నేను సిద్ధంగా ఉన్నా..

3 Mar, 2018 11:45 IST|Sakshi
మాట్లాడుతున్న ఎంపీ అవినాష్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నేతలు

పులివెందుల అభివృద్ధిపై చర్చించాకే ఢిల్లీకి

టీడీపీ నాయకులకు ప్రతి సవాల్‌ విసిరిన

ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి

పులివెందుల : పులివెందుల నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నానని.. సమయంతో నాకు పనిలేదని ఏ క్షణమైనా చర్చకు రావడానికి నాకు సమ్మతమేనని కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి స్పష్టం చేశారు. పులివెందుల నియోజకవర్గ అభివృద్ధిపై ఈ నెల 4వ తేదీ సాయంత్రం 4 గంటలకు చర్చకు రావాలంటూ టీడీపీ నాయకులు సవాల్‌ విసిరిన సంగతి తెలిసిందే. గురువారం కడప నగరంలో నిర్వహించిన మహాధర్నా కార్యక్రమంలో తాను నియోజకవర్గ అభివృద్ధిపై పూల అంగళ్ల సర్కిల్‌ వద్దకానీ, వేంపల్లె అడ్డరోడ్డులోకానీ చర్చించడానికి సిద్ధంగా ఉన్నానని ఎంపీ ప్రతి సవాల్‌ చేశారు.  శుక్రవారం వైఎస్‌ జగన్‌ క్యాంపు కార్యాయలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ.. టీడీపీ నాయకులు చెప్పినట్లుగా పులివెందుల నియోజకవర్గ అభివృద్ధిపై చర్చకు సిద్ధమని మరోసారి పునరుద్ఘాటించారు.

ఈ సందర్భంగా టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలోని హామీల అమలు తీరుపై కడిగిపారేస్తామన్నారు. వైఎస్సార్‌ హయాంలో పులివెం దులలో జరిగిన అభివృద్ధిపైనా.. సాగునీటి ప్రాజెక్టు పనులపైనా.. ఈ నాలుగేళ్లలో చంద్రబాబు హయాంలో పులివెందులలో ఎలాంటి అభివృద్ధి జరిగిందన్న విషయంపైనా చర్చించి తీరుతామని  వెల్లడించారు. అలాగే వైఎస్సార్‌ మర ణం తర్వాత ఆగిపోయిన పనులపైనా చర్చిద్దామని సవాలు విసిరారు. ఆ తర్వాతే 5వ తేదీన జరిగే ఢిల్లీలో జరిగే ధర్నాకు, పార్లమెంటు సమావేశాలకు హాజరవుతానని చెప్పారు. కానీ, టీడీపీ నాయకులు దీనికి 4వ తేదీ వరకు సమయం ఎందుకు తీసుకున్నారో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. అధికారం ఉందని చర్చా కార్యక్రమాన్ని పోలీసులతో భగ్నం చేయించాలని ప్రయత్నిస్తే మాత్రం టీడీపీ నేతలు నైతికంగా ఓటమి చెందినట్లేనని తెలిపారు. నేను రైతులతో నీళ్ల కోసం ధర్నా చేస్తే.. రౌడీలతో ధర్నా చేశానని సతీష్‌రెడ్డి చెప్పడం సిగ్గుచేటు అన్నారు. అన్నదాతలను రౌడీలనడంతోనే వారిపట్ల టీడీపీకి ఉన్న చిత్తశుద్ధి ఏంటో అర్ధమవుతోందని చెప్పారు. నేను రౌడీయిజాన్ని ప్రోత్సహించే వ్యక్తినైతే పులివెందులలో టీడీపీ నాయకులు ఇంత స్వేచ్ఛగా తిరగలేరన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రజాస్వామ్యానికి, చట్టానికి కట్టుబడి ప్రవర్తిస్తుందే తప్ప.. ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడలేదన్నారు. ప్రతిపక్షనేత రివ్యూ మీటింగ్‌కు హాజరైన అధికారులను భయభ్రాం తులకు గురిచేసిన నీచమైన చరిత్ర మీదని.. పులివెందులకు ప్రతిపక్షనేత జగన్‌ ఏమీ చేయలేదని చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు.

చివరి ఆయకట్టు వరకు నీళ్లు వదాలి..
పీబీసీ నీటి విషయమై, ప్రాజెక్టుల విషయమై వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనేకసార్లు నా ఫోన్‌ ద్వారానే మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుకు ఫోన్‌ చేశామన్నారు. వైఎస్సార్‌ పుణ్యంతో ప్రాజెక్టులు కడితే దేవుని దయతో వర్షాలు కురిసి ప్రాజెక్టులోకి నీరు వచ్చాయన్నారు. ఇప్పుడు ఆ నీటిని సక్రమంగా వినియోగించాలని డిమాండ్‌ చేశారు. లింగాల.. పులివెందుల బ్రాంచ్‌ కెనాల్‌ చివరి ఆయకట్టు వరకు ఉన్న చెరువులను నీళ్లతో నింపాలని లేనిపక్షంలో పీబీసీ కార్యాలయం ఎదుట కాకుండా.. టీడీపీ నేతల ఇళ్ల వద్ద రైతులతో కలిసి ధర్నా చేపడతామన్నారు. వైఎస్‌ విజయమ్మ ఎమ్మెల్యేగా ఉన్నపుడు అనంతపురంలో జరిగిన ఐఏబీ సమావేశంలో విజయమ్మ, నేను సీబీఆర్, పైడిపాలెం నీటి విషయమై అధికారులను నిలదీస్తుంటే.. అడ్డుకున్న సతీష్‌రెడ్డి ఇప్పుడు నీటి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.  కార్యక్రమంలో లింగాల ఎంపీపీ సుబ్బారెడ్డి, పులివెందల మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ చిన్నప్ప, పట్టణకన్వీనర్‌ వరప్రసాద్, తొండూరు నాయకులు రవీంద్రనాథరెడ్డి, రామమునిరెడ్డి, రసూల్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు