ఆ పాపం ఊరికే పోదు చంద్రబాబూ: దాడి

8 Apr, 2019 17:37 IST|Sakshi
వైఎస్సార్‌సీపీ నేత దాడి వీరభద్రరావు(పాత చిత్రం)

విశాఖపట్నం: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్ర రావు మరోసారి మండిపడ్డారు. సోమవారం దాడి వీరభద్రరావు విలేకరులతో మాట్లాడుతూ..ఎన్టీఆర్‌ను వాడు వీడు అనే నైతిక హక్కు నీకెక్కడిదని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. నీకు దమ్ముంటే ఎన్టీఆర్‌ పేరు తొలగిస్తున్నట్లు చెప్పు.. ప్రజలు నిన్ను(చంద్రబాబు) తరిమి కొట్టడం ఖాయమన్నారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచావు.. మరో 10 సంవత్సరాలు బతకాల్సిన ఆయన్ని చంపేశావు.. ఆ పాపం ఊరికే పోదని బాబుకు శాపనార్ధాలు పెట్టారు. నీకు నీతి నిజాయతీ అనేది అసలు ఉందా అని సూటిగా అడిగారు. నారా వారి పార్టీ అని పార్టీ పేరు పెట్టుకోండి..అసలు డిపాజిట్‌ కూడా రాదని ఎద్దేవా చేశారు. 

ఆ సునామీలో కొట్టుకుపోతావ్‌
‘ ఎన్టీఆర్‌ బిక్షతో నువ్వు బతుకుతున్నావ్. ఖబడ్దార్‌ ఎన్టీఆర్‌ అభిమానులకు, ప్రజలకు మండితే ఆ సునామీలో కొట్టుకుపోతావ్‌. సిగ్గుమాలిన రాజకీయాలు చేస్తున్నావ్‌.. చనిపోయిన ఆయన్ని పట్టుకుని వాడు వీడు అంటావా?. కనీసం నీకు ఇంగిత జ్ఞానం ఉందా...? ఎన్టీఆర్‌ లేకపోతే అసలు నువ్వు ఈ పొజిషన్‌లో ఉండేవాడివా? పిల్లనిచ్చిన మామను వెన్నుపోడిచావు.. ఇక ప్రజల్ని పొడవడం నీకు అంత కష్టమేమీ కాదు. జాతీయ నాయకుడు అని చెప్పుకుంటావ్‌.. ఇదే నా నువ్వు ఎన్టీఆర్‌కు ఇచ్చే గౌరమ’ని చంద్రబాబు నాయుడిని దాడి వీరభద్రరావు కడిగి పారేశారు.

మరిన్ని వార్తలు