కొండలు, గుట్టలనూ మింగేస్తున్నారన్నా..

7 Sep, 2018 04:03 IST|Sakshi
విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం ఇప్పవాని పాలెంలో దివ్యాంగుడిని ఆప్యాయంగా పలకరిస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌

ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ ఎదుట జనం ఆవేదన

అధికారం అండ చూసుకుని ప్రకృతి సంపదను దోచేస్తున్నారు.. బలవంతపు భూ సేకరణతో మా కడుపు కొడుతున్నారు

డెంగీతో జనం చస్తున్నా పాలకులకు పట్టలేదు

వైద్యం చేయించుకోలేక గిరిజనులు అల్లాడిపోతున్నారు

మీరొస్తేనే మాకు న్యాయం జరుగుతుందని ఆకాంక్ష

అందరి కష్టాలూ విని ధైర్యం చెప్పిన జననేత

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి :  ‘సార్‌.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండ చూసుకుని మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు కొండలు, గుట్టలను మింగేస్తున్నారు. ప్రకృతి సంపదను అక్రమంగా దోచేస్తున్నారు. అడ్డుపడిన, ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు.

పెందుర్తి ఎమ్మెల్యే, ఆయన కుమారుడి ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. మీరే కాపాడాలి’ అంటూ వివిధ గ్రామాల ప్రజలు ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 256వ రోజు గురువారం వైఎస్‌ జగన్‌.. విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం సబ్బవరం శివారు నుంచి అమృతాపురం, ఇప్పవానిపాలెం మీదగా జెర్రిపోతులపాలెం వరకు పాదయాత్ర కొనసాగించారు. దారిపొడవునా ప్రజలు ఘన స్వాగతం పలుకుతూనే తమ సమస్యలను విన్నవించారు.

ఎమ్మెల్యే ఆగడాలు మితిమీరాయి..
పెందుర్తి ఎమ్మెల్యే, ఆయన కుమారుడు చేస్తున్న ఆగడాలను చింతగట్ల, జెర్రిపోతులపాలెం గ్రామస్తులు పలువురు జగన్‌కు ఏకరవుపెట్టారు. ‘అయ్యా.. మా గ్రామాల్లో భూముల్ని కబ్జా చేసేందుకు మా ఎమ్మెల్యే చేయని దురాగతాలు లేవు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ, అడ్డుపడిన వారిపై తప్పుడు కేసులు పెట్టిస్తున్నారు. జాతీయ రహదారి కోసం (షీలానగర్‌ నుంచి సబ్బవరం వరకు) భూమిని సేకరిస్తూ ఐదారు రెట్ల నష్టపరిహారం అని చెప్పి మోసం చేస్తున్నారు.

2013 భూ సేకరణ చట్టం ప్రకారం కాకుండా ఏవేవో మార్పులు, చేర్పులు అంటూ 1.25 రెట్లు మాత్రమే ఇస్తామంటున్నారు. ఇలా చేయడం ధర్మమా?’ అని వాపోయారు.అసైన్డ్‌ భూములు, మేఘాద్రిగడ్డ రిజర్వాయర్‌ భూములను కాజేయకుండా చూడాలని కోరారు. జెర్రిపోతులపాలెం సహా వివిధ గ్రామాల్లో కొండల్ని దారుణంగా తవ్వి.. మట్టి, గ్రావెల్‌ను అమ్ముకుంటున్నారని పలువురు జగన్‌ దృష్టికి తీసుకువచ్చారు.

సర్వే నెంబర్‌ 75లోని కొండ ప్రాంతాన్ని తవ్వుకునేందుకు ఎటువంటి అనుమతులు లేవని, అడ్డుకున్న వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని ఎమ్మెల్యే దురాగతాలను వివరించారు. కొత్తగా వేస్తున్న ఐఓసీ పైపులైను ఎమ్మెల్యే, ఇతర నాయకుల భూముల మీదుగా వెళ్లాల్సి ఉండగా, పేదల భూముల మీదుగా తీసుకుపోయేలా చేస్తున్నారని చెప్పారు. దీనిపై జగన్‌ స్పందిస్తూ ఈ వ్యవహారాలన్నింటిపై సమగ్ర సమాచారం సేకరించి పంపాలని పెందుర్తి నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త అదీప్‌ రాజుకు సూచించారు. గ్రామస్తులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.  

ఆ బాధితురాలికి అందిన సాయం నామమాత్రమే..
తెలుగుదేశం పార్టీ నాయకుల ఆగడాలతో ఘోర అవమానానికి (వివస్త్రను చేసి) గురైన ఓ మహిళ, మరో బాధితురాలైన ఆమె సోదరి వచ్చి జగన్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమకు అవమానం జరిగినప్పుడు అండగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలిపారు. 

ఘటన జరిగినప్పుడు వచ్చిన ఎస్సీ కమిషన్‌ అధ్యక్షుడు రాములు ప్రకటించిన రూ.8 లక్షల ఆర్థిక సాయంలో రూ.లక్ష మాత్రమే ఇచ్చారని, మిగతా సొమ్ము ఇంకా అందలేదని బాధితురాలు చెప్పారు. ఇల్లు ఇస్తామని చెప్పి ఇవ్వలేదన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తనకు ఆర్థిక సహాయం చేసిందని కృతజ్ఞతలు తెలిపారు. జగన్‌ స్పందిస్తూ.. ఆ సంఘటన తనను తీవ్రంగా కలచి వేసిందని, న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు.

