వైఎస్‌ జగన్‌ రేపటి ఎన్నికల ప్రచార షెడ్యూల్‌

2 Apr, 2019 20:53 IST|Sakshi

సాక్షి, అమరావతి : ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రేపటి(బుధవారం) ఎన్నికల ప్రచార షెడ్యూల్‌ ఖరారైంది. ఈ నెల 3న గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లోని నాలుగు నియోజకవర్గాల్లో ఆయన పర్యటిస్తారు. బుధవారం ఉదయం 9.30 గంటలకు గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో, అనంతరం ఉదయం 11.30 గంటలకు గురజాల నియోజకవర్గం పిడుగురాళ్లలో పర్యటిస్తారు.

మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రకాశం జిల్లా ఒంగోలులో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3.30 గంటలకు కృష్ణ జిల్లాలోని మైలవరంలో జరిగే బహిరంగ సభలో ఆయన ప్రచారం చేస్తారు. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ప్రకటన విడుదల చేశారు.

జగన్‌ ప్రచార షెడ్యూల్‌తో పాటు పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, షర్మిల ప్రచార షెడ్యూల్‌ కూడా ఖరారైంది. విజయమ్మ ఈ నెల 3న విజయనగరం, విశాఖపట్నంలోని మూడు అసెంబ్లీ, రెండు పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారు. తొలుత విజయనగరం జిల్లాలోని గజపతినగరం అసెంబ్లీ నియోజకవర్గం.. విజయనగరం పార్లమెంటు నియోజకవర్గంలో ప్రచారం చేస్తారు. ఆ తర్వాత విశాఖపట్నంలోని వి మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గంలో, అనకాపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గంలో ప్రచారంలో పాల్గొంటారు. చివరకు విశాఖపట్నం జిల్లాలోని చోడవరం అసెంబ్లీ నియోజకవర్గం.. అనకాపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తారు.

షర్మిల ప్రచార షెడ్యూల్‌..
షర్మిల పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారు. తొలుత పశ్చిమ గోదావరి జిల్లాలోని దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గం.. ఏలూరు పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తారు. తర్వాత కృష్ణా జిల్లాలోని కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గం, పెదన అసెంబ్లీ నియోజకవర్గంలో.. మచిలీపట్నం పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తారు.

మరిన్ని వార్తలు