అప్పుడు చంద్రబాబు పౌరుషం చచ్చిపోయిందా?

7 Apr, 2019 17:24 IST|Sakshi

సాక్షి, కాకినాడ: ‘చంద్రబాబు పౌరుషం, రోషం అంటూ తనకు సూట్‌ కానీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. కేసీఆర్‌తో వైఎస్‌ జగన్‌కు పొత్తుందని దుష్ప్రాచారం చేస్తున్నారు. మాకు ఏ పార్టీతోనూ పొత్తు లేదు కానీ,  హరికృష్ణ భౌతికకాయాన్ని పక్కనే ఉంచుకుని కేసీఆర్‌తో పొత్తు కోసం వెంపర్లాడింది ఈ చంద్రబాబు నాయుడు కాదా?. అప్పుడు చంద్రబాబు పౌరుషం చచ్చిపోయిందా?. ఒక్క ఎన్నిక కూడా గెలవకుండా కొడుకుని ఎమ్మెల్సీని చేశారు... మంత్రి పదవి ఇచ్చారు. అప్పుడు చంద్రబాబు పౌరుషం నిద్రపోయిందా?. ఎన్టీఆర్‌ గారికి వెన్నుపోటు పొడిచి ఆయన పార్టీని, అధికారాన్ని కబ్జా చేయడాన్ని పౌరుషం అంటారా?. పిల్లి గట్టిగా పౌరుషం ఉందని అరిస్తే పులి అయిపోతుందా?. పిల్లి పిల్లే.. పులి పులే’ అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో జరిగిన బహిరంగ సభలో షర్మిల ప్రసంగించారు. వైఎస్సార్‌ సీపీ కాకినాడ ఎంపీ అభ్యర్థి వంగ గీతాను, కాకినాడ సీటీ ఎమ్మెల్యే అభ్యర్థి చంద్రశేఖరరెడ్డిని గొప్ప మెజారిటీతో గెలిపించాలని కోరారు.

అది పౌరుషం, రోషం అంటే..
ఇంకా షర్మిల మాట్లాడుతూ.. ‘వైఎస్‌ జగన్‌ ఓదార్పు అని ఇచ్చిన ఒక్కమాట కోసం కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఒక్కరే సింగిల్‌గా బయటకు వచ్చారు. అది పౌరుషం అంటే, అది రోషం అంటే. ఆయనతో పాటు 18 మంది ఎమ్మెల్యేలు బయటికి వస్తే.. వేరే పార్టీ నుంచి గెలిచారని వారి చేత రాజీనామా చేయించారు. మళ్లీ వైఎస్సార్‌సీపీ తరఫున గెలిపించుకున్నాం. అది పౌరుషం అంటే. చంద్రబాబు చెప్పినట్టు బీజేపీతో పొత్తు ఉంటే.. జగన్‌పై పెట్టిన అక్రమ కేసులు మాఫీ చేపించుకునేవారు కాదా?. మాకు ఏ పార్టీతో పొత్తు లేదు... ఆ అవసరం కూడా లేదు. సింహం సింగిల్‌గానే వస్తుంది. జగనమోహన్‌రెడ్డిగారు సింగిల్‌గానే బంపర్‌ మెజారిటీతో గెలుస్తారని సర్వేలన్నీ చెప్తున్నాయి. నక్కలే గుంపులుగా వస్తాయి. అందుకే చంద్రబాబు పవన్‌కల్యాణ్‌ను, మమతా బెనర్జీని , కేజ్రీవాల్‌ను, దేవేగౌడ్‌ను, ఫరూక్‌ అబ్దుల్లాను వెంట పెట్టుకుని వస్తున్నారు. 

