పెద్ద దర్గాను సందర్శించిన వైఎస్‌ జగన్‌

29 May, 2019 11:35 IST|Sakshi

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: ఆంధ్రప్రదేశ్‌ కాబోయే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్‌ జిల్లా కడపలోని పెద్ద దర్గాను సందర్శించారు. పెద్ద దర్గా వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు. అమీన్‌పీర్‌ దర్గాలోకి ప్రవేశించిన వైఎస్‌ జగన్‌కు దర్గా మతపెద్దలు సాంప్రదాయరీతిలో తలపాగా చుట్టారు. దర్గాలో వైఎస్‌ జగన్‌ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి.. చాదర్‌ సమర్పించారు. అనంతరం ఆయన పులివెందుల వెళుతారు. అక్కడి సీఎస్‌ఐ చర్చిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. అక్కడి నుంచి ఇడుపులపాయకు చేరుకుని తన తండ్రి, దివంగత నేత వైఎస్‌ఆర్ సమాధి వద్ద నివాళులర్పిస్తారు.


సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి


తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన కడప వచ్చిన సంగతి తెలిసిందే. కడప విమానాశ్రయంలో వైఎస్‌ జగన్‌కు పుష్పగుచ్ఛాలు అందించి.. జిల్లా కలెక్టర్ హరికిరణ్, ఎస్పీ అభిషేక్ మహంతి, జిల్లాలోని వైఎస్సార్‌సీపీ శాసనసభ్యులు, ఎంపీలు, శ్రేణులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ అందరినీ ఆప్యాయంగా పలకరించారు.

మరిన్ని వార్తలు