జగన్ మాట తప్పడు: వైఎస్‌ విజయమ్మ

23 May, 2019 20:53 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: తన కుమారుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి అవుతారని తాను ముందే ఊహించానని వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ అన్నారు. దేవుడితో పాటు ప్రజల ఆశీస్సులు, భగవంతుడి కృప వల్లే విజయం దక్కిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డి తప్పకుండా అమలుపరుస్తారని తాను ఆశీస్తున్నట్లు విజయమ్మ తెలిపారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 30వ తేదీన విజయవాడలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

కాగా ఆంధ్ర ప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సునామీలో తెలుగుదేశం పార్టీ నామరూపాలు లేకుండా కొట్టుకుపోయింది. ఇక టీడీపీ బీ టీమ్‌గా బరిలో దిగిన జనసేన గ్లాస్ పగిలిపోయింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుండి వైఎస్సార్‌ జిల్లా వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ గిర్రున తిరిగింది. ఫ్యాన్‌ గాలికి సైకిల్ ఎగిరిపోయింది. నూటికి వెయ్యి శాతం టీడీపీ గెలుస్తుందని బీరాలు పలికిన చంద్రబాబు నాయుడి పార్టీ ఘోర పరాజయాలను మూటగట్టుకుంది. చంద్రబాబు తనయుడు నారా లోకేశ్‌తో పాటు టీడీపీ కేబినెట్‌లోని మెజార్టీ మంత్రులు పరాజయం పాలయ్యారు. అటు లోక్‌సభ ఎన్నికల్లోనూ వైఎస్సార్ సీపీ క్లీన్‌ స్వీప్‌ చేస్తోంది. మొత్తం 25 లోక్ సభ స్థానాల్లోనూ వైఎస్సార్ సీపీ అభ్యర్ధులు ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభంజనంతో టీడీపీ శ్రేణుల్లో నిస్తేజం అలుముకుంది.

మరిన్ని వార్తలు