వైఎస్సార్‌ కోట్లాది మంది గుండెల్లో బ్రతికే ఉన్నారు
దివంగత మహానేత రాజశేఖరరెడ్డి గారు ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ ఐదేళ్లలో ప్రతి రైతు కుటుంబం ధైర్యంగా ఉండేది. ప్రతి పేద కుటుంబానికి భరోసా ఉండేది. ప్రతి మహిళకు నాకు అండ ఉందనే ధైర్యం ఉండేది. ప్రతి విద్యార్థికి నా చదవుకు డోకా లేదు ఉద్యోగం వస్తుందనే ధైర్యం ఉండేది. ప్రతి పేదవాడు కార్పొరేటు ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేయించుకునే ఆరోగ్య శ్రీ ఉండేది. ఫోన్‌ చేస్తే 20 నిమిషాల్లో వచ్చే 108  ఉండేది. ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని శ్రమించాడు. ప్రతి పేదవాడికి ఇళ్లు ఇవ్వాలని ఆశపడ్డాడు. ఐదేళ్లలో ఒక్క రూపాయి ఏ చార్జీ పెంచకుండా.. ఏ పన్ను పెంచకుండా.. అన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేసి సీఎం ఎలా ఉండాలో వైఎస్సార్‌ చూపించారు. కులం, మతం, పార్టీలతో సంబంధం లేకుండా వైఎస్సార్‌ ప్రతి ఒక్కరికి మేలు చేశారు.ముఖ్యమంత్రి హోదాలో కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా మేలు చేసింది వైఎస్సార్‌ మాత్రమే. అందుకే ఆ మహానేత చనిపోయి పదేళ్లు కావస్తున్న కోట్ల మంది గుండెల్లో బ్రతికే ఉన్నారు.

ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు వెన్నుపోటుకు, అబద్ధాలకు, అవినీతికి, అరాచకానికి మారుపేరు. రైతులకు, మహిళలను చంద్రబాబు దగా చేశారు. డ్వాక్రా మహిళను రుణమాఫీ పేరుతో మోసం చేశారు. డ్వాక్రా మహిళలకు ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదు. పసుపు-కుంకుమ పేరుతో చంద్రబాబు మళ్లీ మహిళలను మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. పసుపు-కుంకుమ పేరిట చంద్రబాబు ఎంగిలి చేయి విదిలిస్తున్నారు. ఆ డబ్బులు వడ్డీకి కూడా సరిపోవు. విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తున్నారా?.మహిళ ఎమ్మార్వో వనజాక్షిని టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని జట్టు పట్టుకుని లాక్కెళ్లినప్పుడు చంద్రబాబులోని అన్న చచ్చిపోయారా?. రిషితేశ్వరి వేధింపులకు గురై చనిపోయినప్పుడు ఈ అన్న ఏక్కడికి పోయారు?. ఆరోగ్య  శ్రీ జాబితా నుంచి కార్పొరేటు ఆస్పత్రులను తొలగించారు. కానీ చంద్రబాబు నాయుడు కుటుంబం ప్రభుత్వ ఆస్పత్రికి కెళ్లి వైద్యం చేయించుకుంటుందా?.

ఒక్క పర్మినెంట్‌ బిల్డింగ్‌ అయిన కట్టారా?
16వేల కోట్ల రూపాయల అంచనా ఉన్న పోలవరాన్ని తన కమిషన్ల కోసం 60వేల కోట్లకు చంద్రబాబు పెంచారు. తన బినామీల కోసం కేంద్రం కట్టాల్సిన పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు తానే కడతానని తీసుకున్నారు. మూడేళ్లలో పోలవరం పూర్తి చేస్తానన్న చంద్రబాబు మాట మీద నిలబడ్డారా?. చంద్రబాబుకు మాట మీద నిలబడే నైజం లేదు. రాజధాని విషయంలో చాలా అనుభవం ఉంది.. హైదరాబాద్‌ను అంతా నేనే కట్టేశానని చంద్రబాబు చెప్పారు. రాజధాని గొప్పగా కబుర్లు చెప్పారు. కానీ ఒక్క పర్మినెంట్‌ బిల్డింగ్‌ అయిన కట్టారా?. బీజేపీ ప్రభుత్వం 2500 కోట్లు ఇచ్చామని చెబుతుంటే చంద్రబాబు రాజధానిలో చేసిందేమీ లేదు. ఆ డబ్బులు అన్ని ఎక్కడ ఉన్నట్టు?. ఆ డబ్బు చంద్రబాబు బొజ్జలో ఉన్నట్టు. అమ్మకు అన్నం పెట్టడు కానీ పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానని అన్నట్టు  ఉంది చంద్రబాబు తీరు. ఐదేళ్లలో అమరావతిలో ఒక శాశ్వత నిర్మాణం చేపట్టని చంద్రబాబు.. మళ్లీ అధికారం ఇస్తే అమెరికా చేస్తానని అంటున్నారు. శ్రీకాకుళంను హైదరాబాద్‌ చేస్తానని మన చెవుల్లో పూలు పెడతారంట, క్యాబేజీలు కూడా పెడతారట.

లోకేశ్‌ కోసమే చంద్రబాబు పనిచేశారు..
బాబు వస్తే జాబు వస్తుందన్నారు. కానీ చంద్రబాబు గారి కుమారుడు లోకేశ్‌కు మాత్రమే జాబు వచ్చింది. ఏకంగా లోకేశ్‌కు మూడు మంత్రి పదవులు ఇచ్చారు. ఆయన తెలివిమంతుడు అనుకుంటే.. ఈ లోకేశ్‌కు జయంతికి, వర్ధంతికి తేడా తెలియదు. అ,ఆలు కూడా రావు కానీ అగ్రతాంబులం నాకే అన్నట్టు ఉంది. ఒక్క ఎన్నిక కూడా గెలవకుండానే లోకేశ్‌కు మంత్రి పదవి కట్టబెట్టారు. చంద్రబాబుది పుత్ర వాత్సల్యం కాదా?. ఇప్పుడు చంద్రబాబు మీ భవిష్యత్తు నా భాద్యత అని అంటున్నారు. గత ఐదేళ్లుగా ప్రజల భవిష్యత్తు చంద్రబాబు బాధ్యత కాదా?. చంద్రబాబు కొడుక్కు మూడు ఉద్యోగాలు.. మాములు యువతకు ఉద్యోగాలు లేవు, నోటిఫికేషనులు లేవు. ఈ ఐదేళ్లు లోకేశ్‌ కోసమే చంద్రబాబు పనిచేశారు. ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి ఎంతో అవసరం. హోదా లేకుంటే ఉద్యోగాలు రావు, పరిశ్రమలు రావు. ప్రత్యేక హోదా ఏపీకి ఊపిరి. గత ఎన్నికలప్పుడు 15 ఏళ్లు ప్రత్యేక హోదా అడిగిన చంద్రబాబు సీఎం అయ్యాక బీజేపీతో కలిసి హోదాను తాకట్టు పెట్టారు. అప్పుడు కమిషన్ల కోసం ఆశపడ్డారు. మళ్లీ ఎన్నికలు వచ్చేసరికి ప్రత్యేక హోదా అని నమ్మబలుకుతున్నారు. మళ్లీ ఎన్నికలయ్యాక ఏం చేస్తారో?. చంద్రబాబు గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు.. ఇప్పుడు కాంగ్రెస్‌తో కలిసి వస్తున్నారు. చంద్రబాబుకు రెండు నాలుకలు ఉంటాయి కాబట్టే రెండు వేళ్లు చూపెడుతు ఉంటారు. ఎవరికైనా టీడీపీ వాళ్లు రెండు వేళ్లు చూపెడితే మీకు రెండు నాలుకలు ఉన్నాయి నిజమేనని చెప్పాలి.

చంద్రబాబు నోట హోదా మాట వచ్చేదా?
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశం బతికి ఉందంటే అది కేవలం వైఎస్‌ జగన​ వల్లనే. హోదా కోసం ఢిల్లీ వేదికగా వైఎస్‌ జగన్‌ ధర్నాలు, దీక్షలు చేశారు. రాష్ట్రంలో రోజుల తరబడి నిరహార దీక్షలు చేపట్టారు. బంద్‌లు చేశారు, యువభేరీలుపెట్టారు. అఖరికి వైఎస్సార్‌ సీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేసి త్యాగం చేశారు.ప్రత్యేక హోదా కోసం వైఎస్‌ జగన్‌ ఊరురా తిరిగి హోదా కోసం పోరాడకపోతే.. ఈ రోజు చంద్రబాబు యూ టర్న్‌ తీసుకునేవారా?. చంద్రబాబు నోట హోదా మాట వచ్చేదా?. కానీ చంద్రబాబు గారు నిజం చెప్పరు. ఎందుకంటే నాన్నగారు చెప్పారు.. ఏ రోజైతే చంద్రబాబు గారు ఒక్క నిజం చెబితే, ఆ రోజు చంద్రబాబు గారి తలకాయ వెయ్యి ముక్కలు అవుతుందటా. అందుకే ఆయన ఎప్పుడు నిజాలు మాట్లాడారు.

పవన్‌ యాక్టర్‌.. చంద్రబాబు డైరక్టర్‌..
పవన్‌ కల్యాణ్‌ ఒక యాక్టర్‌.. ఆయన రాజకీయ సినిమాలో చంద్రబాబు డైరక్టర్‌.  అందుకే పవన్‌ చంద్రబాబు చెప్పిందే చేస్తున్నారు. ఇద్దరు కలిసే ఉన్నారు. సీట్లు పంచుకున్నారు. జనసేనకు ఒటేస్తే.. చంద్రబాబుకు ఒటేసినట్టే. పవన్‌ కల్యాణ్‌ అన్న చిరంజీవి తాను స్థాపించిన ప్రజారాజ్యం పార్టీని హోల్‌సేల్‌గా కాంగ్రెస్‌ పార్టీకి అమ్మేశారు. అన్నలాగే ఇప్పుడు పవన్‌ కల్యాణ్‌ కూడా తన పార్టీని హోల్‌సేల్‌గా టీడీపీకి అమ్మేస్తారు. టీడీపీ వాళ్లు ఓట్లు అడగడానికి వస్తారు. డబ్బులు ఇవ్వాలని చూస్తారు. అప్పుడు వాళ్లను కూర్చొబెట్టి.. చంద్రబాబు ఇచ్చిన హామీల బాకీని తీర్చమని చెప్పండి. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్నారు.. దాని ప్రకారం పిల్లల ఫీజులు చెల్లించమని అడగండి. ఆడపిల్ల పుడితే 25వేలు డిపాజిట్‌ చేస్తామని చెప్పారు.. చేశారా?. కాలేజ్‌ విద్యార్థులకు ఐ ప్యాడ్‌ ఇస్తామని అన్నారు.. ఇచ్చారా?. మహిళలకు స్మార్ట్‌ ఫోన్లు ఇస్తామని చెప్పాడు.. ఇచ్చారా?. ఇవన్నీ మీ హక్కుగా టీడీపీని అడగండి.ఇంటికోక ఉద్యోగం అన్నారు.. లేకపోతే రెండు వేలు ఇస్తానని వాగ్ధానం చేశారు. ప్రతి ఇంటికి చంద్రబాబు లక్ష ఇరవై వేల రూపాయలు బాకీ పడ్డారు అన్నమాట. ఆ డబ్బులు ఇవ్వమని అడగండి. పేదలకు మూడు సెంట్ల భూమి, ఇళ్లు కట్టించారా?. రాష్ట్రంలో దోచుకున్న భూములను రాసి ఇవ్వమని చెప్పండి. ఓట్లు కొందామని చూస్తారు.. నిజానికి ఎన్ని డబ్బులు ఇచ్చిన చంద్రబాబు మీకిచ్చిన బాకీ తీర్చలేరు. మళ్లీ మోసపోకండి.

నారారూప రాక్షసులు వీళ్లు
ఈ అవినీతి పాలన పోవాలంటే, రాజన్న రాజ్యం రావాలన్నా, వ్యవసాయం పండగ కావాలంటే, మాట తప్పనివాడు కావాలంటే, మడమతిప్పని వాడు కావాలంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలి. కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా సేవ చేయాలని వైఎస్‌ జగన్‌ ఆశపడుతున్నారు. ఒక్క అవకాశం ఇవ్వమని అడుగుతున్నాం. చంద్రబాబు దగ్గర పనిచేసిన సీఎస్‌ అజేయ కల్లెం.. ఈ ఐదేళ్లలో గత 40 ఏళ్లలో చేయని అప్పు చేశారని చెబుతున్నారు. మన భవిష్యత్తును వీళ్ల చేతుల్లో పెడితే నాశనం చేస్తారు. నారారూప రాక్షసులు వీళ్లు. జగనన్న ఈ తొమ్మిదేళ్లు నీతివంతమైన రాజకీయాలు చేశారు. పాదయాత్ర 3,648 కి.మీ చేశారు. ప్రజ సమస్యలను దగ్గరగా చూశారు.  జగనన్న రావాలి. ప్రతి రైతు తలెత్తుకునేలా చేస్తాం. రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ప్రతి రైతన్నకు పెట్టుబడి సాయంగా మే నెలలోనే రూ. 12, 500 అందిస్తారు. గిట్టుబాటు ధర కోసం 3వేల కోట్ల రూపాయలతో నిధి ఏర్పాటు చేస్తారు. కరువులు, ప్రకృతి విపత్తులు వస్తే రైతులు ఎదర్కొవడానికి 4వేల కోట్ల రూపాయలతో మరో నిధిని ఏర్పాటు చేస్తారు.కరువులు వచ్చినప్పుడు రైతులు నష్టపోకుండా నాలుగు వేల కోట్లతో నిధి ఏర్పాటు చేస్తాం.  

క్రమంగా పూర్తి మద్యపాన నిషేధం...
విద్యార్థుల కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తారు. ఎంత చదువు చదివిన ఆ ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది. విద్యార్థులకు హాస్టల్‌, మెస్‌ చార్జీలను కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది. 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ మహిళలకు వైఎస్సార్‌​ చేయూత కింద 75 వేల రూపాయలు నాలుగు దఫాలుగా చెల్లిస్తాం. అక్కాచెల్లెమ్మలకు సున్నా వడ్డీ రుణాలు ఇవ్వడంతో పాటుగా ఎన్నికల నాటికి ఉన్న బకాయిలను నాలుగు దఫాలుగా మాఫీ చేస్తారు. మళ్లీ సున్నా వడ్డీలకే రుణాలు ఇస్తారు. ఎక్కడ వైద్యం చేయించుకున్నా ఆరోగ్య శ్రీ వర్తింపజేస్తారు. అవ్వ తాతలకు పింఛన్‌ మూడు వేల రూపాయలకు పెంచుకుంటూ పోతాం. వికలాంగులకు మూడు వేల రూపాయలు పింఛన్‌ ఇస్తూ.. ప్రతి విషయంలో వారికి అండగా నిలుస్తాం. పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేటట్టు చట్టం చేస్తాం. ప్రభుత్వ కాంట్రాక్టులు నిరుద్యోగ యువతకే అవకాశం ఇస్తాం.ప్రతి ఊరికి, పల్లెకు పైపులైన్ల ద్వారా తాగునీరు అందజేస్తాం. క్రమంగా పూర్తి మద్యపాన నిషేధం చేస్తాం. ప్రజా తీర్పు బై బై బాబు. చెప్పినవే కాకుండా.. ప్రజా సంక్షేమం కోసం చెప్పనవి కూడా చేస్తామ’ని తెలిపారు.

మరిన్ని వార్తలు