అక్రమ కేసులు..భయంతో కుటుంబ సభ్యులు

7 Mar, 2019 14:10 IST|Sakshi
ఎస్‌ఐ గోపీనాథ్‌తో మాట్లాడుతున్న బూడిదపాడు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు

సాక్షి, గూడూరు రూరల్‌: అధికారపార్టీ నేతల ఒత్తిడికి పోలీసులు తలొగ్గుతున్నారు. కొందరు వారికి తొత్తులుగా వ్యవహరిస్తూ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై  బైండో వర్‌ కేసులు నమోదు చేస్తున్నారు. వారి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కె.నాగలాపురం పోలీసు స్టేషన్‌ పరిధిలోని పెద్దపాడులో ఒకరు, కె.నాగలాపురంలో ఏడుగురు, సల్కాపురంలో తొమ్మిది, పర్లలో నలుగురు, మార్కాపురంలో ఏడుగురు, బూడిదపాడులో 11 మందిపై పోలీసులు బైండోవర్‌ కేసులను నమోదు చేశారు.  అయితే ఈ కేసులను నమోదు చేసిన వారిలో అత్యధికంగా వైఎస్సార్‌సీపీ  కార్యకర్తలు, నాయకులే ఉన్నారు. తమపై ఎలాంటి నేరారోపణలు, క్రిమినల్‌ కేసులు లేకపోయినా బైండోవర్‌ కేసులు నమోదు చేస్తున్నారని వాపోతున్నారు. పోలీసుల తీరుపై కోర్టులో ప్రైవేట్‌ కేసులు వేసేందుకు సిద్ధమవుతున్నారు.  

బైండోవర్‌ కేసు  నమోదు చేశారు 
ఎలాంటి క్రిమినల్‌ కేసులు లేని నాపై పోలీసులు బైండోవర్‌ కేసు నమోదు చేశారు.  నేనేం తప్పు చేశానని కేసు నమోదు చేశారని పోలీసులను అడిగితే సమాధానం చెప్పడం లేదు. 

–నరసింహారెడ్డి, కె.నాగలాపురం  

భయాందోళనకు గురి చేస్తున్నారు 
పోలీసులను మా ఇళ్లకు పంపి కుటుంబ సభ్యులను భయాందోళనకు గురి చేస్తున్నారు. గత మూడేళ్లుగా నేను వైఎస్సార్‌సీపీ కార్యకర్తగా పని చేస్తున్నాను. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని  పోలీసులు బైండోవర్‌ కేసు  నమోదు చేసి  స్టేషన్‌ చుట్టూ తిప్పుకుంటున్నారు.
 
– కొండారెడ్డి, బూడిదపాడు.   
ఆదేశాలు ఉన్నాయి 

ప్రతి రోజు 10 మందికి తగ్గకుండా బైండోవర్‌ కేసులు నమోదు చేయాలని ఎస్పీ నుంచి ఆదేశాలు ఉన్నాయి. అన్ని పార్టీలకు చెందిన వారిపై  కేసులు నమోదు చేస్తున్నాం.  
–గోపీనాథ్,  కె.నాగలాపురం ఎస్‌ఐ  

మరిన్ని వార్తలు