పవన్‌కు తిలకం దిద్దిన లెజ్నేవా

22 Jan, 2018 10:39 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : అప్రహిత రాజకీయ యాత్రకు బయలుదేరిన జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌కు ఆయన భార్య అన్నా లెజ్నేవా వీరతిలకం దిద్దారు. హిందూ సంప్రదాయం ప్రకారం హారతి ఇచ్చి సాగనంపారు. సోమవారం హైదరాబాద్‌లోని నివాసం నుంచి పవన్‌ కొండగట్టు(కరీంనగర్‌ జిల్లా)కు పయనమయ్యారు. దాదాపు 50 వాహనాల్లో వందలమంది అభిమానులు, జనసేన కార్యకర్తలు ఆయనను అనుసరించారు. కొండగట్టులో ప్రత్యేక పూజల అనంతరం ఆయన తన యాత్ర ఉద్దేశాన్ని వివరించనున్నారు.

ఇంటి వద్ద కోలాహలం : పవన్‌ యాత్రకు బయలుదేరనున్న నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఆయన ఇంటివద్ద ఆదివారం రాత్రి నుంచే హడావిడి కనిపించింది. సోమవారం ఉదయానికే పెద్ద సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. రష్యన్‌ జాతీయురాలైన లెజ్నేవా.. తెలుగుదనం ఉట్టిపడేలా దుస్తులు ధరించారు. సంప్రదాయబద్ధంగా హారతి ఇచ్చి, బొట్టుపెట్టి భర్తను సాగనంపిన దృశ్యాలు చూసి అభిమానులు కేరింతలు వేశారు.

కేసీఆర్‌తో కలిసిన తర్వాత.. : ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన పవన్‌.. ఆ పార్టీ కాంగ్రెస్‌లో విలీనం కావడంతో 2014 ఎన్నికలకు ముందు సొంతగా జనసేన పార్టీని ఏర్పాటుచేసి బీజేపీ, తెలుగుదేశం పార్టీలకు మద్దతు ఇవ్వడం తెలిసిందే. గడిచిన నాలుగేళ్లుగా అడపాదడపా కార్యక్రమాలు నిర్వహించిన ఆయన.. ఇప్పుడు యాత్రకు తెరలేపారు. సమస్యలను అధ్యయనం చేసి, అవగాహన పెంచుకోవడం కోసమే యాత్ర చేస్తున్నట్లు చెప్పుకున్నారు. ఇటీవలే తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలిసిన పవన్‌.. పరిపాలన బాగుందంటూ కితాబిచ్చిన సంగతి తెలిసిందే. తన కార్యక్షేత్రం ఏపీనే అని గతంలో వ్యాఖ్యానించిన ఆయన.. కేసీఆర్‌ను కలిసిన తెలంగాణ నుంచి యాత్రను ప్రారంభించడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది.

యాత్ర ఇలా.. : జనసేన పార్టీ కీలక నేత హరిప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం కొండగట్టు నుంచి ప్రారంభమయ్యే పవన్‌ యాత్ర మూడురోజులపాటు సాగనుంది. 23న ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన జనసేన కార్యకర్తలతో సమావేశం, 24న కొత్తగూడెం నుంచి ఖమ్మంకు ర్యాలీ, అదేరోజు వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల కార్యకర్తలతో భేటీ కానున్నారు.

మరిన్ని వార్తలు