వైఎస్సార్‌సీపీలో చేరిన రచయిత చిన్ని కృష్ణ

28 Mar, 2019 13:23 IST|Sakshi

సాక్షి, పాలకొల్లు: ఎన్నికల తేదీ దగ్గర పడుతున్నా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వలసలు ఆగడం లేదు. ఓ వైపు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుంటే.. పార్టీలో చేరడానికి పలువురు నేతలు క్యూ కడుతున్నారు. రాజకీయ నాయకులే కాకుండా సినీ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖలు కూడా వైఎస్సార్‌సీపీలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. తాజాగా పాలకొల్లులో ఎన్నికల బహిరంగ సభలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పలువురు నాయకులు పార్టీలో చేరారు. ప్రముఖ సినీ రచయిత చిన్ని కృష్ణతోపాటు, కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే కేటీ రామారావు, అడబాల వెంకట రమణ, బీసీ ఉద్యమ నాయకుడు చింతపల్లి గురు ప్రసాద్‌లకు వైఎస్‌ జగన్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే కేటీ రామారావు

ఈ సందర్భంగా చిన్ని కృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. తన జీవితం రజినీకాంత్‌తో ప్రారంభమైందని.. రాజకీయ జీవితం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో ఆరంభం అయిందని తెలిపారు. వైఎస్‌ జగన్‌ త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డిని ప్రతి పుట్టిన రోజున కలిసేవాడినని గుర్తుచేశారు. వైఎస్సార్‌ మహానేత అని అన్నారు. టీడీపీ తుడిచి పెట్టుకుపోవాలంటే వైఎస్‌ జగన్‌ను బలపరిచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. నవరత్నాలు ఏపీలో నవధాన్యాలుగా విరాజిల్లుతాయని నమ్మి పార్టీలో చేరినట్టు వెల్లడించారు. వైఎస్‌ జగన్‌ ప్రజలకు ఏం చేస్తారో సూటిగా చెబుతున్నారని.. ఆయన ప్రసంగం విని చాలా మంది ఎంతో నేర్చుకోవాల్సి ఉంటుందన్నారు. త్వరలోనే రాజన్న రాజ్యం వస్తుందని అన్నారు.

మరిన్ని వార్తలు