రేపు రహదారుల దిగ్బంధం.. ఎల్లుండి రైల్‌రోకో

9 Apr, 2018 18:12 IST|Sakshi

కేంద్రం మెడలు వంచేదిశగా వైఎస్సార్‌సీపీ పోరు ఉధృతం

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం మెడలువంచే దిశగా ఆందోళనలకు పిలుపిచ్చింది. మంగళవారం (ఏప్రిల్‌ 10న) రహదారుల దిగ్బంధం, బుధవారం (ఏప్రిల్‌ 11న) రైల్‌రోకో నిర్వహించనున్నట్లు పార్టీ ఒక ప్రకటన విడుదలచేసింది. వైఎస్సార్‌సీపీ ఎంపీల ఆమరణ దీక్షకు సంఘీభావంగా ఇప్పటికే అన్ని మండలాల్లో కొనసాగుతోన్న రిలే నిరాహారదీక్షలకు తోడు ఆందోళనా కార్యక్రమాలూ నిర్వహిస్తామని పార్టీ పేర్కొంది. రాష్ట్రవ్యాప్తం జరిగే ఈ ఆందోళనా కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులతోపాటు ప్రజలూ పాల్గొనాలని కోరారు.

హోదా సాధన పోరులో భాగంగా సభ్యత్వాలకు రాజీనామాలు చేసిన ఐదుగురు వైఎస్సార్‌సీపీ ఎంపీలు.. ఢిల్లీలోని ఏపీ భవన్‌ వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. సోమవారం నాటికి దీక్ష నాలుగో రోజుకు చేరింది. దీక్ష చేస్తూ అస్వస్థతకు గురైన ముగ్గురు ఎంపీలు మేకపాటి, వరప్రసాద్‌, వైవీ సుబ్బారెడ్డిలను పోలీసులు బలవంతంగా ఆస్పత్రికి తరలించారు. అవినాశ్‌రెడ్డి, మిథున్‌రెడ్డిలు యధావిధిగా దీక్ష కొనసాగిస్తున్నారు. వారికి మద్దతుగా రాష్ట్రంలో సంఘీభావ దీక్షలతోపాటు ఆందోళనలూ చేపట్టాలని వైఎస్సార్‌సీపీ పిలుపునిచ్చింది.

మరిన్ని వార్తలు