అసమర్థ, అవినీతి ప్రభుత్వం వల్లే ప్రమాదాలు

16 May, 2018 21:04 IST|Sakshi

ట్విటర్‌లో వైఎస్‌ జగన్‌ ధ్వజం

సాక్షి, ద్వారకాతిరుమల: పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలం వాడపల్లి సమీపంలో గోదావరిలో జరిగిన లాంచీ ప్రమాదంపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనపై సానుభూతి వ్యక్తం చేస్తూ బుధవారం సాయంత్రం ట్విటర్‌లో స్పందించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

లైసెన్సులు లేని డ్రైవర్లు, అనుమతిలేని పడవల వల్ల గత ఆరు నెలల్లో 3 ఘోర ప్రమాదాలు జరిగాయన్నారు. చంద్రబాబు అసమర్థ, నిర్లక్ష్య, అవినీతి పాలన చూస్తుంటే బాధ కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కో బాధిత కుటుంబానికి తక్షణం ప్రభుత్వం రూ. 25 లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నాయకులు ఇప్పటికే బాధిత కుటుంబాలను కలిసి సాధ్యమైనంత సాయం చేస్తున్నారని వైఎస్‌ జగన్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు.
 

>
మరిన్ని వార్తలు