‘చంద్రబాబు ఐదేళ్ల పాలనంతా అవినీతిమయం’

31 Mar, 2019 20:46 IST|Sakshi

సాక్షి, శ్రీకాకుళం : చంద్రబాబు పాలనలో రైతులు అప్పుల్లో కూరుకుపోయారని, ఏ పంటకూ గిట్టుబాటుధర లేదని, రుణమాఫీ పేరుతో చంద్రబాబు రైతులను మోసం చేశారని, చంద్రబాబు ఐదేళ్ల పాలనంతా అవినీతిమయమని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ అన్నారు. ఆముదాలవలస నియోజకవర్గంలో పొందూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచారం సభల్లో విజయమ్మ మాట్లాడుతూ.. వైఎస్సార్‌ పాలనలో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉన్నారని గుర్తు చేశారు. వైఎస్సార్‌ ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను కూడా నెరవేర్చారని పేర్కొన్నారు. ఎన్నికల కోసమే చంద్రబాబు పసుపు-కుంకుమ అని అంటున్నారని, గ్రామాల్లో తాగునీరు కంటే మద్యం విచ్చలవిడిగా దొరుకుతుందన్నారు.

ఏం చేశారని ఓట్లు అడుగుతున్నారు..
ఐదేళ్ల బాబు పాలనలో 2.30లక్షల ఉద్యోగాల్లో ఒక్కటీ కూడా భర్తీ చేయలేదని అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఆరోగ్యపథకాలను నిర్వీర్యం చేశారని, మంత్రి యనమలకు పంటి నొప్పి వస్తే.. సింగపూర్‌ పంపించారని గుర్తు చేశారు. పేదవారు వైద్యం కోసం గవర్నమెంట్ ఆస్పత్రికి వెళ్లాలా అని ప్రశ్నించారు. వైఎస్‌ హయాంలో లక్షల మందికి 108 పునర్జన్మ ఇచ్చిందని, చంద్రబాబు ఏం చేశారని ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. రాష్ట్రానికి ఏదైనా కొత్త ప్రాజెక్ట్‌ తీసుకొచ్చారా అని దుయ్యబట్టారు. పోలవరం ప్రాజెక్ట్‌ను వైఎస్సార్‌ ప్రారంభించారని, వైఎస్‌ హయాంలోనే వెలిగొండ, వంశధార, నాగావళి ప్రాజెక్ట్‌లను ప్రారంభించారని గుర్తుచేశారు. 70శాతం వైఎస్‌ పూర్తి చేస్తే.. మిగిలిన పనులను కూడా బాబు చేయలేకపోయారని ఎద్దేవాచేశారు. వంశధార ప్రాజెక్ట్‌ నుంచి నీళ్లు ఆమదాలవలసకు రావాలంటే.. రైల్వే ట్రాక్‌ అడ్డుందన్నారు.. మూడు కిలోమీటర్లు వయటెక్‌ ద్వారా నీళ్లు రప్పించిన ఘనత వైఎస్సార్‌దేనని గుర్తు చేశారు. 

పొందూరులో పెన్షన్‌ కోసం 840 మందికోర్టుకు వెళ్లారన్నారు. జన్మభూమి కమిటీ సిఫార్సు చేసిన వాళ్లకే పెన్షన్లు ఇస్తున్నారని పేర్కొన్నారు. ఇసుక, మట్టి, చివరకు గుడి భూములు కూడా దోచుకుంటున్నారని విమర్శించారు. హెరిటేజ్‌ కోసం చాలా డెయిరీలను మూసివేయించారని అన్నారు. ఐదేళ్ల బాబు పాలనలో అమరావతిలో ఒక్క ఇటుక పెట్టలేదని ఆరోపించారు. రైతుల దగ్గర భూములు తీసుకుని తన బినామీలకు కేటాయించారని విమర్శించారు. 

అప్పుడే నా కొడుకు భయపడలేదు..
తొమ్మిదేళ్ల నుంచి వైఎస్‌ జగన్‌కు మీరంతా అండగా ఉన్నారని.. వైఎస్‌ కుటుంబం ఎప్పటికీ ప్రజలకు రుణపడి ఉంటుందని అన్నారు. వైఎస్‌ మరణం తరువాత జగన్‌.. ఓదార్పు చేస్తానని మాటిచ్చారని.. ఇచ్చిన మాటకోసం కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చారని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చిన తర్వాతే.. కక్షగట్టి కేసులు పెట్టారన్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా.. నా కొడుకు అప్పుడే భయపడలేదు.. ఇప్పుడేం భయపడతాడని అన్నారు. వైఎస్‌ జగన్‌ది ఎవరి కాళ్ల మీదా పడే వ్యక్తిత్వం కాదన్నారు. నాలుగేళ్లు బీజేపీతో కలిసుండి.. ఇప్పుడు కాంగ్రెస్‌తో బాబు చేతులు కలిపారన్నారు. కేసీఆర్‌కు, ఆంధ్ర రాష్ట్రానికి ఏం సంబంధమని అన్నారు. ప్రత్యేక హోదా కోసం కడుపు మాడ్చుకుని జగన్‌ ఎన్నో దీక్షలు చేశారన్నారు. ప్రత్యేక హోదా వద్దని చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీ తీసుకున్నారన్నారు. జగన్‌ పోరాటాలతో ప్రత్యేక అంశం సజీవంగా ఉందన్నారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై 14సార్లు అవిశ్వాస తీర్మానం పెట్టారని గుర్తుచేశారు. హోదా కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎంపీలు రాజీనామాలుచేశారని, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ తరుపున 25మందిని గెలిపించమని కోరారు.

మరిన్ని వార్తలు