ఏపీలో మరో 30 ఏళ్లు వైసీపీదే అధికారం: సి.రామచంద్రయ్య

5 Sep, 2019 15:07 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు గురించి అయ్యన్న పాత్రుడితో మాట్లాడించింది చంద్రబాబు నాయుడే అంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి సి.రామచంద్రయ్య ఆరోపించారు. గురువారమిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో మరో 30 ఏళ్లు వైఎస్సార్‌సీపీనే అధికారంలో ఉంటుందని చంద్రబాబుకు అర్థమయ్యింది. అందుకే అయ్యన్న పాత్రుడి ద్వారా టీడీపీ.. బీజేపీ, జనసేనతో కలిసి పోటీ చేస్తుందని చెప్పించారన్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఖాళీ అయ్యింది.. అలానే ఏపీలో కూడా త్వరలోనే టీడీపీ ఖాళీ అవుతుందని ఆయన జోస్యం చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 100 రోజుల పాలనలో చంద్రబాబు వంద అబద్ధాలు.. 101 కుట్రలు చేశారని ఆరోపించారు. టీడీపీ కార్యకర్తలపై దాడులు జరిగిన మాట వాస్తవమే ఐతే.. నిజంగానే 8మందిని  హత్య చేస్తే.. ఎందుకు మీడియాలో రాలేదు.. ఎందుకు పోలీస్‌ రికార్డుల్లోకి ఎక్కలేదని ఆయన ప్రశ్నించారు. గ్రామాల్లో జరిగే చిన్న చిన్న గొడవలను తన రాజకీయ ప్రయోజనాల కోసం బాబు పెద్దవిగా చూపుతూ రాద్ధాంతం చేస్తున్నారని రామచంద్రయ్య మండి పడ్డారు.

పార్టీ కార్యక్రమాలకు ఎవరూ రాకపోవడంతో చంద్రబాబు డబ్బులిచ్చి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారని రామచంద్రయ్య ఆరోపించారు. పెయిడ్‌ ఆర్టిస్ట్‌లను తీసుకొచ్చి జగన్‌ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తెలుగుదేశం పాలనలో ప్రభుత్వ అధికారుల మీద టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు దాడి చేస్తే బాబు ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. కోడెల అరాచకాలపై సిట్‌ ఏర్పాటు చేసే పరిస్థితి వస్తే.. చంద్రబాబు ఎందుకు మాట్లాడలేక పోతున్నారని ప్రశ్నించారు. టీడీపీ నేతలు ఆంబోతుల్లా తయారై రాష్ట్రాన్ని దోచుకున్నారని మండి పడ్డారు. చంద్రబాబుకు నచ్చిన 10 గ్రామాలను ఎంచుకుని.. జన్మభూమి కమిటీల వలన జరిగిన అన్యాయాలపై.. జగన్‌ ప్రభుత్వం వలన జరిగిన మేలుపై చర్చ పెడదాం. అందుకు బాబు సిద్ధమేనా అని ఆయన ప్రశ్నించారు. జగన్‌ సంక్షేమ పాలన నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని రామచంద్రయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు