వైఎస్‌ జగన్‌.. ఓ నమ్మకం: వైఎస్‌ భారతి

1 Apr, 2019 05:19 IST|Sakshi
జమ్మలమడుగు రోడ్‌షోలో మాట్లాడుతున్న వైఎస్‌ భారతీరెడ్డి

జమ్మలమడుగు ఎన్నికల ప్రచారంలో వైఎస్‌ భారతీరెడ్డి

‘నవరత్నాలు’ పథకంతో అందరికీ మేలు

జమ్మలమడుగు: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ప్రజలకు పూర్తి నమ్మకం ఉందని ఆయన సతీమణి వైఎస్‌ భారతీరెడ్డి స్పష్టం చేశారు. వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో ఆదివారం ఆమె వైఎస్సార్‌సీపీ అభ్యర్థి డాక్టర్‌ మూలె సుధీర్‌రెడ్డితో కలిసి రోడ్‌షో, ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి ప్రజలతో మమేకమయ్యారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధికి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాటుపడతారని హామీ ఇచ్చారు.

విలేకరులతో ఆమె మాట్లాడుతూ తాము నిర్వహిస్తున్న ప్రచారానికి ప్రజల్లో మంచి స్పందన వస్తుందని తెలిపారు. వైఎస్‌ జగన్‌ ప్రవేశపెట్టనున్న ‘నవరత్నాలు’ పథకాల ద్వారా ప్రజలందరికీ మేలు జరుగుతుందన్నారు. సీఎం చంద్రబాబు పరిపాలనను ప్రజలు చూశారని, ఆయన ఇచ్చిన హామీల్లో ఒక్క హామీనీ నెరవేర్చలేదన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ఒక్క మాట చెబితే చాలు.. చేస్తారనే నమ్మకం ప్రజల్లో ఉందని పునరుద్ఘాటించారు. అగ్రిగోల్డ్‌ బాధితుల విషయంలో జగన్‌మోహన్‌రెడ్డి న్యాయం చేస్తారని భారతీరెడ్డి హామీ ఇచ్చారు.  

మరిన్ని వార్తలు