సాక్షి, విజయవాడ : మున్సిపల్ నిధులు ఎమ్మెల్యేలు వాడుకోవడం ఎంతవరకు సమంజసం అని విజయవాడ నగర పాలక సంస్థ వైఎస్సార్సీపీ ఫ్లోర్లీడర్ పుణ్యశీల ప్రశ్నించారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తమ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితిలో నగరపాలక సంస్థ లేకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. నగర పాలక సంస్థ వ్యవహారం అత్త సొమ్ము అల్లుడు దానంలా ఉందని ఎద్దేవా చేశారు. డిస్నిల్యాండ్ ఇంకా కొలిక్కిరాలేదని మండిపడ్డారు. ప్రభుత్వ వ్యవహారం చూస్తుంటే చివరికి సెంట్ భూమి లేకుండా చేస్తారన్నట్లుగా ఉందన్నారు. అన్ని అంశాలను సోమవారం జరిగే మున్సిపల్ సమావేశంలో ప్రస్తావిస్తామని పేర్కొన్నారు.