‘ఆ నివేదిక మా అనుమానాన్ని నిజం చేసేలా ఉంది’

13 Nov, 2018 09:39 IST|Sakshi
వైఎస్సార్‌సీపీ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి

విజయనగరం: విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్‌ దర్యాప్తుపై వైఎస్సార్‌సీపీ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి స్పందించారు. విజయనగరంలో భూమన విలేకరులతో మాట్లాడుతూ..బ్యూరో ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ సెక్యూరిటీ(బీసీఏఎస్‌) నివేదికతో వైఎస్‌ జగన్‌పై ఎయిర్‌పోర్టులో జరిగిన దాడి ఘటన వెనక కుట్ర కోణం ఉందన్న విషయం మరోసారి బట్టబయలైందన్నారు.  బీసీఏఎస్‌ నివేదిక మా  అనుమానాన్ని నిజం చేసేలా ఉందన్నారు. దాడికి పాల్పడిన శ్రీనివాసరావుకు అక్టోబర్‌ నెల వరకు మాత్రమే విమానాశ్రయంలో అనుమతి ఉందన్న సివిల్‌ ఏవియేషన్‌ రిపోర్టులోని అంశం అనేక అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు.

ఈ అంశాలేవీ ఎందుకు బయటపెట్టడం లేదని అడిగారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్‌ దర్యాప్తుపై ప్రజలకు అనేక అనుమానాలు తలెత్తుతున్నాయని వ్యాఖ్యానించారు. కేసు నీరుగార్చేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని తాము మొదటి నుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. సిట్‌ దర్యాప్తు ప్రభుత్వ కనుసన్నల్లో కొనసాగుతోందని చెప్పారు. ప్రభుత్వం సిట్‌ అంటే కూర్చొనేలా స్టాండ్‌ అంటే నిల్చొనేలా సిట్‌ దర్యాప్తు ఉందని ఎద్దేవా చేశారు. అందుకే తాము ఓ స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేస్తున్నామని అన్నారు.

మరిన్ని వార్తలు