‘ఆ విషయం పవన్‌ కల్యాణే చెప్పాడు’

24 Feb, 2019 14:18 IST|Sakshi

సాక్షి, అమరావతి : రానున్న ఎన్నికల్లో డబ్బు గుమ్మరించాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్లాన్‌ చేస్తున్నారని, ప్రతి నియోజకవర్గంలో రూ.25 కోట్లు దించారంటూ పవన్‌ కల్యాణే చెప్పారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు. రాజ్యాంగ విరుద్ధమైన పాలన ఏపీలోనే చూస్తున్నామని తెలిపారు. గతంలో కాంగ్రెస్‌కు ఓటేస్తే వైఎస్సార్‌ సీపీకి వేసినట్లేనంటూ బాబు ఊదరగొట్టారని, ఇప్పుడు బీజేపీకి ఓటేస్తే వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి వేసినట్లేనంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఎప్పుడు ఏం చేస్తారో ఎవ్వరికీ అర్థం కాదని ఎద్దేవా చేశారు.

పోలవరం ప్రాజెక్టు గేట్లు చేసేందుకే రూ. 400కోట్లు ఖర్చుచేశారని వెల్లడించారు. ఈ ఐదేళ్లలో రైతులకు సహాయం చేయని బాబు ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని హామీలు గుమ్మరిస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ ఎన్నికలు వైఎస్‌ జగన్‌కు, చంద్రబాబుకు మధ్య జరుగుతున్న యుద్ధం కాదని, చంద్రబాబుకు, రాష్ట్ర ప్రజలకు మధ్య జరుగుతున్న యుద్ధమని వ్యాఖ్యానించారు. డబ్బు పట్టుకుని ఎవరు వచ్చినా పోలీసులకు అప్పగించాలని ప్రజలకు పిలుపుని​చ్చారు.

మరిన్ని వార్తలు