‘కాంగ్రెస్‌కు ఓటేసే వాళ్లు రావణుడి భక్తులు’

28 Nov, 2018 16:13 IST|Sakshi

జైపూర్‌ : రామ భక్తులు బీజేపీకి ఓటేస్తారు.. రావణుడి అనుచరులు మాత్రమే కాంగ్రెస్‌కి ఓటేస్తారంటూ ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజస్తాన్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యోగి.. ఈ సందర్భంగా రామాయణాన్ని మరోసారి తెర మీదకు తెచ్చారు. ‘హనుమాన్‌ గిరిజనుడు. అడవుల్లోనే తిరిగారు. రాముని కోరిక మేరకు హనుమంతుడు నలుదిక్కులను ఏకం చేసి ఈ అఖండ భారతదేశాన్ని నిర్మించేందుకు కృషి చేశారు. ఇప్పుడు మేము కూడా ఈ ఆశయాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నామం’టూ యోగి వ్యాఖ్యానించారు.

అంతేకాక రాముడిని కొలిచేవారంతా బీజేపీకి ఓటేస్తారని.. రావణాసురిని అనుచరులు మాత్రమే కాంగ్రెస్‌కు ఓటేస్తారని యోగి ఆరోపించారు. రాజస్తాన్‌లో ఓటర్లను ఆకర్షించేందుకు బీజేపీ ద్విముఖ వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఓ వైపు యోగి హిందువులను, దళిత ఓటర్లను ఆకర్షించే పనిలో ఉండగా.. మరోవైపు మోదీ అభివృద్ధి తనవల్లే సాధ్యమంటూ ప్రచారం చేసుకుంటున్నారు.

మరిన్ని వార్తలు