వైఎస్సార్‌సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే

22 Dec, 2018 09:18 IST|Sakshi

వైఎస్‌ జగన్‌ సమక్షంలో పార్టీలో చేరిన గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే

సాక్షి, టెక్కలి/శ్రీకాకుళం: గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, ఆయన అనుచరులు శనివారం వైఎస్ జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేతలు బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి, కోలగట్ల వీరబ్రహ్మేంద్రస్వామి పాల్గొన్నారు.

ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. జననేత 328వ రోజు పాదయాత్రను శనివారం ఉదయం టెక్కలి నియోజకవర్గంలోని దామోదరపురం క్రాస్‌ నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి రావివలస, నౌపడ క్రాస్‌, జయకృష్ణాపురం, గోపినాథపురం మీదుగా టెక్కలి వరకు పాదయాత్ర కొనసాగనుంది. సాయంత్రం టెక్కలిలో జరిగే బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ పాల్గొని ప్రసంగిస్తారు. 

అడుగు ముందుకు పడనీయని అభిమానం, కాలు కదపనీయని అనురాగం, దారి పొడవునా మంగళహారతులు, ప్రజా సమస్యలపై వినతులు, విజ్ఞప్తులతో జననేత పాదయాత్ర ముందుకు కదులుతోంది. రాజన్న తనయున్ని చూడటానికి, మాట్లాడటానికి, పాదయాత్రలో తాము భాగం కావాలని ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున తరలివస్తున్నారు.

మరో మైలురాయి..
ప్రజాక్షేత్ర యాత్రికుడు, జననేత వైఎస్‌ జగన్‌ అలుపెరుగని పాదయాత్ర మరో మైలురాయిని చేరుకుంది. రావివలస వద్ద 3500 కిలోమీటర్ల మార్క్‌ను దాటింది. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ పార్టీ జెండాను ఆవిష్కరించి మొక్కను నాటారు.

మరిన్ని వార్తలు