బాబు బాగోతాన్ని అజయ్‌ కల్లమే బయటపెట్టారు : వైఎస్‌ షర్మిల

7 Apr, 2019 21:59 IST|Sakshi

సాక్షి, తూర్పుగోదావరి : జాబు రావాలంటే బాబు రావాలి అని పదేపదే చెప్పిన చంద్రబాబు తెలుగు కూడా సరిగా రాని తన సుపుత్రడు  లోకేశ్‌ పప్పుగారికి మాత్రం ఏకంగా మూడు మంత్రి పదవులిచ్చారని వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ సోదరి వైఎస్‌ షర్మిల విమర్శించారు. తండ్రీ, కొడుకులు కలిసి రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆరోపించారు. గత నలభయ్యేళ్ల ఆంధ్రరాష్ట్ర చరిత్రలో లేనంత అవినీతి టీడీపీ ఐదేళ్ల పాలనలో జరిగిందని సాక్షాత్తూ చీఫ్‌ సెక్రటరీగా పనిచేసిన అజయ్‌ కల్లం చెప్పిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. బస్సు యాత్ర నిర్వహిస్తున్న షర్మిల ఆదివారం తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలోని కోటిపల్లి ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. 

అసలైన నాయకుడు వైఎస్సార్‌..
ప్రతి పేదవాడికి అండగా, ప్రతి రైతుకు ధైర్యంగా కలిగించేలా, ప్రతి మహిళకు భరోసా కలిగించేలా దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్‌ రాజశేఖర రెడ్డి పరిపాలన అందించారు. మన పర తేడా లేకుండా ప్రతి ఒక్క వర్గానికి మేలు చేసిన వ్యక్తి ఒక్క వైఎస్సార్ మాత్రమే. ఒక్క రూపాయి పన్ను పెంచకుండా గొప్ప పరిపాలన అందించిన రికార్డు వైఎస్సార్‌ది. అందుకే ఆయన చనిపోయినా కోట్ల మంది ప్రజల గుండెల్లో ఇంకా బతికే ఉన్నారు. కానీ, ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఎలా ఉన్నారు. వెన్నుపోటుకు, అబద్ధాలకు, అవినీతికి, అరాచకాలకు మారుపేరు బాబు. రైతు రుణమాఫీ అంటూ చేసిన మొదటి సంతకానికే దిక్కులేదు. డ్వాక్రామహిళలకు రుణమాఫీ చేస్తానన్నారు. ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు.  ఐదేళ్లు ఏమి చేయకుండా పసుపు కుంకుమ అంటూ భిక్షం వేస్తున్నట్లు ఇస్తున్నారు. ఎంగిలి చేయి విదిలిస్తున్నారు. అక్కా చెల్లెళ్లు మోసపోకండమ్మా. కేవలం​ మహిళలను మభ్యపెట్టడానికి చంద్రబాబు డబ్బులు ఇస్తున్నారు. 

బాబు వల్ల చదువులు ఆపేస్తున్నారు..
ఆరోగ్యశ్రీలో కార్పొరేట్‌ ఆస్పత్రులను తీసేశారు. చంద్రబాబు కుటుంబ సభ్యులు అయితే కార్పొరేట్‌ ఆస్పత్రిలో చికిత్స చేసుకోవాలట. సామాన్యులు అయితే ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం చేయించుకోవాలట. ఇదెక్కడి న్యాయం? ఇది అమానుషం కాదా. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వడం లేదు. పిల్లలకు ఫీజు కట్టలేక తల్లిదంద్రులు కట్టలేక అప్పులు పాలు అవుతున్నారు. తల్లిదంద్రులను అప్పుల పాలు చేయకుండా మధ్యలోనే చదువులు ఆపేస్తున్నారు. పోలవరం.. కేంద్రం కట్టాల్సిన ప్రాజెక్టు. కానీ కమిషన్‌ మింగొచ్చనని చంద్రబాబు ఆ ప్రాజెక్టును తీసుకున్నారు. 15వేల కోట్లు ఉన్న పోలవరం ప్రాజెక్టును 60వేలకోట్లకు పెంచారు. నిజానికి ఇది కేంద్రం చేయాల్సిన ప్రాజెక్టు. కానీ కమీషన్‌ కోసం చంద్రబాబు తీసుకున్నారు.  మూడేళ్లలో పూర్తి చేస్తా అన్నారు. చేశారా?  చిత్తశుద్ది ఉంటే పోలవరాన్ని నిర్మించేవారు.

ఆ సొమ్మంతా బాబు బొజ్జలో..
అమరావతి.. నాకు అనుభవం ఉందని, హైదరాబాద్‌ను నేనే కట్టానని, అమరావతిని నేనే కడతా అన్నారు. ఒక్క పర్మినెంట్‌ బిల్డింగ్‌ అయినా కట్టారా? కేంద్ర ప్రభుత్వం 2500 కోట్ల రూపాయలు ఇస్తే ఒక్క బిల్డింగ్‌ కట్టలేదు. ఏమైంది ఆ డబ్బంతా? ఆ డబ్బంత చంద్రబాబు బొజ్జలో ఉంది. అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు పెట్టిస్తాడట. ఐదేళ్లు సీఎంగా ఉండి అమరావతి ఒక్క పర్మినెంట్‌ బిల్డింగ్‌ కట్టలేదు కానీ ఇంకో ఐదేళ్లు ఇస్తే అమెరికా చేస్తారాట. మన చెవిలో పూలు పెడతాడట. నమ్ముతారా? నిన్ను నమ్మం బాబు అని తేల్చి చెప్పండి.

వేణుగోపాలకృష్ణ, అనురాధలను  భారీ మెజారిటీతో గెలిపించండి
ఈ నెల 11న ఎన్నికలు ఉన్నాయి. ఓటు వేసే సమయంలో ఒక్కసారి రాజన్నను తలచుకోండి. రాజన్న రాజ్యం రావాలంటే జగనన్న సీఎం కావాలి. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి రైతుకి పెట్టుబడి సాయం కింద ప్రతి మే మాసంలో రూ. 12500 రూపాయలు ఇస్తారు.  గిట్టుబాటు ధరకై మూడు వేల కోట్ల రూపాయలతోతో ఒక నిధి ఏర్పాటు చేస్తారు. డ్వాక్రా రుణాలు నాలుగు విడతల్లో మాఫీ చేస్తారు. సున్నా వడ్డికే రుణాలు ఇస్తారు. కాలేజీ విద్యార్థులు ఏ కోర్సు అయినా చదవచ్చు. ఏ కోర్సు చదివిన ప్రభుత్వం ఉచితంగా చదివిస్తుంది. ఆరోగ్య శ్రీలో కార్పొరేట్‌ ఆస్పత్రిలను చేరుస్తాం. పిల్లలను బడికి పంపించడానికి తల్లిదండ్రులకు రూ. 15వేలు ఇస్తాం.

అవ్వలకు తాతలకు పెన్షన్లు రూ. రెండు వేల నుంచి క్రమంగా మూడు వేలకు పెంచుతాం. వికలాంగులకు పెన్షన్లు మూడు వేలు ఇస్తాం. 45 సంవత్సరాల దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకి 75 వేల రూపాయిలు అందిస్తాం. రామచంద్రాపురం నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ , అమలాపురం వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థి చింతా అనురాధను భారీ మెజారీటీతో గెలిపించండి.మీ అమూల్యమైన ఓటు ఫ్యాన్‌ గుర్తుపై వేసి జగనన్నకు ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు.

మరిన్ని వార్తలు