బాబు సూచన మేరకే బీజేపీలో చేరుతున్నారు : సీ రామచంద్రయ్య

20 Jun, 2019 14:22 IST|Sakshi

సాక్షి, కడప : చంద్రబాబు సూచన మేరకే టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరుతున్నారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి సి రామచంద్రయ్య ఆరోపించారు. గురువారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకు బాబు ఎన్నో కుట్రలు కుయుక్తులకు పాల్పడ్డారని పేర్కొన్నారు. అదే తరహాలో ఇప్పుడు తన అవినీతి, అక్రమాలు బయటకు రాకుండా ఉండేందుకు కుయుక్తులు పన్నుతున్నారన్నారు. అందుకే తన పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులను బీజేపీలో చేరాలని చంద్రబాబు వారికి పరోక్షంగా సూచించారని ఆయన ఆరోపించారు.

ఇతర పార్టీల ఎంపీలను బీజేపీలో చేర్చుకునే ముందు మోదీ పునరాలోచించాలన్నరు. ప్రజాస్వామ్యం మనుగడ సాగించాలంటే.. అతినీతి, అక్రమాలకు పాల్పడిన వారికి మద్దతు ఇవ్వకూడదని రామచంద్రయ్య కోరారు. తన అనుచర వర్గాలను కాపాడుకునేందుకు బాబు ప్రయత్నిస్తున్నారన్నారు. టీడీపీ ఎంపీలను బీజేపీలో చేర్చేందుకే బాబు విదేశి పర్యటన చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బీజేపీలో చేరేవారిని ముందు తమ పదవులకు రాజీనామా చేసి రావాలని మోదీ సూచించాలన్నారు. బాబు లాంటి వారిని ప్రోత్సాహిస్తే ప్రజాస్వామ్యానికే పెద్ద​ ప్రమాదం అని ఆయన హెచ్చరించారు.

మరిన్ని వార్తలు