కార్మిక వర్గానికి సీఎం జగన్‌ పెద్దపీట

29 Sep, 2019 13:39 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: కార్మిక వర్గానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పెద్దపీట వేశారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ట్రేడ్‌ యూనియన్‌ అధ్యక్షుడు గౌతమ్‌రెడ్డి అన్నారు.అక్టోబర్‌ 4 నుంచి వైఎస్సార్‌ వాహన మిత్ర పథకం ప్రారంభం అవుతుందని, సంఘీభావంగా వారంపాటు అభినందనల ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దమ్మున్న నేతగా వైఎస్‌ జగన్‌ ప్రజల ముందుకు వచ్చి... ఇచ్చిన వాగ్ధానాలు అమలు చేస్తున్నారు. పిల్లిగంతులు వేసే చంద్రబాబు... వైఎస్సార్‌ సీపీ, ముఖ్యమంత్రిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబు 620 వాగ్ధానాలు చేసి, వాటిలో ఒక‍్కటి కూడా అమలు చేయలేదు. ఇంటికో ఉద్యోగం అని, అది కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. రివర్స్‌ టెండర్‌ చేస్తే చంద్రబాబుకు వచ్చిన నష్టం ఏంటో చెప్పాలని గౌతమ్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. విచారణలో చంద్రబాబు అవినీతి బయటపడుతుందని భయపడుతున్నారని గౌతమ్‌ రెడ్డి విమర్శించారు.

తాడేపల్లిలో ఆదివారం గౌతమ్‌ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘ గ్రామ స్వరాజ్యం జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యం. అవినీతిరహిత పరిపాలనను గ్రామ స్వరాజ్యన్ని ముఖ్యమంత్రి అందించబోతున్నారు. అయిదేళ్లలో అద్భుతమైన పరిపాలన మనం చూడబోతున్నాం. ఒకేసారి లక్షా 27వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు ఆర్టీసీని ప్రభుత్వపరం చేసి చరిత్ర సృష్టించారు.  పారిశుద్ధ్య కార్మికులకు రూ.18వేలు జీతం పెంచిన ఘనత కూడా ముఖ్యమంత్రికే దక్కుతుంది. చంద్రబాబు నాయుడు పిల్లిగంతులు వేస్తూ ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల ముందు వైఎస్‌ జగన్‌ ఇచ్చిన హామీలు, చంద్రబాబు ఇచ్చిన హామీలపై చర్చించడానికి మేం సిద్ధం. గత ప్రభుత్వంలో చంద్రబాబు తాను ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు’ అని అన్నారు. 

మరిన్ని వార్తలు