చంద్రబాబు.. ఎవరికి భద్రత ఇచ్చారు : వైఎస్‌ జగన్‌

29 Mar, 2019 14:25 IST|Sakshi

రాష్ట్ర ప్రజలకా.? ఆయన కుమారుడు లోకేష్‌కా.?

పిల్లనిచ్చిన మామకే భరోసా ఇవ్వలేకపోయావ్‌..  రాష్ట్ర ప్రజలకు ఏం ఇస్తావ్‌?

బద్వేల్‌ బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌

సాక్షి, బద్వేల్‌ (వైఎస్సార్‌ జిల్లా) : ‘ఇసుక మాఫియా అడ్డుకున్న మహిళా అధికారిని జుట్టుపట్టుకుని లాక్కుని వెళ్తుంటే.. చంద్రబాబు భద్రత ఇచ్చింది ఆ మహిళా అధికారికా? ఆయన ఎమ్మెల్యేకా? కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌ ద్వారా మహిళలను వేధింపులకు గురిచేస్తుంటే చంద్రబాబు భద్రత ఇచ్చింది ఎవరికీ? ఇసుక నుంచి భూములు దాకా, భూముల నుంచి రాజధాని వరకు చంద్రబాబు దోపిడీ చేయంది ఏదైనా ఉందా? ఇంత అడ్డగోలుగా దోపిడీ చేసి ఎవరికీ భద్రత ఇచ్చారు. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ఎవరికీ భద్రత ఇచ్చాడు? రాష్ట్ర ప్రజలకా.. ఆయన కుమారుడు లోకేష్‌కా? ’ అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం వైఎస్సార్‌ జిల్లా బద్వేల్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు.

గత ఎన్నికల్లో చంద్రబాబు చేసిన వాగ్ధానాలు గుర్తు తెచ్చుకోమని, మరోసారి అలాంటి అబద్దపు హామీలకు మోసపోవద్దని కోరారు. అధికారంలోకి రాగానే నవరత్నాలతో ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపుతామని భరోసా ఇచ్చారు. బద్వేల్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జి.వెంకటసుబ్బయ్య, కడప లోక్‌సభ అభ్యర్థి వైఎస్‌ అవినాష్‌ రెడ్డిలను ఆదరించి, ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా వైఎస్ జగన్‌ విజ్ఞప్తి చేశారు. ఇంకా ఈ సభలో ఆయన ఏమన్నారంటే..

రెండేళ్లలో పరిష్కరిస్తా..
బ్రహ్మసాగర్‌ ప్రాజెక్ట్‌ ద్వారా 14 టీఎంసీలు ఇచ్చిన ఘనత దివంగత నేత వైఎస్సార్‌దే. చంద్రబాబు పాలనలో బద్వేల్‌ నియోజకవర్గంలో కరువు కాటకాలే. నా పాదయాత్రలో మీరు చెప్పిన సమస్యలు నాకు గుర్తుకున్నాయి. మీ సమస్యలన్నీ నాకు తెలుసు.. మీ అందరికి నేను ఉన్నాను అని మాట ఇస్తున్నాను. కుందు నదిపై లిఫ్ట్‌ పెట్టి బ్రహ్మం సాగర్‌కు నీరు ఇవ్వాలని, వెలిగొండ ప్రాజెక్ట్‌ పూర్తి చేసి కలిశపాడు, పోరుమామిళ్ల ప్రజలకు నీళ్లివ్వాలని మీరు చెప్పిన సమస్యలన్నీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో పరిష్కరిస్తా. 

చంద్రబాబుకు  అధికారంలో ఉన్న 57 నెలలు ప్రజలు.. అభివృద్ధి గుర్తుకు రాదు. ఎన్నికలంటేనే ఆయనకు ప్రజలు గుర్తుకువస్తారు. బద్వేల్‌లో టీడీపీ కౌన్సిలర్లే ధర్నాలు చేసారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోండి. మీ భవిష్యత్తు నా బాధ్యత అంటూ ఎన్నికలకు ముందు యాడ్స్‌ ఇస్తున్నారు. ఈ ఐదేళ్ల పాలనలో చంద్రబాబు ఎవరికీ భద్రత ఇచ్చారు. ప్రజల వ్యక్తిగత సమాచారమైన ఆధార్‌, బ్యాంక్‌ ఖాతాలు, మహిళల ఫోన్‌ నంబర్లు, ఓటర్ల వివరాలు, ఇంటిలోకేషన్లు దొంగతనంగా చోరీ చేసి టీడీపీ సేవా మిత్ర యాప్‌లో పెట్టి జన్మభూమి కమిటీలకు ఇస్తున్నాడు.మన ఆడపిల్లల నెంబర్లు వారి దగ్గర ఉంటే భద్రత ఉందా? ఈ ఐదేళ్లలో చంద్రబాబు ఎవరికి భద్రత ఇచ్చారు. ఇసుక నుంచి భూముల దాకా.. భూముల నుంచి రాజధాని వరకు దోపిడీ చేయనిది ఏమైనా ఉందా? ఇంత అడ్డగోలుగా దోపిడీ చేసి ఎవరికీ భద్రత ఇచ్చాడు. రాష్ట్ర ప్రజలకా ఆయన కుమారుడు లోక్‌ష్‌కా?

