గ్రీన్‌ ఛాలెంజ్‌: స్వీకరించిన మిథున్‌ రెడ్డి

18 Aug, 2019 18:43 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ట్విటర్‌లో మళ్లీ గ్రీన్‌ ఛాలెంజ్‌ ట్రెండ్‌ అవుతోంది. తాజాగా టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు సంతోష్‌ కుమార్‌ విసిరిన గ్రీన్‌ ఛాలెంజ్‌ను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ మిథున్‌ రెడ్డి స్వీకరించారు. ప్రస్తుతం తాను అమెరికా పర్యటనలో ఉన్నానని, తిరిగి రాగానే మొక్కలు నాటి ఫోటోలు పోస్ట్‌ చేస్తానని ఆయన ట్వీట్‌ చేశారు. అంతేకాకుండా మిథున్‌ రెడ్డి కూడా ఎంపీలు సుప్రియ సులే, శ్రీకృష్ణదేవరాయ,  ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డికి ఛాలెంజ్‌ విసిరారు. 

కాగా ‘హరా హైతో భరా హై’ (పచ్చగా ఉంటే ఇంపుగా ఉంటుంది) అంటూ గత ఏడాది మొదలైన గ్రీన్‌ ఛాలెంజ్‌ రెండు కోట్ల మొక్కలు నాటే దాకా చేరుకుంది. ఒకరు మొక్కనాటి మరో ముగ్గురు మొక్కలు నాటి, సంరక్షించేలా రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమైన విషయం తెలిసిందే. గతంలో తాను స్వయంగా మొక్క నాటి, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, గవర్నర్‌ నరసింహన్, నటుడు నాగార్జునను నామినేట్‌ చేశారు. వారందరూ కూడా మొక్కలు నాటారు.

చదవండి: అడవి నవ్వింది!

ఇలా ఏడాది పాటు ఈ కార్యక్రమం కొనసాగింది. ప్రముఖులతో పాటు సామాన్యులూ భాగస్వామ్యం అయ్యారు. మొక్కలు నాటి, సెల్ఫీ దిగి పోస్ట్‌ చేయడం సోషల్‌ మీడియాలో భారీగా కొనసాగింది. మధ్యలో  ఈ లక్ష్యం ఒక కోటికి చేరినప్పుడు మొక్కను టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నాటారు. ప్రస్తుతం ఈ లక్ష్యం నేటికి రెండు కోట్ల మొక్కలకు చేరటంతో మరో సారి ఎంపీ సంతోష్‌ మొక్క(రెండు కోట్ల) నాటారు. గత ఏడాది తాను నాటిన మొక్క ఏపుగా పెరగటంతో మరోసారి సెల్ఫీ దిగి ట్విటర్‌లో ఆదివారం పోస్ట్‌ చేసారు. 

మరో నలుగరికి గ్రీన్‌ చాలెంజ్‌..
మరో నలుగురికి ఎంపీ సంతోష్‌ కుమార్‌ గ్రీన్‌ ఛాలెంజ్‌ విసిరారు. వైస్సార్‌ సీపీ ఎంపీలు విజయ సాయి రెడ్డి, మిథున్‌ రెడ్డి, సినీనటుడు అఖిల్‌ అక్కినేని, జిఎమ్మార్‌ అధినేత మల్లికార్జున్‌ రావును మొక్కలు నాటాల్సిందిగా సంతోష్‌ కోరారు. తెలంగాణకు హరితహారం స్ఫూర్తితో ‘ఇగ్నిటింగ్ మైండ్స్’ స్వచ్ఛంద సంస్థ గ్రీన్‌ ఛాలెంజ్‌ను చేపట్టింది.  

మరిన్ని వార్తలు