ఫ్యాన్‌కే స్పష్టమైన ఆధిక్యం

20 May, 2019 03:29 IST|Sakshi

సీపీఎస్‌ సంస్థ అధినేత డా. వేణుగోపాల రావు

సాక్షి, హైదరాబాద్‌: ఏపీ ఎన్నికలపై సెంటర్‌ ఫర్‌ సెఫాలజీ స్టడీస్‌ మూడు సార్లు శాస్త్రీయంగా సర్వే చేసిందని ఆ సంస్థ చైర్మన్‌ డా. వేణుగోపాలరావు తెలిపారు. ఎగ్జిట్‌ పోల్‌లోనూ ఆ పార్టీకి మరింత ఆదరణ కనిపించిందని వివరించారు. ఎగ్జిట్‌ పోల్‌ వివరాలను ఆదివారం సాయంత్రం ఆయన సాక్షి మీడియాకు తెలిపారు. వైఎస్సార్‌సీపీకి క్లియర్‌ కట్‌ ఎడ్జ్‌ ఉందని తెలిపారు. టీడీపీ గ్రాఫ్‌ 2017 నుంచి పడిపోతూ, వైఎస్సార్‌సీపీ గ్రాఫ్‌ పెరుగుతోందని ఆయన వివరించారు. 2017లో ట్రాకర్‌లు పెట్టి ఇప్పటికి ప్రీపోల్, ఎగ్జిట్‌ పోల్, పోస్ట్‌పోల్‌...ఇలా  మూడుసార్లు సర్వే చేశామని తెలిపారు.  2017 జూలైలో 1.05,000 శాంపిల్స్‌తో సర్వే చేయగా వైఎస్సార్‌సీపీకి 45.2 శాతం, టీడీపీకి 43.2 శాతం ఓటర్లు మొగ్గు చూపగా టీడీపీకి 82 సీట్లు, వైఎస్సార్‌సీపీకి 93 నియోజకవర్గాల్లో ఆధిక్యం లభించిందని వేణుగోపాలరావు వివరించారు.

2018 డిసెంబర్‌లో చేపట్టిన సర్వేలో వైఎస్సార్‌సీపీకి 44.2 శాతం, టీడీపీకి 41.5 శాతం ఓటర్లు మద్దతు పలికారని వివరించారు. వైఎస్సార్‌సీపీకి 98–110 సీట్లలోనూ, టీడీపీకి 55–63 సీట్లలో ఆధిక్యం కనపడింది. మూడో ట్రాకర్‌ ద్వారా చేపట్టిన సర్వేలో నియోజకవర్గానికి 2.500 శాంపిల్స్‌తో సర్వేచేశామని తెలిపారు. దీనిలో 47.8 శాతం వైఎస్సార్‌సీపీకి, 43.3 శాతం టీడీపీకి అనుకూలంగా ఉంది. టీడీపీ 53 స్థానాల్లో, వైఎస్సార్‌సీపీకి 122 సీట్లలో ఆధిక్యాన్ని కనబరిచింది. ఏప్రిల్‌ 2న చేపట్టిన ప్రీపోల్‌ సర్వేలో వైఎస్సార్‌సీపీకి 123 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ, టీడీపీ 48–51 స్థానాల్లో, జనసేన ఒక స్థానంలో గెలిచే అవకాశాలు కనిపించాయని వేణుగోపాలరావు వివరించారు. ఈ విధంగా వైఎస్సార్‌సీపీ గ్రాఫ్‌ పెరుగుతుండగా, టీడీపీ గ్రాఫ్‌ పడిపోతుందని ఆయన తెలిపారు. ఎగ్జిట్‌ పోల్‌లో వైఎస్సార్‌సీపీకి 133–135 అసెంబ్లీ స్థానాల్లో, టీడీపీకి 37–40 స్థానాల్లో, జనసేనకు ఒక్క స్థానంలో ఆధిక్యం ఉందన్నారు. పార్లమెంట్‌కు...వైఎస్సార్‌సీపీకి 21–22 స్థానాల్లో, టీడీపీకి 3–4 స్థానాల్లో గెలుపు అవకాశాలున్నాయన్నారు.
 
పోల్‌మేనేజ్‌మెంట్‌లో వైఎస్సార్‌సీపీ సఫలం...
వైఎస్సార్‌సీపీ పోల్‌మేనేజ్‌మెంట్‌లో ముందుంది. ఈసారి జగన్‌కు ఒక అవకాశం అనేది బాగా వినిపించి అది వేవ్‌గా మారిందని ఆయన చెప్పారు.  సోషల్‌ మీడియా కాంపెయిన్‌లో వైఎస్సార్‌సీపీ దూసుకుపోయింది. పసుపు–కుంకుమ, డ్వాక్రా మహిళలకు టీడీపీ ప్రవేశపెట్టిన పథకాలు ఫలించలేదు. పసుపు–కుంకుమ మహిళలు, డ్వాక్రా మహిళలు, నాన్‌ డ్వాక్రా మహిళల్లో ఎక్కువ మంది వైఎస్సార్‌సీపీకే మొగ్గుచూపారని  వివరించారు. 

మరిన్ని వార్తలు