నవరత్నాలతో ప్రతి పేదవాడిని ఆదుకుంటా: వైఎస్‌ జగన్‌

9 Jan, 2019 19:28 IST|Sakshi

సాక్షి, ఇచ్చాపురం : అధికారంలోకి వస్తే నవరత్నాలతో ప్రతి పేదవాడిని ఆదుకుంటామని ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చారు. 3,648 కిలోమీటర్లు సాగిన చారిత్రాత్మక పాదయాత్ర ముగిసిన సందర్భంగా ఇచ్ఛాపురం పాత బస్టాండ్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో అశేష జనవాహిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా పాదయాత్ర అనుభవాలను ప్రజలతో పంచుకున్న వైఎస్‌ జగన్‌.. అధికారంలోకి వస్తే చేసే పనులను వివరించారు.

గ్రామానికో సెక్రటేరియేట్‌..
‘ప్రతి గ్రామంలోనూ గ్రామ సెక్రటేరియేట్‌ను తీసుకొస్తాం. స్థానికులకే 10 మందికి ఉద్యోగాలు ఇస్తాం. ప్రతి పథకం పేదవాడి ఇంటి ముందుకే వచ్చే విధంగా చేస్తాం. ప్రతి 50 ఇళ్ళకు ఒకరికి గ్రామ వాలంటీయర్‌గా తీసుకొని ఉద్యోగం ఇస్తాం. వీరికి రూ. 5 వేలు జీతం ఇస్తాం. వాలంటీయర్ ఆ 50 ఇళ్ళకు జవాబుదారీగా ఉంటూ.. గ్రామ సెక్రటేరియేట్‌తో అనుసంధానమై పనిచేస్తూ.. నవరత్నాలు నుంచి రేషన్ బియ్యం వరకూ.. నేరుగా ఇంటికే  చేరేలా చేస్తాం. 

పగటిపూటే 9 గంటల ఉచిత కరెంట్‌..
రైతులకు పెట్టుబడులు తగ్గించే విధంగా చర్యలు తీసుకుంటాం. పగటి పూటే 9 గంటలపాటు ఉచితంగా కరెంటు ఇస్తాం. ప్రతి రైతు ఆదాయం పెంచడం కోసం.. బ్యాంకు రుణాలపై వడ్డీ లేకుండా సున్నా వడ్డీకే రుణాలు ఇప్పిస్తాం. మే నెలలోనే రైతన్నకు పెట్టుబడి కోసం ఏడాదికి రూ. 12,500 ఇస్తాం. రైతులందరికీ బోర్లు ఉచితంగా వేయిస్తాం. పంట ఇన్సూరెన్స్‌ల కోసం రైతులు ఇక ఆలోచించనక్కర్లేదు. అధికారంలోకి రాగానే ఇన్సూరెన్స్ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. ఆక్వా రైతుకు రూపాయిన్నరకే కరెంటు ఇస్తాం. గిట్టుబాటు ధరల కోసం రూ.3000 కోట్లతో ధరల స్థిరీకరణ తీసుకొస్తాం. ప్రతి మండలంలోనూ కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేస్తాం. ఈ రోజు లీటర్ పాలు రూ.26కు అమ్ముకుంటున్నారు. హెరిటేజ్ కోసం చంద్రబాబు డైరీలను నాశనం చేశాడు. హెరిటేజ్‌లో మాత్రం అర లీటరు పాలు రూ.45కు అమ్ముతున్నారు. పాడి ప్రోత్సాహం కోసం.. లీటరుకు రూ. 4 బోనస్ ఇస్తాం.

