ఎల్లో మీడియాను రోడ్డుకీడ్చుతా: పీవీపీ

13 Apr, 2019 17:51 IST|Sakshi

నాపై చేసిన ఆరోపణలపై కోర్టులో తేల్చుకుంటా

టీవీ 5, మహా న్యూస్‌, ఒక ఎంపీపై పరువునష్టం దావా 

ఒక్కొక్కరిపై రూ.100కోట్ల చొప్పున పరువు నష్టం దావా వేస్తా

సాక్షి, విజయవాడ : తనపై ఎల్లో మీడియా చేసిన దుష్ప్రచారంపై చట్టపరంగానే ఎదుర్కొంటానని విజయవాడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్‌ (పీవీపీ) తెలిపారు. తనపై చాలామంది వ్యక్తులు, సంస్థలు అవాకులు, చెవాకులు పేలారని అన్నారు. చట్టాన్ని ఉల్లంఘించడం జన్మహక్కుగా భావించేవారికి ఎవరో ఒకరు గుణపాఠం చెప్పాలని పీవీపీ అన్నారు. చట్టాన్ని ఎవరు ఉల్లంఘించినా తప్పే. ఆయన శనివారం విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘నాపై తప్పుడు కేసులు బనాయిస్తే కోర్టులు క్లీన్‌ చిట్‌ ఇచ్చాయి. 

నాపై దుష్ప్రచారం చేసినవారికి లా పవర్‌ ఏంటో చూపిస్తా. టీవీ 5, మహా న్యూస్‌, ఒక ఎంపీపై పరువునష్టం దావా వేస్తా. ఒక్కొక్కరిపై రూ.100కోట్ల చొప్పున పరువు నష్టం దావా వేస్తా. ఇలాంటి వారికి ఎక్కడో ఒకచోట చెక్‌ పెట్టాలి. ఇప్పుడు నా చేతల్లో చూపిస్తా. ఇలాంటి వారికి గుణపాఠం నేర్పాలి. నేను చట్టపరంగా అన్ని చర్యలు తీసుకుంటా. ఎన్నేళ్లు అయినా పోరాటం చేస్తా. వారిని రోడ్డుకి ఈడుస్తా. లేకుంటే మరొకరు ఇలాగే చేస్తారు. కోల్‌గేట్‌ పవర్‌ స్కామ్‌లో చంద్రబాబు నాపై ఆరోపణలు చేశారు. ఆ స్కామ్‌లో ఉన్నది వై.హరిశ్చంద్రప్రసాద్‌. ఆయనకు భూములు కేటాయించింది చంద్రబాబే. సీబీఐ ఛార్జ్‌షీట్‌లో నా పేరు ఎక్కడా లేదు.  

నేను నిర్మాతగా 150 సినిమాలు తీశాను. సౌండ్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ ప్రొడక్షన్‌ హౌస్‌లో మా కంపెనీకి బెస్ట్‌ అవార్డు వచ్చింది. మా కంపెనీలో పెద్ద పెద్ద హీరో, హీరోయిన్లు పనిచేశారు. అగ్రిమెంట్‌ ప్రకారమే మేము నడుచుకుంటాం. దాన్ని ఎవరు అతిక్రమించినా వెంటనే చర్యలు కూడా ఉంటాయి. అది తెలియకుండా మాట్లాడటం సరికాదు. ఎన్నికలు ముగిసేవరకూ నాపై చేస్తున్న దుష్ప్రచారంపై మాట్లాడకూడదని అనుకున్నాను. సోమవారం నుంచి నా చర్యలు ఉంటాయి. పీవీపీ ఎప్పుడూ తప్పు చేయలేదు. నాపై చేసిన ఆరోపణలపై కోర్టులో తేల్చుకుంటా. ఇక  తెలుగు నిఘంటువులో యూటర్న్‌ అనే పదానికి చంద్రబాబు సరిగ్గా సరిపోతారు. 2014లో చంద్రబాబును గెలిపించింది ఇవే ఈవీఎంలు. ఆ విషయాన్ని ఆయన మర్చిపోయారు.’ అని అన్నారు.

మరిన్ని వార్తలు