తుపాను బాధితులను ఆదుకోవాలి: వైఎస్సార్‌ సీపీ

20 Oct, 2018 19:20 IST|Sakshi

సాక్షి, విజయనగరం: శ్రీకా​కుళం జిల్లాలోని తిత్లీ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పది పదిహేను రోజుల్లో వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పర్యటిస్తామని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. బాధితులను స్వయంగా కలుస్తారని చెప్పారు. తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన రెండు కమిటీలు రూపొందించిన నివేదికలను వైఎస్ జగన్‌కు అందించారు.

అనంతరం పార్టీ నేతలతో కలిసి ధర్మాన ప్రసాదరావు విలేకరులతో మాట్లాడుతూ... తుపాను నష్టం గురించి అన్ని వివరాలను జగన్‌ తెలుసుకున్నారని తెలిపారు. తుపాను కారణంగా రూ. 3,464 కోట్ల నష్టం వాటిల్లినట్టు అంచనా వేశారని, ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించి నిధులు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. అన్ని గ్రామాలకు కరెంట్, నీరు అందించాలని కోరారు. పార్టీలకు అతీతంగా బాధితులకు సహాయం అందించాలని, ఎవరికైనా అన్యాయం చేయాలని చూస్తే వైఎస్సార్ సీపీ తరపున పోరాటం చేస్తామని హెచ్చరించారు. టీడీపీ నేతల చేతివాటం లేకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అన్నారు.

మీరు ఇవ్వకపోతే మేమిస్తాం: భూమన
తుపాను బాధితులకు యుద్ధప్రాతిపదికన పరిహారం అందించాలని వైఎస్సార్‌ సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. బాధితులందరినీ కలిసి నష్టం అంచనాలు వేస్తున్నామని తెలిపారు. సహాయం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైతే ఆరు నెలల్లో వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి రాగానే మొత్తం నష్టం రూ. 3,464 కోట్లు విడుదల చేస్తుందని చెప్పారు. చంద్రబాబు మాటల ముఖ్యమంత్రి తప్పా చేతల సీఎం కాదని విమర్శించారు.

మరిన్ని వార్తలు