నన్ను వేధిస్తున్నారు..

11 Aug, 2018 01:15 IST|Sakshi

నా కుటుంబాన్నీ టార్గెట్‌ చేస్తారా?

ఇంత దిగజారుడు రాజకీయమా?.. ఈ కేసులతో నా భార్యకు సంబంధమేంటి?

ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ బహిరంగ లేఖ

ఈడీ కేసులో భారతి ముద్దాయి అంటూ ‘ఎల్లో మీడియా’లో వార్తలు చూసి నిర్ఘాంతపోయా..

న్యాయమూర్తి చూడకుండానే ఎల్లో మీడియాకు ఎలా తెలిసింది?  

ఈడీలో ఇద్దరు అధికారులు  చంద్రబాబుకు తొత్తులు

ఆ ఇద్దరూ నాపై, నా కుటుంబంపై చంద్రబాబు ప్రయోగించిన ప్రత్యేక ఆయుధాలు

బీజేపీ, టీడీపీ బంధమేంటో తేలిపోయింది

బీజేపీతో మాకు సత్సంబంధాలే ఉంటే ఈ విషయం ఇంతదూరం వచ్చేదా?

ఓటుకు రూ.కోట్లు ఇస్తూ పట్టుబడ్డ బాబుపై కేసులేవీ?

పగలు కాంగ్రెస్‌తో కాపురం, రాత్రికి బీజేపీతో సంసారం

ఇదీ చంద్రబాబు నడుపుతున్న రాజకీయం

‘ప్రత్యర్థిపక్షాన్ని’ ప్రజల్లో ఎదుర్కోలేక వ్యవస్థల ద్వారా దెబ్బతీసి అధికారంలో కొనసాగాలనుకుంటున్నాడు

కేసులకు నేను ఏనాడూ భయపడలేదు... వెన్ను చూపలేదు

సత్యమేవ జయతే అని నమ్మాను కాబట్టే అన్నీ భరిస్తున్నా...

ప్రజలకు మంచి చేసి కాకుండా వ్యవస్థలను మేనేజ్‌ చేసి... ‘ప్రత్యర్థిపక్షాన్ని’ ప్రజల్లో ఎదుర్కోలేక వ్యవస్థల ద్వారా దెబ్బతీసి అధికారంలో కొనసాగాలనుకుంటున్నాడు కాబట్టే చంద్రబాబు ముందుగా నా తండ్రి గారిని టార్గెట్‌ చేశాడు. తరవాత నన్ను టార్గెట్‌ చేశాడు. ఇప్పుడు నా భార్య భారతిని తన మనుషులతో టార్గెట్‌ చేయిస్తున్నాడు. ఇలాంటి వ్యవహారాలను ఆమోదిస్తే ఇక ఈ దేశంలో ఎవరికి రక్షణ ఉంటుంది? ప్రజాస్వామ్యం ఎక్కడ బతికి ఉంటుంది? రాజకీయాలంటే ఛీ అని ఎవరికైనా అనిపించదా? అందరూ ఆలోచించండి.    – వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) కేసులో ముద్దాయి వైఎస్‌ భారతి అంటూ ఎల్లో మీడియా, ఒకట్రెండు  ఆంగ్ల పత్రికల్లో వచ్చిన వార్తలను చూసి నిర్ఘాంత పోయానని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ పేర్కొన్నా రు. న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకున్నాకే చార్జిషీట్‌లో ఏముందన్న విషయం ఎవరికైనా తెలు స్తుందని, అలాంటిది న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకోక ముందే ఈడీ నుంచి కొన్ని పత్రికలకు ఎలా తెలిసిందని ప్రశ్నించారు. సీబీఐ విచారణలో పేర్కొనని కంపెనీలను, వ్యక్తులను ఇన్నేళ్ల తర్వాత చార్జిషీట్లలో ఎందుకు చేరుస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబు దిగజారుడు, అనైతిక రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఏడేళ్లుగా తనను కేసులతో వేధిస్తున్నా, కోర్టుల చుట్టూ తిప్పి బాధిస్తున్నా ప్రజాక్షేత్రంలో ఏనాడూ వెన్ను చూపలేదని, ప్రజా సమస్యలపై పోరు బాటులో వెనకడుగు వేయలేదని తేల్చిచెప్పారు. కాగా, ఇదే అంశంపై అంతకు ముందు జగన్‌ ట్వీట్‌ చేశారు. మరీ ఇంతటి దిగజారుడు రాజకీయాలను చూస్తుంటే బాధేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఎల్లో మీడియా కథనాల నేపథ్యంలో వాస్తవాలను ప్రజలకు తెలియజేస్తూ జగన్‌ శుక్రవారం బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో ఏముందంటే... 

