చంద్రబాబు హామీల బాకీ తీర్చమని అడగండి: షర్మిల

5 Apr, 2019 20:02 IST|Sakshi

సాక్షి, పశ్చిమ గోదావరి: ‘టీడీపీ వాళ్లు ఓట్ల కోసం వస్తే.. చంద్రబాబు ఇచ్చిన హామీల బాకీని తీర్చమని అడగండి. మీకు చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీకి సంబంధించి.. రావాల్సిన బాకీని చెల్లించమనండి. రాష్ట్రంలో దోచుకున్న మీ భూములను రాసి ఇవ్వమని చెప్పండి. ఇలా అయితే ఎన్ని డబ్బులు ఇచ్చిన చంద్రబాబు మీ బాకీ తీర్చలేర’ని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల పేర్కొన్నారు. శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట బహిరంగ సభలో షర్మిల ప్రసంగించారు. రాష్ట్రంలో నీతివంతమైన పాలన రావాలంటే జగనన్న అధికారంలోకి రావాలని అన్నారు. నరసాపురం ఎంపీ అభ్యర్థి రఘురామ కృష్ణంరాజును, ఆచంట ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీరంగనాథరాజును గెలిపించమని కోరారు. చంద్రబాబుకు బై బై చెప్పాలన్నారు.

ఇంకా షర్మిల మాట్లాడుతూ.. ‘దివంగత మహానేత రాజశేఖరరెడ్డి గారు ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ ఐదేళ్లలో ప్రతి రైతు కుటుంబం ధైర్యంగా ఉండేది. ప్రతి పేద కుటుంబానికి భరోసా ఉండేది. ప్రతి మహిళకు నాకు అండ ఉందనే ధైర్యం ఉండేది. ప్రతి విద్యార్థికి నా చదవుకు డోకా లేదు ఉద్యోగం వస్తుందనే ధైర్యం ఉండేది. ప్రతి పేదవాడు కార్పొరేటు ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేయించుకునే ఆరోగ్య శ్రీ ఉండేది. ఫోన్‌ చేస్తే 20 నిమిషాల్లో వచ్చే 108  ఉండేది. ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని శ్రమించాడు. ప్రతి పేదవాడికి ఇళ్లు ఇవ్వాలని ఆశపడ్డాడు. ఐదేళ్లలో ఒక్క రూపాయి ఏ చార్జీ పెంచకుండా.. ఏ పన్ను పెంచకుండా.. అన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేసి సీఎం ఎలా ఉండాలో వైఎస్సార్‌ చూపించారు. కులం, మతం, పార్టీలతో సంబంధం లేకుండా వైఎస్సార్‌ ప్రతి ఒక్కరికి మేలు చేశారు.ముఖ్యమంత్రి హోదాలో కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా మేలు చేసింది వైఎస్సార్‌ మాత్రమే. అందుకే ఆ మహానేత చనిపోయి పదేళ్లు కావస్తున్న కోట్ల మంది గుండెల్లో బ్రతికే ఉన్నారు.

ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు వెన్నుపోటుకు, అబద్ధాలకు, అవినీతికి, అరాచకానికి మారుపేరు. రైతులకు, మహిళలను చంద్రబాబు దగా చేశారు. డ్వాక్రా మహిళను రుణమాఫీ పేరుతో మోసం చేశారు. డ్వాక్రా మహిళలకు ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదు. పసుపు-కుంకుమ పేరుతో చంద్రబాబు మళ్లీ మహిళలను మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. పసుపు-కుంకుమ పేరిట చంద్రబాబు ఎంగిలి చేయి విదిలిస్తున్నారు. ఆ డబ్బులు వడ్డీకి కూడా సరిపోవు. విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తున్నారా?. ఆరోగ్య  శ్రీ జాబితా నుంచి కార్పొరేటు ఆస్పత్రులను తొలగించారు. కానీ చంద్రబాబు నాయుడు కుటుంబం ప్రభుత్వ ఆస్పత్రికి కెళ్లి వైద్యం చేయించుకుంటుందా?.

16వేల కోట్ల రూపాయల అంచనా ఉన్న పోలవరాన్ని తన కమిషన్ల కోసం 60వేల కోట్లకు చంద్రబాబు పెంచారు. తన బినామీల కోసం కేంద్రం కట్టాల్సిన పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు తానే కడతానని తీసుకున్నారు. మూడేళ్లలో పోలవరం పూర్తి చేస్తానన్న చంద్రబాబు మాట మీద నిలబడ్డారా?. చంద్రబాబుకు మాట మీద నిలబడే నైజం లేదు. రాజధాని విషయంలో చాలా అనుభవం ఉంది.. హైదరాబాద్‌ను అంతా నేనే కట్టేశానని చంద్రబాబు చెప్పారు. రాజధాని గొప్పగా కబుర్లు చెప్పారు. కానీ ఒక్క శాశ్వత నిర్మాణం అయిన చేపట్టారా?. బీజేపీ ప్రభుత్వం 2500 కోట్లు ఇచ్చామని చెబుతుంటే చంద్రబాబు రాజధానిలో చేసిందేమీ లేదు. ఆ డబ్బులు అన్ని ఎక్కడ ఉన్నట్టు?. ఆ డబ్బు చంద్రబాబు బొజ్జలో ఉన్నట్టు. అమ్మకు అన్నం పెట్టడు కానీ పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానని అన్నట్టు  ఉంది చంద్రబాబు తీరు. ఐదేళ్లలో అమరావతిలో ఒక శాశ్వత నిర్మాణం చేపట్టని చంద్రబాబు.. మళ్లీ అధికారం ఇస్తే అమెరికా చేస్తానని అంటున్నారు. శ్రీకాకుళంను హైదరాబాద్‌ చేస్తానని మన చెవుల్లో పూలు పెట్టారు. క్యాబేజీలు కూడా పెడతారట.