సీఎం దత్తత గ్రామానికే దిక్కులేదు
మన్యం మంచం పట్టినా పట్టించుకున్న నాథుడు లేడన్నా అంటూ పాడేరు, అరకు నియోజకవర్గాల ప్రజలు జగన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. మన్యంలోని అనేక గ్రామాల్లో డెంగీ జ్వరం తీవ్రంగా ప్రబలిందని, అమాయక గిరిజనులకు వైద్యం అందడం లేదని వాపోయారు.  సీఎం దత్తత తీసుకున్న అరకు నియోజకవర్గంలోని పెదలబుడు గ్రామంలో డెంగీ విజృంభించినా, పట్టించుకున్న పాపాన పోలేదని న్యాయవాది నిప్పుల సింహాచలం జగన్‌కు ఫిర్యాదు చేశారు. పాడేరు, అరకులో వైఎస్సార్‌ సీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు అధికార వ్యామోహంతో టీడీపీకి అమ్ముడుపోయి వాళ్లు క్షేమంగా ఉన్నారే తప్ప గిరిజనుల సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు.

వైఎస్సార్‌సీపీ వాళ్లమని వేధిస్తున్నారు..
రాజకీయాలకు అతీతంగా గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నా తాము వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వాళ్లమని టీడీపీ నాయకులు, ఎమ్మెల్యే వేధిస్తున్నట్టు జెర్రిపోతుల పాలెం సర్పంచ్‌గా పని చేసిన కోన శ్రీనివాసరావు జగన్‌కు చెప్పారు. గ్రామంలోని పంచాయతీ కార్యాలయాన్ని తాను అభివృద్ధి చేస్తే టీడీపీ నాయకులు ఇప్పుడు దానికి పచ్చరంగు పులిమారన్నారు.

తమ ఊరిని ఆనుకుని ఉన్న కొండల్ని తొలిచేస్తున్నారని, ఈ వ్యవహారంలో అధికారులు మొదలు స్థానిక ఎమ్మెల్యే వరకు అందరికీ కమీషన్లు పోతున్నాయన్నారు. ట్రై జంక్షన్‌ బలవంతపు భూ సమీకరణ ఆపాలని, జీవో నెంబర్‌ 269ని రద్దు చేయాలని పరవాడ మండల వాసులు, దివ్యాంగులకు పాఠాలు చెప్పే తమను రెగ్యులరైజ్‌ చేయాలని పెందుర్తిలో పని చేస్తున్న టీచర్లు, తమతో గొడ్డు చాకిరీ చేయించుకుంటూ సర్వీసులను క్రమబద్ధీకరించకుండా అన్యాయం చేస్తున్నారని పంచాయతీ ఫీల్డ్‌ అసిస్టెంట్లు, జీత భత్యాలు ఇప్పించాలని లైసెన్స్‌డ్‌ సర్వేయర్లు కోరారు.

పాదయాత్ర అమృతాపురం దాటాక పలువురు వృద్ధ కళాకారులు డప్పు వాయిస్తూ ఎదురేగి జగన్‌తో కలిసి అడుగులో అడుగు వేశారు. కళాకారుల సంక్షేమం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ‘అయ్యా.. నువ్వు గెలవాలి. అప్పుడే మా లాంటి పేదలకు న్యాయం జరుగుతుంది’ అని ఊరూరా జనం ఆకాంక్షించారు. అందరి సమస్యలను ఓపికగా విని ధైర్యం చెబుతూ జననేత ముందుకు సాగారు.   


వైఎస్‌ చలువతో ఇళ్లు కట్టుకున్నాం
అయ్యా.. మాది చింతగట్ల పంచాయతీలోని ఉప్పిలివానిపాలెం. వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాలనకు ముందు మా ఊళ్లో చాలా వరకు పూరిళ్లే. అగ్ని ప్రమాదాలు, వర్షాలతో ఏటా ఇబ్బందులు పడేవాళ్లం. అందరం నిరుపేదలమే. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి 40 ఏళ్లపాటు కమ్మల ఇంట్లో ఉండేవాడిని. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక 2007లో మా గ్రామంలో వందలాది మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయించారు. ఇవాళ మా గ్రామంలో డాబా ఇళ్లు ఉన్నాయంటే అది వైఎస్‌ చలవే. – చీపురుపల్లి నారద

పింఛను రూ.3 వేలు చేస్తానన్నారు   
నాది పెందుర్తి మండలం ఇప్పవానిపాలెం. నేను పుట్టుకతోనే వికలాంగుడిని. ఇప్పుడు నాకు రూ.1500 పింఛను వస్తోంది. కుటుంబం గడవడానికి సరిపోవడం లేదు. నేను ఎనిమిదో తరగతి వరకు చదువుకున్నాను. నాకు ఒక చెల్లి ఉంది. మా చెల్లిని పెద్ద చదువులు చదివించాలనుకుంటున్నాను. జగన్‌ గారిని కలిసి నా బాధ చెప్పుకున్నాను. మరో ఆరు మాసాల్లో మన ప్రభుత్వం రాబోతుందని, రూ.3 వేల పింఛను ఇస్తానని జగనన్న హామీ ఇచ్చారు.      – దాసరి ఎర్నికుమార్‌

>
మరిన్ని వార్తలు