చంద్రబాబు ఇదేనా మీ ప్రేమ : వైఎస్‌ జగన్‌

26 Apr, 2018 14:02 IST|Sakshi
వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి (పాత ఫొటో)

సాక్షి, హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీసీలను అణగదొక్కుతున్నారన్న విషయం జాతీయ బీసీ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ ఈశ్వరయ్య వెలుగులోకి తెచ్చారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. చంద్రబాబుకు బీసీలంటే ఎంత ప్రేమో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చని చెప్పారు. ఈ మేరకు గురువారం వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

హైకోర్టు న్యాయమూర్తుల నియామకం కోసం ఇద్దరు బీసీలు(అమర్‌నాథ్‌ గౌడ్, అభినవ కుమార్‌ చావల్లి)తో పాటు ఎస్సీ వర్గానికి చెందిన గంగారావు, బ్రాహ్మణ కులానికి చెందిన డీవీ సోమయాజులు, కమ్మ కులానికి చెందిన విజయలక్ష్మి, వెలమ కులానికి చెందిన కేశవరావులను సిఫార్సు చేస్తే.. అమర్‌నాథ్‌ గౌడ్, అభినవ కుమార్, గంగారావు, డీవీ సోమయాజులపై లేనిపోని ఆరోపణలు చేస్తూ 2017 మార్చి 21న చంద్రబాబు తప్పుడు నివేదిక పంపించారని ఈశ్వరయ్య ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన లేఖలను కూడా ఆయన బయటపెట్టారు.

‘నోరు తెరిస్తే బీసీల సంక్షేమం అనే చంద్రబాబు ఎందుకు బీసీ న్యాయవాదులను జడ్జిలు కాకుండా అడ్డుకుంటున్నారు? వారి నియామకాలను అడ్డుకునేలా తప్పుడు ఫీడ్‌బ్యాక్‌ ఎందుకు ఇస్తున్నారు?’ అని ట్విటర్‌లో వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు. కాగా, చంద్రబాబు తీరుపై ఆంధ్రప్రదేశ్‌ బీసీ న్యాయవాద సంఘాలు భగ్గుమన్నాయి. ఢిల్లీకి వెళ్లిన ఏపీ బీసీ న్యాయవాదుల బృందం రాష్ట్రపతికి చంద్రబాబు తీరుపై ఫిర్యాదు కూడా చేసింది.

మరిన్ని వార్తలు