బాబు వస్తే జాబు వస్తుందన్నారు. కానీ చంద్రబాబు గారి కుమారుడు లోకేశ్‌కు మాత్రమే జాబు వచ్చింది. ఏకంగా లోకేశ్‌కు మూడు మంత్రి పదవులు ఇచ్చారు. ఆయన తెలివిమంతుడు అనుకుంటే.. ఈ లోకేశ్‌కు జయంతికి, వర్ధంతికి తేడా తెలియదు. ఒక్క ఎన్నిక కూడా గెలవకుండానే లోకేశ్‌కు మంత్రి పదవి కట్టబెట్టారు. చంద్రబాబుది పుత్ర వాత్సల్యం కాదా?. ఇప్పుడు చంద్రబాబు మీ భవిష్యత్తు నా భాద్యత అని అంటున్నారు. గత ఐదేళ్లుగా ప్రజల భవిష్యత్తు చంద్రబాబు బాధ్యత కాదా?. ఈ ఐదేళ్లు లోకేశ్‌ కోసమే చంద్రబాబు పనిచేశారు. ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి ఎంతో అవసరం. హోదా లేకుంటే ఉద్యోగాలు రావు, పరిశ్రమలు రావు. ప్రత్యేక హోదా ఏపీకి ఊపిరి. ఇది తెలిసికూడా చంద్రబాబు బీజేపీతో కలిసి హోదాను తాకట్టు పెట్టారు. చంద్రబాబు గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు.. ఇప్పుడు కాంగ్రెస్‌తో కలిసి వస్తున్నారు. ఎవరికైనా టీడీపీ వాళ్లు రెండు వేళ్లు చూపెడితే మీకు రెండు నాలుకలు ఉన్నాయి నిజమేనని చెప్పాలి.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశం బతికి ఉందంటే అది కేవలం వైఎస్‌ జగన​ వల్లనే. హోదా కోసం ఢిల్లీ వేదికగా వైఎస్‌ జగన్‌ ధర్నాలు, దీక్షలు చేశారు. రాష్ట్రంలో రోజుల తరబడి నిరహార దీక్షలు చేపట్టారు. బంద్‌లు చేశారు, యువభేరీలుపెట్టారు. అఖరికి వైఎస్సార్‌ సీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేసి త్యాగం చేశారు.ప్రత్యేక హోదా కోసం వైఎస్‌ జగన్‌ ఊరురా తిరిగి హోదా కోసం పోరాడకపోతే.. ఈ రోజు చంద్రబాబు యూ టర్న్‌ తీసుకునేవారా?. చంద్రబాబు నోట హోదా మాట వచ్చేదా?. నాన్నగారు చెప్పారు.. ఏ రోజైతే చంద్రబాబు గారు ఒక్క నిజం చెబితే, ఆ రోజు చంద్రబాబు గారి తలకాయ వెయ్యి ముక్కలు అవుతుందటా. అందుకే ఆయన ఎప్పుడు నిజాలు మాట్లాడారు. చంద్రబాబు, లోకేశ్‌ కలిసి రాష్ట్రాన్ని లూఠీ చేశారు. మన భవిష్యత్తును వీళ్ల చేతుల్లో పెడితే నాశనం చేస్తారు. నారారూపరాక్షసులు వీళ్లు.