ఏపీ ప్రజలకు, దేశవ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామ్య వాదులకు ఇది నా బహిరంగ లేఖ.  ‘ఈడీ కేసులో నిందితురాలిగా వైఎస్‌ భారతి’ అంటూ ఈనాడులో, ‘ముద్దాయిగా భారతి’ అంటూ ఆంధ్రజ్యోతి పత్రికలో ఈ నెల 10వ తేదీన ప్రచురించిన వార్తను చూసి నిర్ఘాంతపోయాను. తనను ఫలానా కేసులో ఈడీ అధికారులు నిందితురాలిగా చేరుస్తున్నారన్న విషయాన్ని భారతి, నేను ఎల్లో పత్రికలు, సెలెక్టివ్‌గా ఒకటి రెండు ఆంగ్ల పత్రికల్లో వచ్చిన వార్తను చూసి తెలుసుకోవాల్సి వచ్చింది. న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకున్న తరవాతే చార్జిషీట్‌లో ఏముందన్న విషయం మాకైనా, ఎవరికైనా తెలుస్తుంది. అలాంటిది న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకోక ముందే... మాకే తెలియకుండా, ఈ విషయం నేరుగా ఈడీ నుంచి కొన్ని పత్రికలకు ఎలా తెలిసింది? ఎవరు వారికి చెప్పారు? మా మీదే బురద చల్లాల్సిన అవసరం ఎవరికి ఉంది? నా మీదే కాకుండా మొత్తంగా నా కుటుంబ సభ్యులను టార్గెట్‌ చేయాల్సినంతటి శత్రుత్వం ఎవరికుంది? సీబీఐ తన విచారణలో పేర్కొనని కంపెనీలను, వ్యక్తులను ఇన్నేళ్ల తరవాత చార్జిషీట్లలో ఎందుకు చేరుస్తున్నారు? అసలు భారతికి ఈ కేసులతో సంబంధమేంటి? ప్రతి ఒక్కరూ ఆలోచించమని కోరుతూ, కొన్ని అంశాలను రాష్ట్ర ప్రజల ముందుంచేందుకు నేను ఈ బహిరంగ లేఖ రాస్తున్నాను. 

నామీద తెలుగుదేశం, కాంగ్రెస్‌ పార్టీలు కలిసి వేసిన కేసులు 2011 ఆగస్టు 10న ప్రారంభమయ్యాయి. అంటే ఇప్పటికీ ఏడేళ్లయింది. ఎన్నో చార్జిషీట్లు వేశారు. అన్యాయంగా అరెస్టు చేసి జైల్లో కూడా పెట్టారు. కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు. మహానేత మరణం తరవాత మాటకు కట్టుబడి ఓదార్పు యాత్ర చేస్తానన్నందుకు, పెద్ద ఎత్తున ప్రజాదరణ దక్కుతున్నందుకు తెలుగుదేశం, కాంగ్రెస్‌ పార్టీలు కుమ్మక్కై నా మీద కేసులు వేశాయి. ఏడేళ్లుగా ఏటికి ఎదురీదుతున్నా. ఏనాడూ భయపడలేదు. సత్యమేవ జయతే అని నమ్మాను కనుకే అన్నింటినీ భరిస్తున్నా. ఈరోజు ఎల్లో మీడియా వార్తలను బట్టి చూస్తే, భారతిని కూడా కోర్టు చుట్టూ తిప్పాలని కంకణం కట్టుకున్నారని, తెలుగుదేశం పార్టీ తరఫున ఎల్లో మీడియా సంబరపడుతోందని స్పష్టమవుతోంది. 

