‘అవినీతి చక్రవర్తి’ పుస్తకాన్ని అవిష్కరించిన వైఎస్‌ జగన్‌

6 Jan, 2019 12:07 IST|Sakshi

సాక్షి, శ్రీకాకుళం: టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం చంద్రబాబు నాయుడు ఆయన అనుచరులు 6లక్షల కోట్ల రూపాయలకు పైగా దోచుకున్నారని వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు, నిధుల గోల్‌మాల్‌కు సంబంధించి ఆధారాలతో సహా ‘అవినీతి చక్రవర్తి’ పేరుతో రాసిన పుస్తకాన్ని ఆదివారం ఆయన విడుదల చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రజాసంకల్పయాత్ర కొనసాగిస్తున్న వైఎస్‌ జగన్‌ ఈ పుస్తకాన్ని అవిష్కరించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.

అధికారంలో వచ్చినప్పటి నుంచి నవంబర్‌ 30వ తేదీ వరకు చంద్రబాబు, టీడీపీ నేతలు చేసిన అవినీతిని, అన్యాయాలను సాక్ష్యాధారాలతో, జీవో నంబర్లతో సహా ఈ పుస్తకంలో పొందుపరిచ్చనట్టు తెలిపారు. అవినీతి చక్రవర్తి పుస్తకాన్ని రాష్ట్రపతికి, ప్రధాన మంత్రికి, ఎంపీలకు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, గవర్నర్‌లకు, అన్ని దర్యాప్తు సంస్థలకు అందజేయనున్నట్టు వెల్లండించారు. చంద్రబాబు ఏపీకి చేసిన అన్యాయాన్ని దేశ వ్యాప్తంగా తెలియజేయనున్నట్టు పేర్కొన్నారు. చంద్రబాబు 6 లక్షల 17 వేల 585 కోట్ల రూపాయల సొత్తును దోచుకున్నారని విమర్శించారు.

చంద్రబాబుకు దమ్ముంటే ఖండించాలి
చంద్రబాబు ఓ అవినీతి చక్రవర్తి అని వైఎస్సార్‌ సీపీ నాయకులు తమ్మినేని సీతారాం ఆరోపించారు. చంద్రబాబుకు దమ్ముంటే ఈ పుస్తకాన్ని ఖండించాలని అన్నారు. దేశంలో అత్యంత సంపన్నమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని పలు మీడియా సంస్థలు పేర్కొంటున్న విషయాన్ని ప్రస్తావించారు. ఈ పుస్తకంలోనివి అవాస్తవాలైతే శ్వేత పత్రం విడుదల చేయాలని చంద్రబాబును డిమాండ్‌ చేశారు. చంద్రబాబు ప్రభుత్వంపై ఈ పుస్తకం చార్జీ షీట్‌ అని పేర్కొన్నారు. దీనిపై దేశవ్యాప్తంగా బహిరంగ చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. పోలవరంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందన్నారు. చంద్రబాబు అబద్దాలతో ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. 

మరిన్ని వార్తలు