పొట్టి శ్రీరాములు నెల్లూరు: కాంగ్రెస్ది బస్సు యాత్ర కాదు తీర్ధయాత్ర అని వైఎస్సార్సీపీ నేత ఆనం రామనారాయణ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. నెల్లూరులో ఆనం విలేకరులతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు న్యాయం చేయకుండా ఉమ్మడి రాష్ట్రాన్ని విభజన చేసిన పాత్రధారులు, సూత్రధారులు బస్సు యాత్ర పేరుతో రాబోతున్నారని ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. రాబోయే ఎన్నికల్లో ఉనికి కాపాడుకునేందుకే కాంగ్రెస్ ప్రత్యేకంగా బస్సుయాత్ర మొదలు పెట్టిందని దుయ్యబట్టారు. ఏ మొహం పెట్టుకుని ఆంధ్ర రాష్ట్ర ప్రజల ముందుకు కాంగ్రెస్ వాళ్లు వస్తున్నారో చెప్పాలన్నారు.
చంద్రబాబుకు మద్ధతు ఇచ్చేందుకే కాంగ్రెస్ బస్సు యాత్ర పేరుతో నాటకాలాడుతోందని వ్యాఖ్యానించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తలపెట్టిన యాత్రలు కేవలం చంద్రబాబు కోసమేనని ఆరోపించారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీనే మొదటి నుంచి పోరాటం చేస్తోందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు రైతు రుణమాఫీ అంటూ కొత్తపాట పాడుతున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ పేరుతో రైతులని మరింతగా రుణ గ్రస్తులని చేస్తోందని మండిపడ్డారు.