దుర్గారావు మృతి.. రాష్ట్ర ప్రభుత్వ హత్యే: వైవీ సుబ్బారెడ్డి

24 Jul, 2018 15:22 IST|Sakshi

సాక్షి, ఏలూరు : ప్రత్యేక హోదా పోరాటంలో అమరుడైన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్త కాకి దుర్గారావు మృతి పట్ల ఆ పార్టీ మాజీ ఎంపీ, సీనియర్‌ నేత వైవీ సుబ్బారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దుర్గారావు మృతి.. రాష్ట్ర ప్రభుత్వ హత్యేనని ఆయన అన్నారు.  ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తుంటే.. ప్రజల ప్రాణాలెందుకు హరిస్తున్నారని ఆయన చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు.

పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో చేపట్టిన బంద్‌లో వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంటులో టీడీపీ వైఖరిని ప్రజలందరూ చూశారని అన్నారు. పార్లమెంటులో బీజేపీ, టీడీపీ వైఖరికి నిరసనగానే ఇవాళ రాష్ట్ర వ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చామని తెలిపారు. హక్కుల సాధన కోసం ప్రజలు పోరాటం చేస్తుంటే.. బంద్‌ను ఎలాగైనా అణచివేయాలని ప్రభుత్వం చూస్తోందని అన్నారు. దుర్గారావు మృతితోనైనా ప్రభుత్వం కళ్లు తెరువాలని అన్నారు. ఇప్పటికైనా ప్రత్యేక హోదా కోసం టీడీపీ ఎంపీలందరూ రాజీనామా చేయాలని అన్నారు. ప్రభుత్వం హోదా అణచివేత ధోరణి అవలంబిస్తోందని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.

మరిన్ని వార్తలు