హైదరాబాద్: తనపై జరిగిన హత్యాయత్నానికి సంబంధించి వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన రిట్ పిటిషన్పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. కేసులో వాదనలు విన్న ధర్మాసంన తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారణ పురోగతి నివేదికను సీల్డ్ కవర్లో మంగళవారం కోర్టుకు సమర్పించాలని అటార్నీ జనరల్కు ఆదేశాలు జారీ చేసింది. ఏపీ పోలీసుల విచారణ తీరుపై ఉన్న అనుమానాలను హైకోర్టు అడిగి తెలుసుకుంది. వైఎస్ జగన్ తరపున ప్రముఖ న్యాయవాది సీవీ మోహన్ రెడ్డి వాదనలు వినిపించారు. (జగన్ వ్యాజ్యాన్ని ‘పిల్’తో జతచేస్తారా!?)
ఏపీ ప్రభుత్వ తీరు, పోలీసుల విచారణ హాస్యాస్పదంగా ఉన్నాయని, ప్రతిపక్ష నాయకుడిపై దాడి జరిగితే కిందిస్థాయి ఉద్యోగుల చేత విచారణ చేయిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కత్తి మెడపై తగిలి ఉంటే వైఎస్ జగన్ ప్రాణాలే పోయి ఉండేవని జగన్ తరపు న్యాయవాది ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్పై హత్యాయత్నంలో కుట్ర ఉందని.. ఏపీ ప్రభుత్వం, పోలీసుల అజమాయిషీ లేని, విచారణ సంస్థల చేత దర్యాప్తు జరిపించాలని న్యాయస్థానాన్ని కోరారు. హత్యాయత్నాన్ని తప్పుదోవ పట్టించేలా చంద్రబాబు, డీజీపీ ఠాకూర్ వ్యవహరించారని వెల్లడించారు. వైఎస్ జగన్పై జరిగిన హత్యాయత్నం ఘటనపై చంద్రబాబు వ్యాఖ్యలను జగన్ తరపు న్యాయవాది వివరించారు.