సాక్షి, గుంటూరు : ప్రజాసమస్యలపై పోరాడుతూ, ప్రభుత్వం అసమర్ధతను ఎండగడుతూ ప్రతిపక్షనేత, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ప్రకాశం జిల్లా పూర్తి చేసుకొని గుంటూరు జిల్లాలో ప్రవేశించింది. రాజన్న బిడ్డకు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. ప్రజాసంకల్పయాత్ర 111వ రోజు షెడ్యూల్ను వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం సోమవారం మీడియాకు విడుదల చేశారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ఉదయం బాపట్ల శివారు నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడ నుంచి మూర్తి నగరం మీదుగా కొండుగట్ల పాలెం చేరుకుంటారు. 11 గంటలకు భోజన విరామం తీసుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 2.45 గంటలకు పాదయాత్ర తిరిగి ప్రారంభమౌతుంది. అప్పికట్ల, పుండ్లం క్రాస్ మీదుగా ఏతూరు చేరుకొని సాయంత్రం 5.30 గంటలకు పాదయాత్ర ముగిస్తారు.
110వ రోజు ముగిసిన పాదయాత్ర
జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 110వ రోజు ప్రజాసంకల్పయాత్రను ముగించారు. నేడు 12 కిలోమీటర్లు నడిచిన ఆయన మెత్తం 1484.2 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేసుకున్నారు. బేతపూడి, వెదుళ్లపల్లి, వడ్డేపాలెం, మహాత్మాజీపురం మీదుగా బాపట్ల వరకు పాదయాత్ర కొనసాగింది.