‘సీఎం అవినీతి కోసం ఈ ప్రాంతాన్ని పణంగా పెట్టారు’

22 Mar, 2019 17:15 IST|Sakshi

సాక్షి, చీపురుపల్లి(విజయనగరం) : చంద్రబాబు నాయుడు మాయ మాటలు నమ్మి మరోసారి మోసపోవద్దని  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ మేరకు చీపురుపల్లి ఎమ్మార్వో కార్యాలయంలో శుక్రవారం నామినేషన్ పత్రాలు సమర్పించారు.

ఈ సందర్భంగా చీపురుపల్లి మూడు రోడ్ల జంక్షన్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఆశయాలతో వైఎస్‌ జగన్‌ ప్రజల ముందుకు వస్తున్నారని.. తనను ఆశీర్వదించమని కోరారు. ఎమ్మెల్యేగా ఉంటూ ప్రతి గ్రామానికి త్రాగునీటి సమస్య పరిష్కరించానని ఆయన గుర్తు చేశారు. చీపురుపల్లికి డిగ్రీ కళాశాల సైతం తీసుకువచ్చామని పేర్కొన్నారు.

పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేశారు
చీపురుపల్లికి ఏం చేశారో నిన్నటి సభలో చంద్రబాబు చెప్పలేకపోయారని బొత్స విమర్శించారు. తాను దోపిడీకి పాల్పడ్డానని ఆరోపణలు చేస్తున్న చంద్రబాబు సీబీఐ ఎంక్వైరీ వేసి నిరూపించాలని సవాల్‌ విసిరారు. అత్యంత సమర్థమైన పోలీస్ వ్యవస్థను చంద్రబాబు నిర్వీర్యం చేసారని మండిపడ్డారు. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య జరిగి పదిరోజులైనా ఆ కేసును ఇంకా ఛేదించలేకపోవడం ఇందుకు నిదర్శనమన్నారు. ఇక జిల్లా నుంచి కేంద్రమంత్రిగా పనిచేసిన అశోక్ గజపతిరాజు ఉత్తరాంధ్రకు రావాల్సిన నిధుల గురించి ఒక్కసారి కూడా అడగలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి అవినీతి కోసం అశోక్ గజపతిరాజు జిల్లాలోని వెనుకబడిన ప్రాంతాలను పణంగా పెట్టారని దుయ్యబట్టారు.

మరిన్ని వార్తలు