‘సింహం సింగిల్‌గా వస్తుంది.. బంపర్‌ మెజార్టీ ఖాయం’

31 Mar, 2019 20:02 IST|Sakshi

భూటకపు హామీలతో చంద్రబాబు మోసం చేస్తున్నారు

లోకేష్‌కు తప్ప ఎవ్వరికీ  ఉద్యోగం రాలేదు

బీజేపీ, టీఆర్‌ఎస్‌లతో వైఎస్సార్‌సీపీకి పొత్తు అవసరంలేదు

అద్దంకి ప్రచార సభలో వైఎస్‌ షర్మిల

సాక్షి, ప్రకాశం: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేని అసమర్ధ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సోదరి వైఎస్‌ షర్మిల విమర్శించారు. చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇ‍వ్వలేదుకాని, తన కుమారుడు నారాలోకేష్‌కు మాత్రం మంత్రి పదవి ఇచ్చారని మండిపడ్డారు. తన రాజకీయ లబ్ధి కోసం ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టారని, ఇలాంటి సీఎం మనకు అవసరమా అని ప్రశ్నించారు. హోదా కోసం మొదటి నుంచి పోరాడుతున్న ఏకైక పార్టీ వైఎస్సార్‌సీపీ అని షర్మిల గుర్తుచేశారు చేశారు. గత ఎన్నికల సమయంలో చంద్రబాబు 600 హామీలు ఇచ్చారని ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదని ధ్వజమెత్తారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం సంతమాగలూరులో బహిరంగ సభలో వైఎస్‌ షర్మిల ప్రసంగించారు. తమకు బీజేపీ,టీఆర్‌ఎస్‌తో పోత్తు అవసరంలేదని, వైఎస్‌ జగన్‌ సింహంలా సింగిల్‌గా వస్తారని తెలిపారు. ఎన్నికల వేళ మోసం చేయడానికి మరోసారి భూటకపు హామీలతో చంద్రబాబు మోసం చేస్తున్నారని అన్నారు. పసుపు కుంకుమ పథకం పెద్ద కుట్రపూరితమైనదని, చేపలకు ఎర వేసినట్లుగా.. ఓటర్లకు ఎర వేస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ బంపర్‌ మెజార్టీతో విజయం సాధిస్తుందని.. మళ్లీ రాజన్న రాజ్యం తీసుకువస్తామని ధీమా వ్యక్తంచేశారు. 

మరిన్ని వార్తలు