నారాయణ రెడ్డి హత్యపై సమాధానం చెప్పు : బీవీ రామయ్య

23 Feb, 2019 13:41 IST|Sakshi

సాక్షి, కర్నూలు : దశాబ్దాలుగా కేఈ, కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డి కుటుంబాల మధ్య ఎందరో నలిగిపోయారు. ఇప్పుడు వారికి ఏం సమాధానం చెప్పి కోట్ల.. ఓట్లు అడుగుతారని వైఎస్సార్‌సీపీ నాయకుడు బీవీ రామయ్య ప్రశ్నించారు. శనివారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు వేసే ఒకటి రెండు సీట్ల భిక్ష కోసం కోట్ల.. జిల్లా రైతాంగాన్ని టీడీపీకి తాకట్టు పెట్టడం విచారకరమన్నారు. నిజంగానే కోట్ల కుటుంబానికి రైతుల మీద ప్రేమ ఉంటే గత నాలుగేళ్లుగా పెండింగ్‌ ప్రాజెక్ట్‌లపై ఎందుకు పొరాటం చేయలేదో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. తన స్వార్థం కోసం రైతుల పేరు అడ్డుపెట్టుకోవడం కోట్ల దిగజరారుడుతనానికి నిదర్శనమని రామయ్య మండిపడ్డారు.

2014, ఆగస్టు 15న చంద్రబాబు జిల్లాకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నేరవేర్చలేదని రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాకు జీవనాడి అయిన గుండ్రేవుల, వేదవతి పనులు చేయకపోగా.. హంద్రీనీవా నుంచి చెరువులకు చుక్క నీరు కూడా ఇవ్వలేదంటూ మం‍డి పడ్డారు. కర్నూల్‌ స్మార్ట్‌ సిటీ, ఆలూరు జింకల పార్క్‌, ఎమ్మిగనూరు టెక్స్‌టైల్‌​ పార్క్‌, నియోజకవర్గాల్లో గోడౌన్ల నిర్మాణం వంటి పనులు ఏం జరగలేదని తెలిపారు. రాష్ట్రంలోనే అత్యధికంగా కర్నూల్‌ జిల్లాలో 60 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే.. నీతివంతులం అని చెప్పుకుంటున్న నాయకులు వాటిపై నోరు కూడా విప్పలేదని ధ్వజమెత్తారు. గత నాలుగున్నరేళ్లుగా రైతులకు చేసిందేమిటో బహిరంగా చర్చకు రావాలని కోట్లను డిమాండ్‌ చేశారు.

చేరుకులపాడు నారాయణ రెడ్డి హత్యపై కోట్ల సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. నోరు తెరిస్తే నీతి, నిజాయతీ, విలువలు అంటూ ఊదరగొట్టే కోట్ల కుటుంబం నేడు వాటి విలువలను నడిబజార్లో విప్పేశారని మండి పడ్డారు.

మరిన్ని వార్తలు