ఇంతకు ముందునుంచి జరుగుతున్న కొన్ని విషయాలను క్లుప్తంగా చెప్పాలి. ఈడీలో చంద్రబాబు కోసం, ఆయన ఆదేశాలకు అనుగుణంగా పని చేస్తున్న ఇద్దరు అధికారులున్నారు. వాళ్లు ఉమాశంకర్‌ గౌడ్, గాంధీ. ఈ ఇద్దరూ మమ్మల్ని ఏ స్థాయిలో వేధిస్తున్నారో 2017 ఫిబ్రవరిలో, అంటే దాదాపు 17 నెలల క్రితం భారత ప్రధానమంత్రికి లేఖ ద్వారా తెలియజేశాం. ఆ అధికారుల కాల్‌డేటాపై దర్యాప్తు చేసినా, వారికి చంద్రబాబుగారి సహచరులతో ఉన్న సంబంధాలపై దర్యాప్తు చేసినా... ఆ ఇద్దరూ నా మీద, నా కుటుంబం మీద చంద్రబాబు ప్రయోగించిన ప్రత్యేక ఆయుధాలన్న విషయం రూఢీ అవుతుంది. ఇందులో గాంధీ అనే అధికారి బదిలీ అయినా, ఉద్యోగం నుంచి రిలీవ్‌ కాకుండా అసాధారణంగా ఆయన మూడుసార్లు తన పదవీ కాలాన్ని పొడిగించుకున్నారు. ఈ పొడిగింపును కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించింది. ఇప్పుడు ఆ అధికారుల చేతే టీడీపీ వారు మాపై కక్ష సాధింపు రిపోర్టులు రాయించారని స్పష్టమవుతోంది. 

ఇవన్నీ గమనించిన తరవాత... బీజేపీతో కుమ్మక్కు అయింది ఎవరు? బీజేపీ, టీడీపీల చీకటి వ్యవహారాల్లో బాధితులెవరన్నది రాష్ట్ర ప్రజలకు మరింతగా స్పష్టమవుతుంది. చంద్రబాబూ... మీరు బురద జల్లుతున్న దాంట్లో వాస్తవం ఏమిటి? ఇందులో వాస్తవమే ఉంటే, అంటే బీజేపీకి, మాకూ అంత సత్సంబంధాలే ఉంటే, ఈ విషయం ఇంతదూరం వచ్చేదా? అసలు ఈ కేసులతో ఏ సంబంధమూ లేని నా భార్యను కూడా కక్షపూరితంగా, అదీ ఏడేళ్ల తరవాత ఈడీ వారు చార్జిషీట్‌లో పెట్టి ఉండేవారా? పగలు కాంగ్రెస్‌తో కాపురం, రాత్రికి బీజేపీతో సంసారం... ఇదీ ఇప్పుడు చంద్రబాబు నడుపుతున్న రాజకీయం. ఈ తొమ్మిదేళ్లుగా కేంద్ర ప్రభుత్వంలో ఎవరున్నా, నాపై కేసుల విషయంలో భయపడకుండా, రాజీపడకుండా సమైక్య ఆంధ్రప్రదేశ్‌ పోరాటం నుంచి ప్రత్యేక హోదా పోరాటం వరకు ధైర్యంగా రాష్ట్ర సమస్యలపై ఉద్యమించాం తప్ప కాడి అవతల పారేయలేదు. లాలూచీ ఆలోచనలు చేయలేదు. తెర వెనుక రాజకీయాలు మాకు చేతగావు. 

