వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ వేడుకల్లో జననేత
తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న సేవా కార్యక్రమాలు
సాక్షి, ఒంగోలు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 8వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. కార్యకర్తలు నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం ఆయన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ప్రకాశం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన సోమవారం ఉదయం ఈపురుపాలెంలో భారీ కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు.
రాజన్న రాజ్యాన్ని తిరిగి తెస్తా...
‘సరిగ్గా 8 ఏళ్ల క్రితం ఇదే రోజు విలువలతో కూడిన రాజకీయాలను అందించేందుకు.. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలను నెరవేర్చేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పురుడు పోసుకుంది. ఆంధ్ర ప్రదేశ్ ప్రజల హక్కుల సాధన కోసం అండగా నిలుస్తూ పోరాడుతూనే.. రాజన్న రాజ్యాన్ని తిరిగి తెస్తాం’ అని ఆయన ట్వీట్ చేశారు.
This day, 8 years ago, YSRCP was formed to uphold the value based politics & promises of Dr. YSR. We commit to the people of Andhra Pradesh to ensure their rights, and bring back Rajanna's Rajyam. (1/2)
— YS Jagan Mohan Reddy (@ysjagan) 12 March 2018
ఇక ఇంతకాలం పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసిన కార్యకర్తలకు, తనకు అండగా నిలుస్తున్న ప్రజలకు వైఎస్ జగన్ కృతజ్ఞతలు తెలియజేస్తూ మరో ట్వీట్ చేశారు.
I thank our cadre for their affection and dedication towards the party & express my gratitude to the people of AP for their support. #YSRCPFoundationDay(2/2) pic.twitter.com/0yRsVx2TSD
— YS Jagan Mohan Reddy (@ysjagan) 12 March 2018
అనతికాలంలోనే బలీయమైన శక్తిగా..
ప్రజల ఆకాంక్షల మేరకు ఒక చారిత్రక అవసరంగా 2010 మార్చి 12న ఆవిర్భవించిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనతి కాలంలోనే బలీయమైన శక్తిగా ఎదిగింది. పార్టీని స్థాపించేటప్పుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డికి ఆయన తల్లి వైయస్ విజయమ్మ ఒక్కరే తోడుగా నిలిచారు. పార్టీకి పెను సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ మొక్కవోని ధైర్యంతో వైయస్ జగన్ మరింత రాటుతేలారు. పార్టీకి దిశానిర్దేశం చేస్తూ ముందుకు నడుపుతున్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు ప్రత్యేక హోదా కోసం నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా కోసం వైయస్ జగన్ పోరాటం చేస్తూ రాష్ట్రానికి ఏకైక దిక్కుగా నిలిచారు.
సేవా కార్యక్రమాలు.. రాష్ట్రవ్యాప్తంగా వైయస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు పలు సేవా కార్యక్రమాలను చేపట్టబోతున్నాయి. పార్టీ కేంద్ర, రాష్ట్ర కార్యాలయాలు, అన్ని పార్లమెంట్ జిల్లా కేంద్రాల్లో, అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలు, మండల కేంద్రాల్లో పార్టీ జెండాను ఆవిష్కరించి, సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి.