సీఎం ఎలా ఉండాలో వైఎస్సార్‌ చూపించారు: షర్మిల

3 Apr, 2019 19:02 IST|Sakshi

సాక్షి, కృష్ణా: ‘దివంగత మహానేత రాజశేఖరరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ప్రతి ఒక్కరిక భరోసా ఉండేది. ఉచితంగానే కార్పొరేటు ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేసుకునే వీలు ఉండేంది. ఫోన్‌ చేస్తే 20 నిమిషాల్లో 108 వచ్చేది. ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని.. ప్రతి పేదవాడికి ఇళ్లు ఉండాలని వైఎస్సార్‌ ఆశపడేవారు. ఐదేళ్లలో ఒక్క రూపాయి ఏ చార్జీ పెంచకుండా.. ఏ పన్ను పెంచకుండా.. అన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేసి సీఎం ఎలా ఉండాలో వైఎస్సార్‌ చూపించారు. కులం, మతం, పార్టీలతో సంబంధం లేకుండా వైఎస్సార్‌ ప్రతి ఒక్కరికి మేలు చేశారు.’ని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల పేర్కొన్నారు. బుధవారం కైకలూరు నియోజకవర్గం కలిదిండిలో జరిగిన బహిరంగ సభలో షర్మిల ప్రసంగించారు. 

ఇంకా షర్మిల మాట్లాడుతూ.. ‘చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో రైతులను, డ్వాక్రా మహిళలను, విద్యార్థులను, ఇలా ప్రతి ఒక్కరిని మోసం చేశారు. రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్న చంద్రబాబు వారిని వంచించారు.  డ్వాక్రా మహిళలను ఒక్క రూపాయి వడ్డీ కూడా మాఫీ చేయలేదు. పసుపు-కుంకుమ పేరుతో చంద్రబాబు మళ్లీ మహిళలను మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. పసుపు-కుంకుమ పేరిట చంద్రబాబు ఎంగిలి చేయి విదిలిస్తున్నారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్న చంద్రబాబు దానికి తూట్లు పొడిచారు. వైఎస్సార్‌ హయంలో ఉన్నట్టు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వస్తుందా?. ఆరోగ్య  శ్రీ జాబితా నుంచి కార్పొరేటు ఆస్పత్రులను తొలగించారు. కానీ చంద్రబాబు నాయుడు కుటుంబం ప్రభుత్వ ఆస్పత్రికి కెళ్లి వైద్యం చేయించుకుంటుందా?.

16వేల కోట్ల రూపాయల అంచనా ఉన్న పోలవరాన్ని తన కమిషన్ల కోసం 60వేల కోట్లకు చంద్రబాబు పెంచారు. తన బినామీల కోసం కేంద్రం కట్టాల్సిన పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు తానే కడతానని తీసుకున్నారు. మూడేళ్లలో పోలవరం పూర్తి చేస్తానన్న చంద్రబాబు మాట మీద నిలబడ్డారా?. తనకు ఏదో అనుభవం ఉందని, ఏదో చేసేస్తానని రాజధాని నిర్మిస్తానని తోపులా కబుర్లు చెప్పారు. చంద్రబాబు ఒక్క శాశ్వత నిర్మాణం అయిన చేపట్టారా?. బీజేపీ ప్రభుత్వం 2500 కోట్లు ఇచ్చామని చెబుతుంటే చంద్రబాబు రాజధానిలో చేసిందేమీ లేదు. అమ్మకు అన్నం పెట్టడు కానీ పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానని అన్నట్టు  ఉంది చంద్రబాబు తీరు. ఐదేళ్లలో అమరావతిలో ఒక శాశ్వత నిర్మాణం చేపట్టని చంద్రబాబు.. మళ్లీ అధికారం ఇస్తే అమెరికా చేస్తానని అంటున్నారు. శ్రీకాకుళంను హైదరాబాద్‌ చేస్తానని మన చెవుల్లో పూలు పెడుతున్నారు.

బాబు వస్తే జాబు వస్తుందన్నారు. కానీ చంద్రబాబు గారి కుమారుడు లోకేశ్‌కు మాత్రమే జాబు వచ్చింది. ఏకంగా లోకేశ్‌కు మూడు మంత్రి పదవులు ఇచ్చారు. లోకేశ్‌కు జయంతికి, వర్ధంతికి తేడా తెలియదు. చంద్రబాబుది పుత్ర వాత్సల్యం కాదా?. ఇప్పుడు చంద్రబాబు మీ భవిష్యత్తు నా భాద్యత అని అంటున్నారు. గత ఐదేళ్లుగా ప్రజల భవిష్యత్తు చంద్రబాబు బాధ్యత కాదా?. ఈ ఐదేళ్లు లోకేశ్‌ కోసమే చంద్రబాబు పనిచేశారు. 40 ఏళ్లలో ఆంధ్ర రాష్ట్రం ఎంత అప్పు చేసిందో.. చంద్రబాబు ఈ నాలుగేళ్లలో అంత అప్పు చేశారు.

