వృద్ధాప్య పింఛన్‌ రూ.3వేలకు పెంచుతూ జననేత ప్రకటన

6 Feb, 2019 17:16 IST|Sakshi

సాక్షి, తిరుపతి : వైఎస్సార్‌ సీపీ ‘నవరత్నాలు‘ను కాపీ కొడుతున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు భారీ షాక్‌ తగిలింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే అవ్వా, తాతలకు నెలకు రూ.3 వేలు వృద్ధాప్య పింఛన్‌ ఇస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి భరోసా ఇచ్చారు. బుధవారం తిరుపతి సమీపంలో జరిగిన వైఎస్సార్‌ సీపీ సమర శంఖారావం సభలో ఆయన హామీ ఇచ్చారు. అంతేకాకుండా రైతులను ఆదుకునేందుకు ప్రతి మే నెలలో రూ.12,500 సాయం అందిస్తామని తెలిపారు. (చంద్రబాబు ఒక్కరే మనకు పోటీ కాదు)

కాగా వైఎస్సార్‌సీపీ నవరత్నాల్లో.. వృద్ధాప్య ఫించన్‌ రూ.2 వేలు ఇస్తామని ఇప్పటికే ప్రకటన చేశారు. అలాగే ప్రస్తుతం ఉన్న పింఛన్ల వయస్సు 65 నుంచి 60కి తగ్గిస్తామని, అలాగే వికలాంగులకు పింఛన్‌ రూ.3వేలు ఇస్తామని ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అలాగే 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ  అక్కాచెల్లెమ్మలకు వైఎస్సార్‌ చేయూత ద్వారా మొదటి ఏడాది తర్వాత దశలవారీగా రూ.75వేలు ఆయా కార్పొరేషన్ల  ద్వారా ఉచితంగా ఇస్తామని వైఎస్‌ జగన్‌ ప్రకటించారు కూడా. అయితే నవరత్నాలను కాపీ కొట్టిన టీడీపీ సర్కార్‌ ఇటీవలే వృద్ధాప్య ఫించన్‌ను రూ.1000 నుంచి రూ.2వేలుకు పెంచింది. వైఎస్సార్‌ సీపీ తాజా నిర్ణయంతో కాపీ కొట్టడంకూడా సరిగా రాని చంద్రబాబుకు ఝలకే అని చెప్పుకోవచ్చు. (ఎన్నికల సమర శంఖం పూరించిన వైఎస్‌ జగన్‌)

మరిన్ని వార్తలు