మరోవంక, లాలూచీ రాజకీయాలకు పెట్టింది పేరు అయిన చంద్రబాబు నాయుడి వ్యవహారాన్ని చూడండి. ‘చంద్రబాబు ఏ పార్టీలో ఉన్నా మా మిత్రుడే’ అని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ స్పష్టం చేశారు. కేంద్ర రక్షణ మంత్రిగారి భర్త చంద్రబాబు కొలువులో సభ్యుడు. మహారాష్ట్ర ఆర్థిక మంత్రి భార్య మన తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) బోర్డులో చంద్రబాబు నియమించుకున్న సభ్యురాలు. ఎన్టీఆర్‌ బయోపిక్‌ షూటింగ్‌ జరుగుతుంటే, బాలకృష్ణ పక్కనే కుర్చీలో కూర్చొని సాక్షాత్తూ వెంకయ్యనాయుడు కనిపిస్తారు. 

బీజేపీతో తెలుగుదేశం పార్టీ బంధాలు, సంబంధాలు అలాగే ఉన్నాయి కాబట్టే, ఓటుకు రూ.కోట్లిస్తూ ఆడియో వీడియో సాక్ష్యాలతో సహా దొరికిపోయినా, సుప్రీంకోర్టు సమన్లున్నా, దేశంలో నంబర్‌ వన్‌ అవినీతి ప్రభుత్వాధిపతి ఆయనే అని ఎన్ని సంస్థలు చెబుతున్నా... ఈ పెద్దమనిషి(చంద్రబాబు) రొమ్ము విరుచుకుని తిరగ్గలుగుతున్నాడు. ఆంధ్రప్రదేశ్‌ను చంద్రబాబు అవినీతి ప్రదేశ్‌గా మార్చారని నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ అప్‌లైడ్‌ ఎకనామిక్‌ రీసెర్చ్‌(ఎన్‌సీఏఈఆర్‌), సెంటర్‌ ఫర్‌ మీడియా స్టడీస్‌(సీఎంఎస్‌), ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ వంటి స్వచ్ఛంద సంస్థలు తమ నివేదికల్లో బయటపెట్టాయి. ఇక ‘కాగ్‌’ నివేదికల్లో చంద్రబాబు కొండంత అవినీతి సంగతులు అన్నీ కాకపోయినా, కొన్నయినా ప్రస్తావనకు వచ్చాయి. ఇవన్నీ విచారణ జరగాల్సిన అంశాలే. అయినా ఇందులో ఏ ఒక్క అంశంపైనా ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన తరవాత కూడా బాబుపై విచారణ జరగడం లేదంటే... చంద్రబాబు రెండు జాతీయ పార్టీలను పగలూ రాత్రీ పద్ధతిలో ఎంతగా మేనేజ్‌ చేస్తున్నాడో, అత్యున్నత వ్యవస్థల్లో తన మనుషులను ఏ స్థాయిలో పెట్టుకుని ధర్మాన్ని అధర్మంగా, అధర్మాన్ని ధర్మంగా మార్చి చూపుతున్నాడో అర్థమవుతోంది. 

ప్రజలకు మంచి చేసి కాకుండా వ్యవస్థలను మేనేజ్‌ చేసి... ‘ప్రత్యర్థిపక్షాన్ని’ ప్రజల్లో ఎదుర్కోలేక వ్యవస్థల ద్వారా దెబ్బతీసి అధికారంలో కొనసాగాలనుకుంటున్నాడు కాబట్టే చంద్రబాబు ముందుగా నా తండ్రి గారిని టార్గెట్‌ చేశాడు. తరవాత నన్ను టార్గెట్‌ చేశాడు. ఇప్పుడు నా భార్య శ్రీమతి భారతిని తన మనుషులతో టార్గెట్‌ చేయిస్తున్నాడు. ఇలాంటి వ్యవహారాలను ఆమోదిస్తే ఇక ఈ దేశంలో ఎవరికి రక్షణ ఉంటుంది? ప్రజాస్వామ్యం ఎక్కడ బతికి ఉంటుంది? రాజకీయాలంటే ఛీ అని ఎవరికైనా అనిపించదా? అందరూ ఆలోచించండి.

హృదయపూర్వక నమస్కారాలతో... 
– వైఎస్‌ జగన్‌   

మరిన్ని వార్తలు