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడేందుకు మొదటగా అమరుడైంది బీసీ బిడ్డనేనని గుర్తు చేశారు.  బీసీల వాటా బీసీలకే దక్కాలని.. రాయితీలతో రాజీ పడకుండా రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా ముందుకు సాగుతామని అన్నారు. ప్రతి కులానికి రూ. కోటి ఇవ్వడంతో పాటు భవనాలను నిర్మించి ఇవ్వాలని, కులానికి ఒక ఎమ్మెల్యే సీటు కేటాయించాలని అన్నారు. అన్ని ప్రధాన పార్టీలు బీసీ డిక్లరేషన్‌ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. 

మరిన్ని వార్తలు