ఎస్పీ, బీఎస్పీ కూటమిపై అఖిలేశ్‌ స్పష్టత

25 Mar, 2018 19:51 IST|Sakshi

లక్నో: ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ గోరఖ్‌పూర్‌లో తన సొంత సీటును కూడా కాపాడుకోలేకపోయారని ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ ఎద్దేవా చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థి ఓటమిపై బీజేపీ చేస్తున్న కామెంట్స్‌పై అఖిలేశ్‌ ఆదివారం స్పందించారు. ఎస్పీ, బీఎస్పీ కూటమి ఎక్కువకాలం ఉండదని, కేవలం బీజేపీని  ఓడించడం కోసమే వారు పొత్తు పెట్టకున్నారన్న ఆ పార్టీ నేతల వ్యాఖ్యలను అఖిలేష్‌ తిప్పికొట్టారు. బీజేపీ  ధనబలంతో, అధికార బలంతో తమ ఎమ్యెల్యేలను ప్రలోభపెట్టి ఒక దళిత అభ్యర్థి గెలుపును అడ్డుకుందని విమర్శించారు.  ఈ ఓటమి తమ కూటమిపై ఎలాంటి ప్రభావం చూపదని, రానున్న ఎన్నికలలోపు తమ కూటమి మరింత బలంగా మారుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. తక్కువ ఓటింగ్‌ నమోదుకావడమే బీజేపీ ఓటమికి కారణం అన్న వ్యాఖ్యలను తిప్పికొడుతూ, ఓటింగ్‌ శాతం పెరిగితే  మా గెలుపు మరింత సులువయ్యేదన్నారు.

గోరఖ్‌పూర్‌, పూల్‌పుర్‌ ఉప ఎన్నికల ఫలితాలు తమ కూటమికి, పార్టీ కార్యకర్తలకు ఎంతో ఉత్సాహాన్నిచ్చాయని, రాబోయే ఎన్నికల్లో కూడా తమ కూటమి కొనసాగుతుందని అఖిలేశ్‌ స్పష్టంచేశారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి తమ నియోజకవర్గాల్లో స్వయంగా  ప్రచారంలో పాల్గొన్నా  ఓటమి పాలవ్వక తప్పలేదన్నారు. వారి ఓటమి 2019 ఎన్నికల్లో బీజేపీ దేశావ్యాప్తంగా ఓటమి పాలవుతుందనే సందేశాన్ని దేశ ప్రజలకు ఇచ్చిందని పేర్కొన్నారు. ప్రస్తుతం కానోజ్‌ ఎంపీగా ఉన్న తన భార్య డింపుల్‌ యాదవ్‌ 2019 ఎన్నికల్లో తిరిగి పోటి చేయదని అఖిలేశ్‌ వెల్లడించారు.

రాజ్‌నాథ్‌సింగ్‌, కళ్యాణ్‌ సింగ్‌, శివరాజ్‌సింగ్‌లు కుటుంబసభ్యులు రాజకీయలకు దూరంగా ఉన్నారని, తాను కూడా అదే విధానం పాటిస్తానన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుపై స్పందిస్తూ.. కాంగ్రెస్‌ ఒక జాతీయ పార్టీ అని, ప్రస్తుతానికి కాంగ్రెస్‌తో మంచి సంబంధాలే ఉన్నాయని, పొత్తు భవిష్యత్తు నిర్ణయిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ఎన్‌కౌంటర్లపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ చేస్తున్నది రాజకీయ ఎన్‌కౌంటర్లని, ప్రజల మధ్య మతఘర్షణలను ప్రోత్సహిస్తోందని విమర్శించారు.

మరిన్ని వార్తలు