పోరాపాటున కూడా టీడీపీకి ఓటేస్తే మన ఊరి మనమే తీసుకున్నట్టు మెన్న ఓ వీడియోలో లోకేశ్‌ చెప్తున్నారు. బంధు ప్రీతి, మత పిచ్చి, కుల పిచ్చి ఉన్నా పార్టీ టీడీపీ అవునా తమ్ముళ్లు అని లోకేశ్‌ అడుగుతున్నారు. టీడీపీ పాలనలో ప్రతి దానిలో మాఫియా, అవినీతి, అక్రమాలు రాజ్యమేలుతుంది. ప్రధాని నరేంద్ర మోదీ, చంద్రబాబు కలిసి రాష్ట్రానికి అన్యాయం చేశారు. బీజేపీ రాష్ట్రానికి ఇంత ఘోరంగా మోసం చేసిందంటే అందుకు కారణం చంద్రబాబు. చంద్రబాబు హోదాపై రోజుకో మాట మాట్లాడుతున్నారు. తమకు బీజేపీతో పొత్తు ఉందని విష ప్రచారం చేస్తున్నారు. మాకు ఏ పార్టీతో పొత్తు లేదు... ఆ అవసరం కూడా లేదు. సింహం సింగిల్‌గానే వస్తుంది. నక్కలు మాత్రమే గుంపులుగా వస్తాయి.  వైఎస్‌ జగన్‌ భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తారని అన్ని సర్వేలు చెబుతున్నాయి. 

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశం బతికి ఉందంటే అది కేవలం వైఎస్‌ జగన​ వల్లనే. హోదా కోసం ఢిల్లీ వేదికగా వైఎస్‌ జగన్‌ ధర్నాలు, దీక్షలు చేశారు. రాష్ట్రంలో రోజుల తరబడి నిరహార దీక్షలు చేపట్టారు. గొప్ప రాజధాని కావాలంటే, రాజన్న పాలనలో లాగా అభివృద్ధి జరగాలంటే జగనన్న సీఎం కావాలి. ప్రతి ఒక్కరికి మేలు జరగాలంటే ప్రత్యేక హోదా రావాలి.. దానికి జగనన్న ముఖ్యమంత్రి కావాలి. రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ప్రతి రైతన్నకు పెట్టుబడి సాయంగా మే నెలలోనే రూ. 12, 500 అందిస్తారు. గిట్టుబాటు ధర కోసం 3వేల కోట్ల రూపాయలతో నిధి ఏర్పాటు చేస్తారు. కరువులను ఎదర్కొవడానికి 4వేల కోట్ల రూపాయలతో మరో నిధిని ఏర్పాటు చేస్తారు.  విద్యార్థుల కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తారు. ఎంత చదువు చదివిన ఆ ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది. విద్యార్థులకు హాస్టల్‌, మెస్‌ చార్జీలను కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది. 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ మహిళలకు వైఎస్సార్‌​ చేయూత కింద 75 వేల రూపాయలు నాలుగు దఫాలుగా చెల్లిస్తాం. అక్కాచెల్లెమ్మలకు సున్నా వడ్డీ రుణాలు ఇవ్వడంతో పాటుగా ఎన్నికల నాటికి ఉన్న బకాయిలను నాలుగు దఫాలుగా మాఫీ చేస్తారు. మళ్లీ సున్నా వడ్డీలకే రుణాలు ఇస్తారు. ఎక్కడ వైద్యం చేయించుకున్నా ఆరోగ్య శ్రీ వర్తింపజేస్తారు. ఈ ప్రాంతంలో నీటి సమస్య లేకుండా.. మీ సంక్షేమం కోసం అన్ని చర్యలు తీసుకుంటాం. ఏ ఒక్కరికి అన్యాయం జరగనివ్వం. ఎరువుల ప్యాక్టరీ రాకుండా చూస్తాం. మళ్లీ దుర్మార్గపు పాలన మనకు అవసరం లేదు. రాజన్న రాజ్యానికి మళ్లీ నాంది పలకండిఎంపీ అభ్యర్థి కోటగిరి శ్రీధర్‌, ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వరరావు గార్లను భారీ మెజారిటీతో గెలిపించండి. ఓటు వేసే సమయంలో ఒక్కసారి రాజన్నను తలచుకోండ’ని కోరారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు