సాక్షి, హైదరాబాద్ : ప్రత్యేకహోదాపై తమ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోరాటం చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు యూటర్న్ తీసుకున్నారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 600 హామీలు ఇచ్చిన చంద్రబాబు, ఒక్క హామీని నెవేర్చలేదన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవర్చడానికి వైఎస్సార్సీపీ కట్టుబడి ఉంటుందని తెలిపారు.
తప్పుడు వాగ్దానాలు, మోసపూరిత కుట్రలు, అనైతిక పొత్తులతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారని దుయ్యబట్టారు. చంద్రబాబు చేసిన మోసాలు ఎండగడుతూ తమ పార్టీ ప్రజల్లోకి వెళుతుందని భూమన తెలిపారు. ప్రతీక్షణం ప్రజల కోసం పరితపించే వైఎస్ఆర్ ఆశయాలను సమాధి చేయాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తే.. విలువలు, విశ్వసనీయత కోసం జగన్ పార్టీని ప్రారంభించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇటు ప్రాంతీయ పార్టీలు, అటు జాతీయ పార్టీలు ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా జగన్ మొక్కవోని దీక్షతో అన్ని సమస్యలను ఎదుర్కొంటున్నారని భూమన పేర్కొన్నారు.