కేంద్రం ఇచ్చిన 2500 కోట్లు ఏం చేశారు: వైఎస్‌ షర్మిల

8 Apr, 2019 11:46 IST|Sakshi

అమరావతి నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన డబ్బును దోచుకున్నారు

ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టిన అసమర్థడు చంద్రబాబు

టీడీపీ పాలనలో మహిళలకు రక్షణలేదు

రాజమండ్రి రూరల్‌లో వైఎస్‌ షర్మిల ఎన్నికల ప్రచారం

సాక్షి, రాజమండ్రి: అవినీతి, అక్రమాలకు, వెన్నుపోటుకు మారుపేరు చంద్రబాబు నాయుడుని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు. ఐదేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలను టీడీపీ ప్రభుత్వం మోసం చేసిందని, ఎన్నికల వేళ పసుపు కుంకుమ పేరుతో మహిళలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. డ్వాక్రా రుణాలు, రైతు రుణామాఫీ చేస్తానని చంద్రబాబు తొలిసంతకం పెట్టారని.. కానీ ఇప్పటికి వరకు ఎలాంటి రుణాలు మాఫీచేయ్యలేదని మండిపడ్డారు. వనజాక్షీ అనే మహిళా ఉద్యోగినిని టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌  జుట్టుపట్టుకుని కొడితే ఆయనపై  ఏం చర్యలు తీసుకున్నారని షర్మిల ప్రశ్నించారు. అంగన్‌వాడి వర్కర్లు జీతాలు పెంచమని ధర్నా చేస్తే.. వారిపై లాఠిచీర్జ్‌ చేశారని విమర్శించారు. చంద్రబాబు పాలనలో మహిళలకు ఏలాంటి రక్షణ లేదన్నారు.


గత 40 ఏళ్లలో ఎప్పుడూ జరగలేదు..

ఎన్నికల ప్రచారంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్‌లోని ధవళేశ్వరం బస్టాండ్‌ సెంటర్‌ వైఎస్‌ షర్మిల రోడ్‌ షోను నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాజమండ్రి రూరల్‌ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆకుల వీర్రాజును, ఎంపీ అభ్యర్థి మార్గని భరత్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఐదేళ్లు సీఎంగా ఉండి అమరావతిలో ఒక్క పర్మినెంట్‌ భవనం కూడా నిర్మించలేదని, అలాంటి వ్యక్తికి మరోసారి అవకాశం ఎలా ఇస్తారని పేర్కొన్నారు. అమరావతి నిర్మానానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.2500 కోట్లు ఇచ్చినట్లు చెబుతోందని.. ఆ డబ్బుంతా  ఏం చేశారని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టిన అసమర్ధుడు చంద్రబాబని, ఇలాంటి వ్యక్తి మనకు అవసరమా అని అన్నారు. నాలుగేళ్లు బీజేపీతో కలిసిఉండి.. ఇప్పుడు కాంగ్రెస్‌తో జట్టు కట్టారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టీడీపీ పాలనలో జరిగిన అవినీతి గత 40 ఏళ్లలో ఎప్పుడూ జరగలేదని మాజీ సీఎస్‌ అజయ్‌ కల్లం చెప్పినట్లు ఆమె గుర్తుచేశారు. 

‘‘దివంగత వైఎస్సార్‌ హయాంలో రైతులు, పేదలు, మహిళలు సంతోషంగా ఉన్నారు. విద్యార్థులను ఉచితంగా చదవించారు. ఎవ్వరికీ సాధ్యం కాని సంక్షేమ పథకాలను అమలు చేసి రికార్డు సృష్టించిన నాయకుడు వైఎస్సార్‌. పార్టీలకు అతీతంగా అందరినీ ఆదుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో మాత్రం, కొంతమందికే లబ్ధిచేకూరింది. గత ఎన్నికల సమయంలో జాబు రావలంటే బాబు రావాలన్నారు.. కానీ ఆయన కుమారుడు లోకేష్‌ మాత్రమే మంత్రి పదవి వచ్చింది. ఏ ఒక్కరికీ ఉద్యోగం దొరకలేదు. వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటారు. రైతులకు ప్రతి మేలో రూ.12500 ఇస్తారు. పెన్షన్‌ పెంచుతారు. పిల్లల్ని బడికి పంపిన తల్లికి ఏడాదికి రూ. 15000 అందిస్తారు. డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీ చేస్తారు.’’ అని అన్నారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


 

మరిన్ని వార్తలు