తాను బస్సు డ్రైవర్‌ అని.. బస్సు నడపకపోతే రాష్ట్రం ముందకు వెళ్లదని చంద్రబాబు చెప్తున్నారు. ఇదే చంద్రబాబు ప్రత్యేక హోదా బస్సును నడిపి బీజేపీకి అమ్మి డబ్బులు తీసుకున్నారు. రాజధాని బస్సును నడిపి బోల్తా కొట్టించారు. పోలవరం అనే బస్సును చంద్రబాబు నడిపితే దానిలో ఉన్న సీట్లను, టైర్లను, ఎసీలను అమ్ముకున్నారు. ఈయన బస్సు డ్రైవరైతే ఆ బస్సును నేరుగా మీ మీద నడిపించి ప్రాణాలు కూడా తీసేస్తారు. నిన్ను నమ్మం బాబు అని టీడీపీ వాళ్లకి తెల్చిచెప్పండి. టీడీపీ వాళ్లు ఓట్లు అడగడానికి వస్తే.. చంద్రబాబు ఇచ్చిన హామీల బాకీని తీర్చమని చెప్పండి. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్నారు.. దాని ప్రకారం పిల్లల ఫీజులు చెల్లించమని అడగండి. ఆడపిల్ల పుడితే 25వేలు డిపాజిట్‌ చేస్తామని చెప్పారు.. చేశారా?. కాలేజ్‌ విద్యార్థులకు ఐ ప్యాడ్‌ ఇస్తామని అన్నారు.. ఇచ్చారా?. మహిళలకు స్మార్ట్‌ ఫోన్లు ఇస్తామని చెప్పాడు.. ఇచ్చారా?. ఇవన్నీ మీ హక్కుగా టీడీపీని అడగండి. ఇంటికోక ఉద్యోగం అన్నాడు.. లేకపోతే రెండు వేలు ఇస్తానని వాగ్ధానం చేశారు. ప్రతి ఇంటికి చంద్రబాబు లక్ష ఇరవై వేల రూపాయలు బాకీ పడ్డారు అన్నమాట. పేదలకు మూడు సెంట్ల భూమి ఇచ్చాడా?. రాష్ట్రంలో దోచుకున్న భూములను రాసి ఇవ్వమని చెప్పండి. ఎన్ని డబ్బులు ఇచ్చిన చంద్రబాబు మీకిచ్చిన బాకీ తీర్చలేరు. మళ్లీ మోసపోకండి.

ఈ అవినీతి రాజ్యం పోవాలంటే, రాజన్న రాజ్యం కావాలంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలి. జగనన్న ఈ తొమ్మిదేళ్లు నీతివంతమైన రాజకీయాలు చేశారు. పాదయాత్ర 3,648 కి.మీ చేశారు. ప్రజ సమస్యలను దగ్గరగా చూశారు. వ్యవసాయం పండగ కావాలంటే, మాట తప్పనివాడు కావాలంటే, మడమతిప్పని వాడు కావాలంటే జగనన్న రావాలి. ప్రతి రైతు తలెత్తుకునేలా చేస్తాం. రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ప్రతి రైతన్నకు పెట్టుబడి సాయంగా మే నెలలోనే రూ. 12, 500 అందిస్తారు. గిట్టుబాటు ధర కోసం 3వేల కోట్ల రూపాయలతో నిధి ఏర్పాటు చేస్తారు. కరువులను ఎదర్కొవడానికి 4వేల కోట్ల రూపాయలతో మరో నిధిని ఏర్పాటు చేస్తారు.కరువులు వచ్చినప్పుడు రైతులు నష్టపోకుండా నాలుగు వేల కోట్లతో నిధి ఏర్పాటు చేస్తాం.  విద్యార్థుల కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తారు. ఎంత చదువు చదివిన ఆ ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది. విద్యార్థులకు హాస్టల్‌, మెస్‌ చార్జీలను కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది. 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ మహిళలకు వైఎస్సార్‌​ చేయూత కింద 75 వేల రూపాయలు నాలుగు దఫాలుగా చెల్లిస్తాం. అక్కాచెల్లెమ్మలకు సున్నా వడ్డీ రుణాలు ఇవ్వడంతో పాటుగా ఎన్నికల నాటికి ఉన్న బకాయిలను నాలుగు దఫాలుగా మాఫీ చేస్తారు. మళ్లీ సున్నా వడ్డీలకే రుణాలు ఇస్తారు. ఎక్కడ వైద్యం చేయించుకున్నా ఆరోగ్య శ్రీ వర్తింపజేస్తారు. అవ్వ తాతలకు పింఛన్‌ మూడు వేల రూపాయలకు పెంచుకుంటూ పోతాం. వికలాంగులకు మూడు వేల రూపాయలు పింఛన్‌ ఇస్తూ.. ప్రతి విషయంలో వారికి అండగా నిలుస్తాం. సమస్య లేకుండా.. మీ సంక్షేమం కోసం అన్ని చర్యలు తీసుకుంటాం. ఏ ఒక్కరికి అన్యాయం జరగనివ్వం. ఎరువుల ప్యాక్టరీ రాకుండా చూస్తాం. మళ్లీ దుర్మార్గపు పాలన మనకు అవసరం లేదు. హరికృష్ణ భౌతికకాయాన్ని పక్కనే ఉంచుకుని కేసీఆర్‌తో పొత్తు కోసం చంద్రబాబు ప్రయత్నించారు. తమకు ఏ పార్టీతో పొత్తు లేదు... ఆ అవసరం కూడా లేదు. సింహం సింగిల్‌గానే వస్తుంది. నక్కలే గుంపులుగా వస్తాయి. అందుకే చంద్రబాబు అందరినీ వెంట పెట్టుకుని వస్తున్నారు. చంద్రబాబుకు బాయ్‌ బాయ్‌ చెప్పమ’ని కోరారు.

మరిన్ని వార్తలు