సహకార రంగం డైరీలను ప్రతి జిల్లాలో ప్రోత్సహిస్తాం. వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్ ట్యాక్స్‌ను పూర్తిగా రద్దు చేస్తాం. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు రైతులు నష్టపోకుండా.. రూ. 4 వేల కోట్లు(రూ. 2వేల కోట్లు రాష్ట్రం ప్లస్ రూ. 2 వేల కోట్లు కేంద్రం ఇస్తుంది) ప్రకృతి వైపరీత్యాల ఫండ్ పెడతాం. కొబ్బెరి చెట్లుకు పరిహారం రూ. 3 వేలు ఇస్తాం. జీడి చెట్లకు ఇప్పుడు ఇస్తున్న రూ. 30 వేలును రూ.50 వేలుకు పెంచుతాం. రైతన్నకు జరగకూడని నష్టం ఏమైనా జరిగితే.. వైయస్ఆర్ బీమా కింద రూ. 5 లక్షలు వెంటనే ఆ కుటుంబానికి ఇస్తాం. ఆ నష్టపరిహారం పూర్తిగా ఆడపడుచులకు ఇచ్చే సొత్తుగా చూసే విధంగా అసెంబ్లీలో చట్టం తీసుకొస్తాం. దాంతో అప్పుల వాళ్ళు లాక్కొనే అవకాశం ఉండదు. ప్రతి ప్రాజెక్టు యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేస్తాం.’  అని వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు.

  • డ్రాక్రా మహిళల కోసం వైఎస్సార్‌ ఆసరా.. 89 మంది లక్షల మంది డ్వాక్రా మహిళలకు వడ్డీ లేకుండా రుణాలు ఇస్తాం. డ్వాక్రా అక్కా చెల్లెమ్మలకు ప్రస్తుతం ఎంత రుణం ఉందో దాన్ని నాలుగు విడతలుగా చెల్లింపు.
  • ఫించన్లు: ప్రస్తుతం ఉన్న ఫించన్ల వయస్సు 65 నుంచి 60కు తగ్గింపు. అవ్వతాతకి రూ.2000 ఫించన్‌, వికలాంగులకు రూ. 3000.
  • అమ్మఒడి : పిల్లల చదువుల కోసం ఏ తల్లి భయపడొద్దు. పిల్లలను బడికి పంపితే చాలు ఏడాదికి ఒకటి నుంచి ఐదో తరగతి పిల్లలకు రూ. 500, ఇద్దరు పిల్లలకు రూ. 1000. ఆరో తరగతి నుంచి పదో తరగతి వారికి ఒక్కోక్కరి రూ.1000 చొప్పున ఇద్దరికి రూ. 2 వేలను నేరుగా తల్లలుకే అందజేత.
  • హౌసింగ్‌: పేదలకు 25 లక్షల ఇళ్లు, జన్మభూమి కమిటీలతో పనిలేకుండా ఇళ్ల కేటాయింపు
  • ఆరోగ్యశ్రీ : ఆరోగ్య శ్రీకి బడ్జెట్‌లో అవసరమైన నిధుల కేటాయింపు. సంపాదించే వ్యక్తికి ఆపరేషన్‌ అయితే విశ్రాంతి సమయంలో ఆర్థిక సాయం. కిడ్నీ బాధితులకు ప్రత్యేకంగా పెన్షన్‌.
  • ఫీజు రీయింబర్స్‌మెంట్: ప్రతి పేదవాడికి పూర్తిగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఖర్చుల కింద ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.20 వేల సాయం.
  • జలయజ్ఞం : పోలవరం సహా అన్ని ప్రాజెక్ట్‌లు యుద్ధ ప్రాతిపదికన పూర్తి.
  • మద్య నిషేధం: మూడు దశల్లో మద్య నిషేధం, మొదటి దశలో దుకాణాల సంఖ్య తగ్గింపు. ఊరురా వెలిసిన బెల్ట్‌షాపులపై ఉక్కుపాదం. షాక్‌ కొట్టేలా మద్యం ధరల పెంపు. రెండో దశలో పేద మధ్యతరగతికి మద్యం అందుబాటులోలేకుండా నిషేధం. మూడో దశలో ఫైవ్‌ స్టార్‌ హోటళ్లలో మాత్రమే మద్యం. తయారు చేసినా అమ్మినా ఏడేళ్లు జైలు శిక్ష పడేలా చట్ట సవరణ
మరిన్ని వార్తలు