అప్పుడు గుర్తుకు రాలేదా?
ఇసుక మాఫియాను అడ్డుకున్న మహిళా అధికారిని జుట్టుపట్టుకుని లాక్కుని వెళ్తుంటే చంద్రబాబు భద్రత ఇచ్చింది ఆ మహిళా అధికిరాకా? ఆయన ఎమ్మెల్యేకా? చంద్రబాబు నివాసం ఉంటున్న విజయవాడలోనే తన కళ్ల ఎదుటనే ఆడవాళ్లకు అప్పులు ఇచ్చి మానాలు దోచుకుంటుంటే.. కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌ పేరిట వేదింపులకు గుర్తి చేస్తే.. చంద్రబాబు భద్రత ఇచ్చింది ఎవరికి? నాలుగేళ్లు బీజేపీతో సంసారం చేనపుడు కడపలో స్టీల్‌ ఫ్యాక్టరీ, ప్రత్యేక హోదా విషయం గుర్తుకు రాదు. ఈ రెండింటిని తాకట్టు పెట్టి ఎవ్వరికి భద్రతా ఇచ్చారు. రైతన్న రుణమాఫీ అని మోసం చేశారు. ఐదేళ్లు కరువు వచ్చినా పట్టించుకోలేదు. ఇంతటి దారుణంగా పరిపాలించిన ఈయన ఏ రైతుకు భరోసా ఇచ్చారు. డ్రాక్రా మహిళలు రుణమాఫీ అని ఎగ్గొట్టాడు. ఇలా మోసం చేసిన ఆయన ఏ అక్కచెల్లెమ్మకు భరోసా ఇచ్చారు. 2 లక్షల 30 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఎవరికైనా ఉద్యోగం ఇచ్చాడా? ఏ నిరుద్యోగికి చంద్రబాబు భరోసా ఇచ్చాడు. ఎన్టీఆర్‌ పెట్టిన పార్టీ.. ఆయన పదవిని లాక్కొని.. సొంత కూతురిని ఇచ్చిన మామకే భరోసా ఇవ్వలేకపోయావ్‌.. రాష్ట్ర ప్రజలకు ఏం ఇస్తావ్‌?

జన్మభూమి కమిటీలతో గ్రామాల్లో మాఫియా ఏర్పాటు చేశావ్‌.. ఏ పని జరుగాలన్నా లంచం ఇవ్వాల్సిందే. ఆఖరికి మరుగుదొడ్ల మంజూరుకు లంచం ఇవ్వాల్సిందే. ఆరోగ్యశ్రీని అటకెక్కించాడు‌. 108, 104 రాని పరిస్థితి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ భ్రష్టు పట్టించాడు.  ఇంజనీరింగ్‌ చదవాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి. 108కి ఫోన్‌ కొడితే కుయ్‌కుయ్‌ అంటూ రావాల్సిన అంబులెన్స్‌ వస్తుందనే భరోసా లేదు. ఆరోగ్యశ్రీతో జబ్బులు నయం అవుతుందన్న నమ్మకం లేదు. దొంగ పనులన్నీ చేసి చట్టానికి దొరక్కుండా ఆయనకు ఆయన భరోసా ఇచ్చుకుంటున్నారు. ఇంత దారుణమైన పాలన జరుగుతుంటే టీవీ ప్రకటనలు ఇస్తారు. 2014లో ఆయన ఇచ్చిన ప్రకటనలు గుర్తుకు తెచ్చుకోండి. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నాడు. మరీ బంగారం వచ్చిందా? జాబు కావాలంటే బాబు రావాలన్నాడు. వచ్చిందా? ఐదేళ్లు అయిపోయింది. మళ్లీ కొత్త ప్రకటనలు. మీ భవిష్యత్తు నా బాధ్యత అంటు మరో మోసానికి తెర లేపారు.

అన్న ఉన్నాడని చెప్పండి..
ఎన్నికలు వచ్చే సరికి చంద్రబాబు చేయని మోసం ఉండదు. కుట్రలతో ఈ ఎన్నికలు గెలవాలని చంద్రబాబు చూస్తున్నారు. ప్రతిగ్రామానికి మూటలు మూటలు డబ్బులు పంపిస్తారు. ఓటు కొనేందుకు ప్రతి ఒక్కరి చేతిలో రూ.3వేలు పెడతారు. మీరందరూ గ్రామాలకు వెళ్లండి ప్రతి ఒక్కరికి నవరత్నాల గురించి చెప్పండి. చంద్రబాబు ఇచ్చే 3వేలకు మోసపోవద్దని చెప్పండి. 15 రోజులు ఓపిక పడితే జగనన్న ప్రభుత్వం వస్తుందని చెప్పండి. జగనన్న వచ్చిన తర్వాత జరిగే సంక్షేమాన్ని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి. పిల్లలను బడులకు పంపిస్తే ఏడాదికి రూ.15వేలు ఇస్తామని, డ్వాక్రా మహిళలకు ఎన్నికల నాటికి ఎంత రుణమున్నా.. ఎన్నికల నాటికి నాలుగు దఫాల్లో నేరుగా ఇస్తామని తెలపండి. లక్షాధికారులను చేస్తామని ప్రతి అక్కా చెల్లెమ్మలకు చెప్పండి. 45 ఏళ్లు దాటిన ఎస్సీ, బీసీ, ఎస్టీ మైనార్టీలకు రూ. 75 వేలు ఇస్తామని చెప్పండి. అవ్వా,తాతలకు మూడు వేల ఫించన్‌ మీ మనవడు ఇస్తాడని, రాజన్న రాజ్యాన్ని జగన్‌ పాలనలో చూస్తామని చెప్పండి.’ అని వైఎస్‌ జగన్‌ కోరారు.

మరిన్ని వార్తలు